Wednesday, December 30, 2015

ఫేస్‌బుక్ - ప్రీ బేసిక్స్

ప్రీ బేసిక్స్ - ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఫేస్‌బుక్ వాడని వారున్నారా అనే విధంగా విస్తృత వ్యాపి పొందిన ఫేస్‌బుక్ నెట్ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటే, ఇక చెప్పనక్కరనేలేదు. వాళ్ళూ వీళ్ళూ అని కాక అందరూ ఎడాపెడా వాడేయగలుగుతారు. ఇలా ఫ్రీగా ఇవ్వడం బాగుందనుకుని పొలోమని ఫ్రీబేసిస్ కొరకు మెసేజ్‌లు పెట్టుకొంటూ పోతే ఆనక మొత్తంగా వట్టిపోతాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు మనం వాడేసుకొంటాం ఇంకేంటి సమస్య అంటే చాలా సమస్యలు ఉన్నాయి.
* ప్రకటనలు ఇప్పుడు వేలలో ఉంతే అవి లక్షల్లో ఉండచ్చు, వాటి వీక్షణ ద్వారా వాళ్ళు ఉచితానికి పెట్టే దానికి డబల్ త్రిబుల్ ఇన్‌కం లాగుతారు.
* పోటీ తత్వం నసించి నీరసించి పోయి ఇతర సైట్‌లు చాలా కనుమరుగైపోతాయి.
* బాగా డబ్బున్న కంపెనీల ఆధిపత్యం ద్వారా అంతర్జాలాన్ని కూడా కార్పోరేట్ సంస్థల మాదిరి తయారుచేస్తారు.
* ఇదో జాడ్యంలా మారి నెటిజన్ల సృజనకు అగాధంలా మారుతుంది.

* పిచ్చి పీక్స్‌కెళ్ళడం అనే మాట, లేదా వదిలించుకోలేని దురలవాట్ల సరసన ఫేస్బుక్ కూడా చేరుతుంది.
* యువతలో పని తత్వం తగ్గి పనికిమాలిన చాటింగ్ ద్వారా విలువైన జీవితకాలాన్ని కోల్పోతారు
ఉచితం ఉచితం అని మన రాజకీయనాయకులు చేతికి ఎముకలేని గొప్పోళ్ళ మాదిరి మన డబ్బుని వెదజల్లి మనలను వెదవలను చేస్తుంటే, వాటిని చూసి మనం పొంగిపోతూ మన వెనుక తాటాకులను మర్చిపోతున్నాం - తెల్ల వాళ్ళు అలాంటి పనులు చేయడంలో మనకన్నా బాగా ముందున్నారు

Wednesday, December 9, 2015

బాణభట్టు

కాదంబరి అనే అద్భుతమైన కావ్య రచన చేసిన కవి బాణభట్టు  ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. సంస్కృ కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి  కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం వలన. పదమూడు శతాబ్ధాలుగా వాజ్మయ రచయితగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.
వత్స గోత్రీకుడైన బాణుడు బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలో సోణా (సౌన్) నదీ తీరంలో ఉన్న పృధుకూట గ్రామంలో జన్మించాడు. ఊ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికూటగా పిలుస్తున్నారు. ఈయన తలిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే నడిచింది. తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణీంచుట వలన దేశ సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారంలో అనేకమంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యాపద్దతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకొన్నాడు.

బాణుడు కామ, అర్ధ, రాజనీతి, అలంకార శాస్త్రాలను అభ్యసించాడు. అతడి ప్రతిభా విశేషాలను విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతడిని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వనించాడు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వారికి వినిపించాడు. దానికి సంతసించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని కానుకలుగా సమర్పించాడని ఒక కథనం.

బాణుణి కాలం హర్షవర్ధనుని కాలంలో కనుక క్రీ.శ. 606 నుండి 648 వరకూ ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా.  బాణుడు హర్షచరిత్రతోపాటు కాదంబరిని కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేసాడు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కదా వస్తువుగా తీసుకోవడమనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమనుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణభట్టు పూర్తిచేసాడు. ఇతడిని ఇంకా పుళింద,పుళింద్ర  పేర్లతో పిలుస్తారు. అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తిచేసి పండితుల ప్రసంసలు పొందాడు.
సంస్కృత మూలంగా కల కాధంబరిని తెనుగులో
పేరాల భరతశర్మ గారు తన సిధ్ధాంత గ్రంధంలో మొత్తం కాదంబరి కధను చక్కని శైలిలో తెనించారు. అని హరిబాబు గారు పేర్కొన్నారు. అది ఎవరికైనా లభ్యత ఉంటె తెలియచేయగలరు.

Thursday, November 19, 2015

వాహన చోదకులారా జర భద్రం

ఎన్నో వాహనాలు వేగంగా వెళ్ళే రహదారుల ప్రక్క నివాసాలు ఉండే వారికి ఎందుకు భయం ఉండదు. అన్నీ రోడ్లమీదే చేస్తుంటారు. అటూ ఇటూ చూడటం వంటివి కూడా ఉండవు.
పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే
మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్కనే
వాహనాల వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి, రోడ్లప్రక్కన నివసించే ప్రజలు కాదు అనేది రూల్ అని అనుకుంటారా
ఇవన్నీ ప్రక్కన పెట్టినా ఏదైనా ప్రమాదం జరిగినా అదీ వాళ్ళ పొరపాటుగానే అయినా అక్కడ జరిగే సీన్ వర్ణించలేము.
పొరపాట్లు, పరిస్థితులు, ఏమీ ఉండవు.  - ఏకపక్ష నిర్ణయం - బండి వాడిదే తప్పు - వాడిని అర్జెంటుగా అడ్డంగా పట్టుకొని తన్నేసి ఆనక తీరిగ్గా విచారించి డబ్బు అయితే డబ్బు, కేసయితే కేస్
కనుక వాహన చోదకులారా జర భద్రం  :)
మీరే అక్కడ ఉంటె అందరిలా కాక  కొద్దిగా ఆలోచించండి - మందలో మనం ఒకరుగా కాదు

Monday, November 9, 2015

ఆన్లైన్లో కొనుగోళ్ళా

అమెజాన్, ఈబే, ప్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు బావున్నా కొన్ని సార్లు బాగా ఉండదు. ఇటీవలి నా అనుభవం - Envent Deejay Knight - 2.1 Bluetooth Multimedia Speaker తీసుకొన్నాను. మొదటిది బాగానే వచ్చింది. అది బావుందని మళ్ళీ ఆర్డర్ చేసాను అది చచ్చింది. కొద్దిఎక్కువగా  డామేజ్ అయ్యింది. అయితే బాగానే పలికేస్తుంది, పాడేస్తుంది. సరే రీప్లేస్ కొరకు అడిగితె అమెజాన్ వాడు పది దినాల్లో వెనక్కు పంపు వంద రూపాయలు పోస్టల్ చార్జీలకు మీ ఎకౌంట్ కు చేర్చుతాను అని ఇచ్చాడు. సరే అని పోస్టాఫీసుకు వెళితే దాని బరువుకు సుమారు 500 అయ్యిద్ది అన్నాడు. సరే కొరియర్ వాడిని అడిగితె వాడో 400 అవ్వుద్ది అన్నాడు. దీనికంటే దీనిని రిపేర్ చేయిన్చుకొంటే బెటరేమో అనిపించింది.   ఒకవేళ పది దినాల్లో వెనక్కు వెళ్ళకపోతే ఇక ఆ శాల్తీలు గాల్లో కలసి పోతాయోమో, ఇక అప్పటి నుండి మళ్ళీ అమెజాన్ తో వార్, కస్టమర్ కేర్తో బేకార్ - అందువలన పెద్ద సామాన్లు కొనాలంటే ఆన్లైన్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని నా నిచ్చితాభిప్రాయము 


Tuesday, September 8, 2015

సద్గురు మళయాళ స్వామి

                అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మళయాళ స్వామి, స్ర్తీలు కూడా దీక్షలు తీసుకోవచని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని.
               మలయాళ స్వామి తలిదండ్రులు కరియప్ప, నొత్తియమ్మ దంపతులు. కేరళలోని తిరువాయుర్ సమీపంలో 29-3-1885 వ తేదీన జన్మించారు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాదువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు.
చిన్నతనం నుండి అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం. జాలి దయ ఎక్కువగా ఉంటం. ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం. ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడు ధ్యానంలో ఉండటం చేసేవాడు చిన్నప్పటి నుండి ఆంగ్లం చదవటం ఇష్టం ఉండేది కాదు. దానికి బదులు సంస్కృతం నేర్వటానికి వెళ్లిపోయేవాడు

సన్యాస జీవితం ప్రారంభం

          తిరువంత పురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. ఆయన సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్ధులకు విద్యాబోధన చేసేవాడు.
వేళప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలపై సాదన చేసాడు. నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు ద్వారా పొంది. తురుగు పయనమైనాడు. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తల్లికి సేవలు చేసి నయం చేశాడు. వివాహం కొరకు అడిగితే తాను దేశాటన చేయాలని తిరస్కరించాడు .
వేళప్ప కాళి నడకతో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు. అలా తిరుతున్నపుడు అనారోగ్యంతో ఒక వార్ం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు స్వప్నంలో ఎవరో నోట్లో మత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం మరి దరిచేరలేదు.

తిరుమల సందర్శన

                  అనేక పుణ్య్క్షేత్రాలను దర్శించిన అనంతరం చివరగా ఆయన తిరుమలలోని గోగర్భం చేరారు. ఆ ప్రదేశం ఆయనకు నచ్చడం, అది తప్పసుకు అనుకూలంగా ఉందని భావించి కొంత కాల్ం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన నాటికి తండ్రి కాలషర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరారు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు. ఆయన బాష, వేషం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని అందరూ పిలిచే వారు. అదే తరువాత స్థిర నామంగా మారింది.
               మైసూరు తిరువెంకటాచార్యుడు అనే అతడు వెంకటేశ్వర పూజ చేసి రోజూ ప్రసాదం ఇచ్చి వెళ్ళేవాడు. తరువాత కొందరు భక్తులు రోజూ ఆయనకు ప్రసాదం అందిచేవారు.

ఆయన ద్వారా జరిగినట్టుగా చెప్పే కొన్ని లీలా విశేషాలు

  • తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు.
  • ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి ఒక వేటకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు.
  • తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకసనంద తీర్ధం నుండి, తుంబురు తీర్దానికి వెళ్లారు. భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు. ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఆహారం అందించాడు.
  • ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు.
  • వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం ఇచ్చే ఏర్పాటు చేశారు.
  • కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు.
  • తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు

వ్యాసాశ్రమం

              తిరుమల విడిచి ఏర్పేడు దగ్గర  కాశీ బుగ్గ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. కాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు. వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి, పంటలు పండించారు. జంతుబలి మాన్పించారు. ’’యదార్ధ భారతి ‘’ అనే పత్రికనుస్థాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు. అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది. కేరళలో నారాయణగురు గారు ఏమి బోధించారో, వ్యాసాశ్రమంలో అవన్నీ అమలు పర్ఛడానికి ప్రయత్నించారు.

సేవా కార్యక్రమాలు

  • బందరులో పట్టాభి సీతారామయ్య గారింట్లో గాంధీజీని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు. దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .
  • 1937లో ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలకూ, ఇతర కులాల వారికి భోదలు చేసారు.
  • 1943లో శివగిరిలో జ్ఞానయజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధలు చేసారు
  • 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు.
  • 1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసినపుడు వేలాది మంది పంచములు పాల్గొన్నారు.
  • వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించారు
12-7-1962 లో మళయాళ స్వామి కైవల్యం పొందారు. వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి. విద్యాప్రకాశానంద స్వామివారు ఈ ఆశ్రమాదిపతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరైనారు. వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అనిపిస్తుంది. ఇప్పుడు విద్యానందగిరి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు మళయాళ స్వామి

Thursday, September 3, 2015

గ్రంథాలయ సంఘం స్థాపన, అభివృద్ధి పరిణామం

తొలి గ్రంథాలయం

ఆంధ్రదేశంలో తొలి పౌర గ్రంథాలయాన్ని శ్రీ మంతిన ఆదినారాయణమూర్తి అనే ప్రాధమికోపాధ్యాయుడు 1886 వ సంuలో విశాఖపట్టణంలో నెలకొల్పినట్లు తెలుస్తుంది. ప్రారంభంలో ఒకరి ప్రోత్సాహంతోకాక ఎవరికివారు సంకల్పించుకొని, ఎక్కడికక్కడ కొన్ని గ్రంథాలయాలను నెలకొల్పారు. ఇలా 1905 నాటికి తెలుగునాట 20 గ్రంథాలయాలు లెక్కకు వచ్చాయి. అప్పట్లో వీరేశలింగం పంతులుగారి సంఘసంస్కరణోద్యమం, ఆంధ్రదేశంలో గొప్ప సంచలనాన్ని కలిగించిన వందేమాతరోద్యమం మనవారికి మాతృభాషపై అభిమానాన్ని పురికొల్పింది. తత్ఫలితం - పుస్తకాలు, పత్రికలు విరివిగా వెలువడ్డాయి. ఇవి కూడా గ్రంథాలయాల స్థాపనకు దోహదం చేశాయి. క్రమంగా గ్రంథాలయాల సంఖ్య పెరిగింది.

మొదటి గ్రంథాలయ మహాసభ సంఘస్థాపన

1914 లో బెజవాడలోని రామమోహన ధర్మ పుస్తక భాండాగార కార్యకర్తలకు దేశంలోని గ్రంథాలయ నిర్వాహకులందరిని సమావేశ పరచాలనే చక్కని ఆలోచన కలిగింది. ఏప్రియల్ 10 వతేదీన బెజవాడలో ప్రధమ ఆంధ్రదేశ గ్రంథభాండాగారుల మహాసభను చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
మహా సభ నిర్వహణతోనే ఆంధ్ర గ్రంథాలయోద్యమం - ఆంధ్ర గ్రంథాలయ సంఘం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ చరిత్రే ఆంధ్ర గ్రంథాలయోద్యమం. ఉద్యమ ప్రచారానికి ప్రజలను ఉత్తేజ పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మహనీయులతో మహా సభలు జరిగాయి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహా సభలు 40 జరిగాయి. ఇవి కాక మరెన్నో జిల్లా, తాలూకా మండలస్థాయి సభలు నిర్వహించారు. ప్రత్యేక సందర్భాల అవసరాన్ని బట్టి మరికొన్ని జరిపారు.
ఈ మహాసభకు గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ గుంటూరు, నెలూరు, కడప, కర్నూలు, బళ్ళారిజిల్లా, హైదరాబాదు సంస్థానంలోని సుమారు 60 గ్రంథాలయాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

కార్యవర్గం, సహాయకులు

శ్రీఅయ్యంకి వెంకట రమణయ్య, సూరి వెంకట నరసింహశాస్త్రి గార్లు మొదటగా ఆంధ్రప్రదేశ గ్రంథభాండాగార సంఘమును స్థాపించారు. తరువాత ఇది ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మారింది. ఈ సభలో సంఘ తొలి అధ్యక్షులుగా శ్రీమోచర్ల రామచంద్రరావు పంతులుగారిని , శ్రీయుతులు అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావుగారలను ప్రథమ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

పత్రిక ఏర్పాటు

గ్రంథాలయోద్యమాభివృద్ధి కోసం గ్రంథాలయ సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో పత్రికాప్రచురణ ఒకటి. సంఘ కార్యకర్తలు దేశంలోని వివిధ పత్రికలలో ప్రచురిస్తున్న వ్యాసాలతో తృప్తి చెందక ఉద్యమవ్యాప్తికి ప్రత్యేక పత్రికను నడుపుటకు నిశ్చయించి గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 వ సం.లో త్రైమాసిక పత్రికగా ప్రారంభించారు. రెండు సంవత్సరముల తరువాత ద్వైమాస పత్రికగా మార్చారు. 1921 సం. లో దీని ప్రచురణ నిలిచిపోయింది.
తొలి సంపుటాలలో గ్రంథాలయాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలతో పాటు బాలభటోద్యమ విషయాలు, సాహిత్య చర్చలు, ఆధునిక కవుల పద్యములు, గేయములు, మరెన్నో వైజ్ఞానిక రచనలు, అన్ని విషయములకు సంబంధించి వెలువడేవి. 1928 వ సం పునరుద్ధరించబడి, 1980-83 మధ్య కాలంలో 4 సంవత్సరములు ఆగిపోయి, తిరిగి 1934 లో ప్రారంభమై మొత్తం మిద 11 సంపుటములను పూర్తి చేసుకొంది. ఈ సంపుటములలో గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన అంశములతోపాటు గ్రంథ సమిక్షలను కూడా చేర్చారు.

1938 లో సంఘ నిర్వహణ బాధ్యత నుండి అయ్యంకి తప్పకున్న తరువాత 1939 సెప్టెంబరు 1941 అక్టోబరుల మధ్య కాలంలో సంవు పత్రిక ఆంధ్రగ్రంథాలయం" పేరుతో ఆంధ్రాంగ్ల భాషలలో త్రైమాసికగా నిర్వహించారు. ఆంగ్లంలో కూడా ఉండటం వలన దీని ప్రచారం బయట రాష్ట్రాలకు, ఖండాంతరాలకు కూడా ప్రాకినది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కాగితం కరువు ఏర్పడడంతో, కేంద్ర ప్రభుత్వం నెలకు పైబడిన వాయిదాలతో ప్రచురించు పత్రికలను నిలిపి వేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులతో 'ఆంధ్రగ్రంథాలయం ప్రచురణ నిలిచి పోయింది. దీనితో తెనాలి తాలూకా పెదపాలెం, అనంతపురం జిల్లా హిందూపురంలో వరుసగా జరిగిన 23, 24 ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభల సంచికలను పత్రికకు బదులుగా ప్రచురించారు. పరిస్థితులు అనుకూలించిన అనంతరం సంఘ స్థాపకులు అయ్యంకి వారి అభీష్టానుసారం గ్రంథాలయ సర్వస్వమును అదే పేరుతో 1948 జనవరిలో పునరుద్ధరించి 12వ సంపుటంగా ప్రారంభించారు. అప్పటి నుండి ఇది క్రమంగా నడుస్తుంది. ప్రస్తుతం 74వ సంపుటం వెలువడుతోంది.

ప్రచురణలు

  • ఉద్యమ ప్రారంభ దినాలలో గ్రంథాలయ సంఘ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించిన శ్రీ సూరి వెంకట నరసింహశాస్త్రిగారు గ్రంథాలయోద్యమాన్ని గురించి వివిధ పత్రికలలో ప్రచురించిన ఆంగ్ల వ్యాసముల సంపుటి "Library Movement in India" ను, తెలుగు పత్రికలలో వెలువడిన శ్రీ యాతగిరి లక్ష్మీ వెంకటరమణగారి వ్యాసాలను "గ్రంథాలయోద్యమము" శీర్షికతోను గ్రంథాలయ సంఘం ప్రచురించింది.
  • 1915, 1916 సం.లలో అప్పటికి దేశంలో పనిచేస్తున్న గ్రంథాలయాల చరిత్రను వెలువరించారు. కొన్ని సంవత్సరాల పాటు సంఘ వార్షిక నివేదికలు, గ్రంథాలయ మహాసభల సంచికలు, ఉద్యమ వ్యాప్తికి దోహదపడే పలు గ్రంథాలు, గ్రంథాలయ నిర్వహణకవసరమైన వివిధ పట్టికలను ప్రచురించారు. సంఘ స్థాపకులు అయ్యంకివారి షష్టిపూర్తిని పురస్కరించుకొని ఐదు చిరుపాత్తములు, సంఘాధ్యక్షులు గాడిచెర్ల వారి షష్టిపూర్తి సమయంలో ఆరు గ్రంథములు, స్వర్ణోత్సవాల సందర్భంలో గ్రంథాలయ ప్రగతి-3 భాగములు సంఘం ప్రచురించింది.
  • గ్రంథాలయములు, వయోజన విద్యకు సంబంధించిన పుస్తకములతోపాటు డా. కట్టమంచి రామలింగారెడ్డిగారి "ముసలమ్మ మరణం", శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి "తెలుగు నుడి దండలు", ఆంధ్రగ్రంథములు మొదటి జాబితా, ఆంధ్రవాజ్మయ సంగ్రహ సూచిక, శ్రీ సర్వోత్తమ జీవితము వంటి పుస్తకాలెన్నింటినో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురించింది.

మహాసభలు

గ్రంథాలయ సంఘం ద్వారా పలు సభలు సమావేశాలు నడిచాయి. 1919లో అయ్యంకి ప్రభృతులు ప్రథమ అఖిల భారత మహా సభను నిర్వహించారు. భారత వైజ్ఞానిక మంత్రిత్వశాఖ లాహోర్లో నిర్వహించిన పౌర గ్రంథాలయ సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అర్హులంటూ హాజరు కావాలకున్న మన ప్రతినిధులను నిరాకరించింది. దానితో ప్రజల ప్రాతినిధ్యం లేని సదస్సులు నిష్ఫలమని భావించి 1919 నవంబరు 1 న మద్రాసు గోఖలే హాలులో తొలి జాతీయ గ్రంథాలయ సదస్సును అపూర్వంగా నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుండి గ్రంథాలయ రంగప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులోనే అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘం ఏర్పడింది.
అనంతరం 1968 లో భారత గ్రంథాలయ సంఘం అభ్యర్థన మేరకు పైన మహాసభ జరిగిన రోజు నవంబరు 14 నుండి వారం రోజులపాటు గ్రంథాలయ వారోత్సవాలుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. 1996 లో భారతీయ గ్రంథాలయ సంఘ 41 వ జాతీయ సదస్సును మూడు రోజుల పాటు విజయవాడలో నిర్వహించారు.

గ్రంథాలయ శిక్షణ

గ్రంథాలయ కార్యక్రమం సవ్యంగా సాగడానికి గ్రంథాలయ శిక్షణ అవసరమని గుర్తించిన సంఘం 1920 వ సం. వేసవిలో మొట్టమొదట 20 మంది గ్రంథాలయ సేవకులకు బెజవాడలో ఒక నెల రోజులపాటు శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో గ్రంథాలయ నిర్వహణ పాఠాలతోపాటు రాజకీయము, అర్థశాస్త్రము, సాంఘిక సేవ మొదలగు విషయాలను బోధించేవారు.
రెండవసారి 1984 జూన్లో 80 మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చారు. ఈ బ్యాచ్‌లో గ్రంథాలయ శాస్త్ర పితామహ రంగనాధ్‌గారి శిష్యులు పుణ్యమూర్తుల రాజశేఖరం, కొఠారి రామారావుగారు బోధించారు. 30 మంది విద్యార్ధులలో వావిలాల'గోపాల కృష్ణయ్య, పాతూరి నాగభూషణం, కలిదిండి నరసింహరాజ వంటి ఉద్దండులు శిక్షణ పొందారు. తదుపరి ఈ బాధ్యతను తన భుజస్కందాలపైకెత్తుకున్నారు పాతూరి నాగభూషణం. 1941 మే నెలలో బెజవాడలోని పటమట అచ్చయ్య ధర్మ గ్రంథాలయంలో గాడిచర్లవారి సారధ్యంలో నిర్వహించారు శిక్షణ, మిగిలిన విషయాలతోపాటు తెలుగు, హిందీ, సంస్కృతవాఙ్మయముల చరిత్రలతోపాటు హిందీ భాషను కూడా నేర్పారు. తదుపరి వివిధ ప్రాంతాలలో ఈ శిక్షణ నిర్వహించారు. ఇలా శిక్షణ పొందినవారు తమతమ ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం, ఉన్నవాటిని పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు-తెలంగాణా, రాయలసీమల నుండేకాక జెంషెడ్పూరు నుండి కూడా వచ్చి శిక్షణ పొందారు.
తదుపరి 1966 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపుతో గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును (CLISC) నిర్వహిస్తున్నారు. దానికి అర్హత 10 వ తరగతి ఉతీర్ణులై ఉండటం. 4 మాసములు శిక్షణ, అనంతరం విద్యార్థుల అర్హతను ఇంటర్మీడియట్‌ వరకూ పెంచి శిక్షణా కాలాన్ని 5 నెలలుగా మార్చారు. ఆదిలో తెలుగు మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు నిర్వహింపబడేది. 1989 నుండి ఆంగ్ల మాధ్యమంలో కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం.

ఏడాదికి రెండుసార్లు - జూన్లో ఒకటి, డిశంబరు నెలలలో మరొకజట్టు నిర్వహిస్తున్నారు. శిక్షణానంతరం ప్రభుత్వ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కమీషనర్ వారు పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ఈ శిక్షణాలయ స్థాపకులు శ్రీ పాతూరి నాగభూషణంగారి మరణానంతరం వాబ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు.
విద్యార్థులకు గ్రంథాలయంలో సాంకేతిక శిక్షణలో భాగంగా గ్రంథాలయంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా M.S. Office, Newgen Libed లలో ప్రవేశం కల్పిస్తున్నారు.

Wednesday, August 26, 2015

పుస్తక ప్రపంచలో ముగ్గురు మరాఠీలు

           పుస్తక ప్రపంచం, దాంట్లో అనేకానేక గ్రంథాలయాలు విజ్ఞానాన్ని వెలుగులుగా వెదజల్లుతూ ప్రపంచ మానవాళి అభివృద్దికి మెట్లుగా మారాయి. తెలుగు పుస్తకప్రపంచంలోగ్రంథాలయాల ద్వారా వెలుగులు కురిపించి సుసంపన్న తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువ చేసిన  ముగ్గురు ప్రముఖులు - అయ్యంకి వెంకటరమణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణంగార్లు

           
స్వతంత్రానికి పూర్వమే గ్రంథాలయాల ప్రాముఖ్యత తెలిసిన మేధావులైన వీరు కేవలం ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే తొలిగా గ్రంథాలయ సంఘాన్ని 1914లో స్థాపించారు. దానితో పాటుగా 1915లో 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించారు. వీటి ద్వారా అనేక గ్రంథాలయాల స్థాపనకు పాటూ పడ్డారు. తరువాత 1924లో అదే సంఘం ద్వారా 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీరు కొంత కాలం విజయవాడ కేంద్రంగా బోట్ లైబ్రరీని కూడా నడిపించారు. ఆశక్తి కలిగేలా ప్రతి ఊరిలో సభలు కార్యక్రమాలు చేస్తూ గ్రంథాలయాల స్థాపనకు పాటుపడి ముందు తరాలకు విజ్ఞానాన్ని అందించడంలో వీరు ముగ్గురూ మరాఠీల్లాగే యుక్తి, శక్తి ప్రదర్శించారు.

అయ్యంకి వెంకటరమణయ్య గారు - తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో ఆగష్టు 7, 1890 సంవత్సరంలో జన్మించాడు.  వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.  శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక" ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919,నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంథాలయం" ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం" గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.


పాతూరి నాగభూషణం గారు1907 ఆగస్టు 20వ తేదీన గుంటూరు జిల్లా పెదపాలెం గ్రామంలో జన్మించాడు.  గ్రంథాలయ నిర్వహణ, వయోజన విద్యాబోధన విషయాలలో అధ్యయనం చేశాడు.  ప్రాథమిక విద్య అభ్యసించే రోజుల్లోనే ఇతడు తన గ్రామంలో బాలసరస్వతీ భండారము అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత గ్రంథాలయ భవనం నిర్మించి, వేలకొలది గ్రంథాలను సేకరించి చుట్టుపక్కల నలభై గ్రామాలకు అందుబాటులో ఉంచాడు. పెద వడ్లపూడి, దుగ్గిరాల గ్రామాలలో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పాడు. బ్యాంక్ కాలువ మీది ప్రయాణీకుల పడవలలో సంచార గ్రంథాలయాన్ని నడిపాడు.  గ్రంథాలయ మహాసభలను నిర్వహించాడు. గ్రంథాలయ విద్యలో శిక్షణనిచ్చి వాటి నిర్వహణకు కావలసిన కార్యకర్తలను సమకూర్చాడు. విజయవాడ పటమటలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, దాని ముద్రణాలయం ఇతని చేతులమీదుగా నిర్మించబడ్డాయి. ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగాను, గ్రంథాలయ సర్వస్వము పత్రికకు సంపాదకునిగాను, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌కు కౌన్సిల్ మెంబరుగాను పనిచేశాడు.


అయ్యదేవర కాళేశ్వరరావు గారు
- కృష్ణా జిల్లా నందిగామ లో 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు.  రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు.  మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.

రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

Tuesday, August 11, 2015

బోట్ లైబ్రరీ ( Boat Library )

గోదావరిలో బొట్ హాస్పిటల్ అనేది నడుస్తుండేది. గోదావరి పరివాహక ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన అది బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది చాలామందికి తెలుసు,
అలా నడిచిన బోట్ లైబ్రరీ గురించి తెలుసా ?
                 విజయవాడలో ఈ బోట్ లైబ్రరీ నడిపారు. కృష్ణా బ్యాంక్ కాలువ మీదుగా పెదవడ్లపూడి నుండి కొల్లూరు వరకూ ఇది నడిచేది.
              పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యలో ఆర్యబాల సమాజంలో దీని ప్రార్ంభోత్సవానికి అంకురార్పణ చేయగా అటునుండి  సేవాశ్రమవాణీ మందిరం నుండి గ్రంథాల పెట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి పెద్ద బొట్ వంటి దానిలో అలంకరించారు. కాలువ వడ్డున సభ తీర్చి వక్తల ప్రశంగానంతరం గుంటూరు గ్రంథాలయ అద్యక్షులు శరణు రామస్వామి చౌదరి గారి చేతుల మీదుగా అక్టోబర్ 1935లో దీనిని ప్రారంబించారు.
అప్పటి నాయకులతో నిండి ఉన్న లాంచీ గ్రంథాలయము
 
              కాలువలో మెల్లగా పయనిస్తూ గ్రంథ పఠనం చేయడంలో మజా తెలియడం వలనో లేక గ్రంథాలయం వినూత్నంగా ఉండటం వలనో దీనికి విపరీతమైన ఆధరణ వచ్చింది.  బోట్ గ్రంథాలయానికి వస్తున్న ఆధరణ వలన  పెదవడ్లపూడి నుండి పిడపర్రు వరకూ మరొక గ్రంథాలయం ప్రారంభించాలని నిర్ణయించాలనుకొన్నారు. 
ఇలా రెండు బొట్ వంటి లాంచీల మీదుగా గ్రంథాలయాలను చాలా ఏళ్ళు నడిపిన ఘనత మన పెద్దలది.


Friday, August 7, 2015

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు

పక్కింటోడు పిల్లలను భాష్యంలో చదివిస్తాడు, ఎదురింటోడు నారాయణలో చదివిస్తాడు, స్నేహితుడి పిల్లల్ని  శ్రీ చైతన్య అంటాడు

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు తల్లిదండ్రులు --
భావి భారత పౌరులను ఆరోగ్యంగా, ఆనందంగా, తెలివితేటలతో ఎదిగేలా చెయ్యండి

ఏడుపు మొహాలతో ఉండకుండా
అనారోగ్యంగా ఉండకుండా
బుర్ర చెడిపోకుండా 
మానసికంగా కుంగిపోకుండా
ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే
మరి మనం మనపిల్లల్ని ఎందులో చదివించాలి .....?

" ప్రభుత్వ పాటశాలలోనే"
మనం చదువుకున్నాం - ఆడుతూ పాడుతూ
వాళ్ళనూ అలాగే చడువుకోనిద్దాం - ఆడుతూ పాడుతూ

Tuesday, July 21, 2015

పుష్కరానుభావాలు

రాజమండ్రి పుష్కరాల రేవులో స్నానం అయిపోయింది . 
పెద్దగా క్యూలు గట్రా లేవు. అందరికీ త్వరగానే అయిపోతుంది.
సందు సందులో ఎందరో దాతలు
భోజనాలు పెట్టేవారు కొందరు.
పులిహోర పెట్టేవారు మరికొందరు
మజ్జిగ ఇచ్చేవారు ఎందరో
ఆల్మోస్ట్ అన్నీ పరవాలేదు.-- ఒక్క రెండు తప్ప --- అవే - ప్రయాణాలు, గోదారి నీళ్ళు
చిత్రం చూడండి.

బస్సులు, రైళ్ళులో  కష్టం, నదిలో నీళ్ళలో అయిష్టం
రాజమండ్రి నీళ్ళలో అయిష్టం గానే స్నానించాక  పోనీ కొద్దిగా పైకి వెళ్లి మునికూడలిలో మునకేస్తే బావుంటుందని వెళితే - రాజమందరి చాలా బెటర్ అనిపించింది. 
---
ఏదేమైనా  ఆచంట దగ్గర కోడేరో, భీమలాపురమో, యలమంచిలో, లక్ష్మీ పురమో ఇలా చిన్న రేవులలో స్నానమే సూపర్ అనిపించింది. హాయిగా ఎటి గట్టు దాకా నడిచే శ్రమ లేకుండా తిన్నగా రేవులో దిగచ్చు - మంది లేని తేటగా ఉన్న నీటిలో హాయిగా స్నానం చేయచ్చు

Monday, July 13, 2015

పుష్కర కష్టాలలో ప్రశాంత స్నానం

 
పుష్కరాలలో కష్టాలు అన్నిటినీ దాటి ప్రశాంతంగా స్నానమాచరించడం అసాద్యమే. అయితే అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేమంటే రాజమండ్రి కొవ్వూరుల్లో స్నానం సరదా తీరాలంటే కిలోమీటర్ నడిచి అల్లకల్లోలంగా ఉన్న ఆ మురుగు నీటిలో ఒకమునకేస్తే నిజ్జంగానే దేవుని దర్శనం జరిగి మతి పోతుంది. ఇక ఇటు నరసాపురం, సిద్దాంతం, కోటిపల్లి లాంటి బి గ్రేడ్ ఘాట్లలో పట్టుమని పది అడుగుల నీరు లేదు. ఇక మిగిలింది అంతర్వేది. అక్కడ స్నానం సరదా తీరినా బయటకొచ్చాక వళ్ళంతా ఉప్పుతో కంపరమెత్తిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మిత్రులకు కొన్ని సులభ, ప్రశాంత స్నానానికి చిట్కాలు
ధవళేశ్వరానికి దిగివ వేమగిరి ఉంది. అక్కడ దిగి హైవేమీద కడియం వైపుగా కొన్ని మీటర్లు నడిచొస్తే చిన్న దేవాలయాల ప్రక్కగా కాలువమీద వంతెన ఉంది. దానిమీదుగా అవతలివైపు వెళితే గోదావరి గట్టు దానికి ఆనుకొని ఒక మాదిరి రేవు ఉన్నాయి. ఇక్కడ పుష్కలంగా నీళ్ళుంటాయి. దూరంగా ధవళేశ్వరం బేరేజి కనిపిస్తూ ఉంటుంది
  
ధవలేశ్వరం చేపల మార్కెట్ ఎదురుగా పార్కులోకి మార్గం ఉంది దాని ప్రక్క నుండి గోదావరి గట్టు సిమెంట్ రోడ్డుగా మార్చారు. అక్కడ రాం పాదాల రేవులంత కాకున్నా రెండు ఓ మాదిరి రేవులున్నాయి. అక్కడకు బైక్‌లమీద హాపీగా వెళ్ళవచ్చు, నెమ్మదిగా స్నానం చేయవచ్చు.
  
పెరవలి మీద నుండి ధవళేశ్వరం వైపు హైవే మీదుగానే ఖండవల్లి చిన్న పల్లె, క్రిందకు దిగితే ఓ మాదిరి రేవు. నీళ్ళున్నాయి. 

పెరవలి హైవే మీదవెడమవైపు దిగి నిడదవోలు వెళ్లే రోడ్డులో 2 కిలో మీటర్లు వెళితే కాకరపర్రు, ప్రక్కన తీపర్రు రెండు రేవులు, కాకరపర్రు కొద్దిగా లోపలకు వెళ్ళాలి, ఆటోలు ఉన్నాయి. తీపర్రు రోడ్డుమీద నుండి నడిచే దూరంలో రేవు ఉంది 
ఇవన్నీ కార్లు బైకులు అందుబాటులో ఉన్న అందరూ ఉపయోగించుకొని మీ పుష్కర స్నానాన్ని పవిత్రంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు.

Wednesday, June 17, 2015

సృజనాత్మకత

ఒక మనిషిలోని సృజనాత్మకతను బయటపెట్టేవి అతడి వెనుక కల ఆస్తులో,పాస్తులో కాదు. అతడి బాష, నడవడిక, చేసేపనో కూడా కానే కావు. మిగిలిన కాళీ సమయాల్లో చేసే అసంపూర్ణ కార్యక్రమాలే.

వాటిని కొందరు హాబీ అనచ్చు లేదా పనికిమాలిన పనులనచ్చు, పైసా రాబడి రాదనవచ్చు ఎలా అన్నా అవే మనిషిలోని సృజనను తెలియచేసేవి


వాటిని సద్వినియోగం చేసుకొని కొందరు అద్భుతంగా డబ్బు సంపాదిస్తారు, కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు,  కొందరు అన్నీ పోగొట్టుకొని అడుక్కొనే స్థితికి వచ్చేస్తారు.



హాబీలతో కేవలం పేరు మాత్రమే సంపాదించేవాళ్ళు కొందరు, హాబీలతో డబ్బులు మాత్రమే సంపాదించేవాళ్ళు కొందరు, హాబీలను ప్రజా ప్రయోజనాలకు వాడేవాళ్ళు కొందరు, హాబీలను తెలివిగా డబ్బుగానూ, వ్యాపారంగానూ, పేరు ప్రఖ్యాతులుగానూ మార్చుకొనేవాళ్ళు మరికొందరు.

వీళ్ళలో ఎవరు ఆత్మ సంతృప్తి పొందేవాళ్ళు అంటే మాత్రం చెప్పటం కష్టం. కేవలం ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే తమ హాబీలను కొనసాగించేవాళ్ళు తమకు అవి ఉన్నట్టుగా ఎవరికీ తెలియాలనుకోరు. వాళ్ళు మాత్రమే వాటి ద్వారా ఆత్మానందం పొందుతారు.

Thursday, May 7, 2015

ఆంధ్ర సాహిత్య పరిషత్ - కాకినాడ ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE - KAKINADA)

ఆంధ్ర సాహిత్య పరిషత్ - ఇది కాకినాడలో ఒకప్పుడు అనేకానేక రచయితల, కవులకు ప్రియమైన ప్రదేశం. అలాంటి ఈ సంస్థ వేటలో -

కాకినాడ పట్టణంలో అడుగుపెడుతూ అడిగా రామారావు పేట ఎక్కడ అని. దానిని ఏ రామారావు పేట అనే ప్రశ్న జవాబుగానూ దానిపై ఇక్కడ రెండు రామారావు పేటలున్నాయి, ఏ రామారావు పేట, మామూలు రామారావు పేట. మీకే పేట కావాలి? - పైపుల చెరువుండే రామారవు పేట కావాలి - అయితే తిన్నగా వెళ్ళండి అన్నారు.
పైపుల చెరువు వెదుక్కుంటూ వెళ్ళి దారిలో చాలా మందిని అడిగా అంధ్ర సాహిత్య పరిషత్ అనే గ్రంథాలయం లేదా ప్రచురణాలయం ఎక్కడ అని. ఎవ్వరికీ తెలియదు అన్నారు. వెదుకుతూ వెళ్ళిన నాకు ఆ చెరువు ఒడ్డున చౌదరి గ్రంథాలయం కనిపించింది. దాన్లోకి వెళ్ళి రిషెప్షన్లో కనిపించిన ఆమెను అడిగా ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని. నాకు తెలీదు అని, ఎందుకు అని అడిగింది. ఏం లేదని అక్కడ చదువుకుంటున్న పెద్దలు కొందరిని చూసి వాళ్ళు పెద్దలు కనుక తెలిసి ఉండచ్చు అని వాళ్ళను అడిగా? ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని - వాళ్ళు మొహమొహాలు చూసుకొని ఇక్కడ అటువంటిదేమీ లేదే అని తేల్చారు.


లైబ్రరీలో చదువుకుంటున్న ఆ చుట్టుపక్కల ఉండే పెద్దలకే తెలిసి ఉండకపోతే మరెవరికి తెలుస్తుంది. ఇక తప్పక నాకు దీని గురించి చెప్పిన సన్నిధానం నరసింహశర్మగారికి ఫోన్ చేసా. ఆయన చెప్పారు- మీరు సరిగ్గానే వెళ్ళారు, మీరు నిల్చున్న గర్ంథాలయం ఎదురు సందులో ఫైర్ సర్వీస్ ఉంటుంది, అదగితే ఎవరైనా చెపుతారు, దాని ప్రక్కనే ఉంది ఆంధ్ర సాహిత్య పరిషత్ అని. వాటే ట్రాజడీ అనుకుంటూ ఎదురుగా సందులోకి చూస్తే ఫైర్ సర్వీస్ ఆఫీస్, దానికో చిన్న ఎర్ర బోర్డ్, దాని ప్రక్కనే తాటికాయలంత  పేద్ద అక్షరాలతో రోడ్డు మీదకి బోర్డ్ ఉంది, ఆంధ్ర సాహిత్య పరిషత్ అని, హతవిధీ ఇంత పేద్ద అక్షరాల బోర్డే చూడలేకున్నారే ఇక్కడి వృద్ద మానవులూ అనుకుంటూ  లోనికి ప్రవెశించా....
ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రస్తుతం అది మ్యూజియంగా మార్పు చెందినది.


ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే 1911 మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ది, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు.


సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947 లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల  దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది.


సాహిత్య పరిషత్ కేవలం ప్రచురణే కాక సుమారు 10,000 పుస్తకాలను భద్రపరచింది. తాటిఆకుల తాళపత్ర గ్రంథాలను సుమారుగా 4,776 వరకూ సేకరించి భద్రపరచింది.

1973 నుండి సాహిత్య పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు.  ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది. 1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.

 ఈ భవనంలో వస్తు ప్రదర్శన మరియు గ్రంథ ప్రదర్శనలే కాక వెనుక కల హాలులో కాకినాడ తదితర ప్రాంతాల కవులు, రచయితల కార్యక్రమాలు జరుగుతాయి. నెలలో ప్రతి మూడవ ఆదివారం ఇక్కడ కవి సంగమం జరుగుతుంది. ప్రముఖులు, కవులు, రచయితలు సాహిత్య అభిమానులు పాల్గొంటారు...

Tuesday, April 28, 2015

గ్రంథాలయ స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం

               నా ఎరుకలో ఒక లైబ్రరీ ద్వారా చదవేందుకు అవకాశం కల్పించడం కాక మహా అయితే ఒకటో రెండో కార్యక్రమాలు జరుగుతాయి... కాని నేను ఈ మద్య చూసిన ఒక గ్రంథాలయం స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం మాదిరిగా అనేక రూపాలలో సేవలను అందించడం చూసా.....అదే వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం
                 భీమవరం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముదవల్లి గ్రామం పూర్వం నుండీ చాలా ముందు చూపు కలిగిన యువకులను కలిగి ఉండేదేమో అందుకే 1800 నుండి 1900 వరకూ బహుముఖాలుగా అక్కడి ప్రజలు అభివృద్దివైపు అడుగులు వేసారు.  మిగిలిన వారితో వేయించారు. అలాంటి వారిలో కొందరు- రాసి సిమెంట్ - బి.వి.రాజు, లార్స్‌విన్ గ్రూప్ -ఎస్.కృష్ణంరాజు, డెల్టా పేపర్మిల్స్ - భూపతిరాజు సూర్యనారాయణరాజు, డా.బి.హెచ్.సుబ్బరాజు వంటి వారు. ఇదంతా జరగటానికి కారణం వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం. దీని ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది - అభివృద్ది చిత్రం

అక్షరాశ్యతా వ్యాప్తి - ఈ గ్రంథాలయం ద్వారా రాత్రి పాఠశాలల నిర్వహణ జరిగేది. ఎందరో ఈఊరి పెద్దలు ఈ పాఠశాల ద్వారా విద్యావంతులు అవడం జరిగింది.
స్త్రీ విద్య - ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్దతి ఉందేది. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంభందించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
హిందీ ప్రచారం - 1920 నుండి ఈ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు.
అసృశ్యతా నివారణ - సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి బృందం అంతరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
వైద్య సహాయం - ఊరిలో పేదవారికి వైద్య సహాయం అందాలనృ ఉద్దేశ్యంతో - 1911 నుండి ఊరిలో వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయవేదికగా వైద్య శిబిరాలు కొనసాగేవి, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. (గ్రంథపాలకులుగా ప్రస్తుతం ఆర్.ఎం.పి పనిచేస్తున్నారు)
సహాకార పరపతి సంఘం - పల్లెలకు రైతులు వెన్నెముఖ అని నిరూపించదానికన్నట్టుగా గ్రంథాలయానికి అనుభందంగా సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం చేసారు.
జాతీయోజ్యమానికి సహాకారం - జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రంథాలాయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు. వీటిలో గ్రామ యువకులు పాల్గొనేవారు.
రాజపుత్ర సమాజ సేవా సమితి - క్షత్రియ కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్ధులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
స్త్రీ పునర్వివాహాలు - క్షత్రియ కుటుంభాలలో చాలా కాలం పునర్వివాహాలు ఉండేవి కవు, తిరుపతిరాజుగారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాదాన్ని బలపర్చై 1934లో స్త్రీ పునర్వివాహ సమాజం ఏర్పరిచారు
పోస్టల్ సేవలు - చాలా కాలం కుముదవల్లిలో పోస్టాఫీసు లేదు. తిరుపతిరాజుగారి బృందం గ్రంథాలయంలోనే అసలు ధరకే పోస్తేజీని అందించేవారు.
ఇలా అనేకరకాలుగా ఈ గ్రంథాలయం ఊరికి విజ్ఞానాన్ని పంచడం అనేది ఒక విధంగా ఆ ఊరి ప్రజల అదృష్టమే...



Sunday, April 26, 2015

శ్రీ వీరేశలింగ సమాజ గ్రంథాలయం కుముదవల్లి (కోడవల్లి)

అది ఒక అందమైన గ్రామం, అందమైన గ్రామస్తులు (గ్రామస్తుల అందం వాళ్ళు చేసిన చేస్తున్న పనులబట్టి నిర్నయిచబడాలి అని నా గట్టి నమ్మకం)  అలాంటి ఊళ్ళో ఒక గ్రంథాలయం - ఒక గ్రంథాలయం తన పూర్తీ ప్రయోజనాన్ని ప్రజలకు అందివ్వడం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. కాని ప్రయోజనానికి ఆవల కూడా సేవలను అందించడం ఒక్క భీమవరం దగ్గరలో కోడవల్లి అనికూడా పిలిచే కుముదవల్లిలోని వీరేశలింగ సమాజ గ్రంథాలయానికి మాత్రమే చెందుతుంది -  అలాంటి గొప్ప గ్రంథాలయ పూర్వాపరాల్లోకెళితే

గ్రంథాలయం ఉద్యమం, జాతీయ కాంగ్రెస్ స్థాపన
ప్రజల సామూహిక శక్తిని సమీకరించి, ఒక వ్యవస్థాపరమైన మార్పుకోసం జరిగే ధీర్ఘ కాల పోరాటాన్ని సాంఘిక ఉద్యమం అంటారు. పరాయి పాలన విముక్తి కోసం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించాలనే భావన దివ్య జ్ఞాన సమాజ సభ్యుడైన ఏ.ఓ.హ్యూమ్‌కు కలిగింది. హ్యూం మిత్రులతో  కూడిన సమావేశం ఈ ఆలోచనను దృవపరచింది. ఈ అలోచనను ఉద్యమ రూపంలోకి తెచ్చేందుకు 1885లో  బొంబాయిలో ప్రధమ కాంగ్రెస్ మహాసభ జరిగింది. తదుపరి జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.

అప్పటి రోజులలో దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన బ్రిటిష్ పాలన వలన భారత దేశ ఏ విధంగా నష్టపోతున్నదీ వివరించింది. ఇలాంటి పుస్తకాలను చదివేలా చేస్తేనే ప్రజలలో సామాజిక చైతన్యం కలుగుతుందని గ్రహించిన కొందరు యువకులు పల్లెలలో గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. అప్పటి రోజులలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రాయకుదురులో సుజనానంద గ్రంథాలయం, ఏ.ఓ. హ్యూం పేరున కోపల్లె లోనూ, దాదాబాయి నౌరోజీ పేరున ఉండి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. కుముదవల్లి గ్రామంలో గ్రంథాలయం స్థాపించాలని ఆలోచన ఆ గ్రామానికి చెందిన వడ్రంగి అయిన చిన్నమరాజు గారికి కలిగింది. 

ప్రారంభ చరిత్ర
ఆయన ముందుగా తన వద్ద కల 50 పుస్తకాలు, వాటితో పాటుగా తను తెప్పించే దేశాభిమాని, ఆధ్రపత్రిక, ఆంధ్ర ప్రకాశీక వంటివి తెచ్చి గ్రంథాలయం ప్రారంభించారు. దానికి శ్రీ వేరేశలింగ కవి సమాజ గ్రంథాలయం అని నామకరణం చేసారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ పుస్తకాలకు భూపతిరాజు లచ్చిరాజు గారు ఆశ్రయం ఇచ్చారు. 1897 నాటికి తెలుగు పుస్తకాల ముద్రణ అంతగా లేదు. అయినా పోస్టాఫీసూలద్వారానూ, ఇతర మార్గాలలోనూ దొరికినంత వరకూ గ్రంథాలనూ, పత్రికలనూ సేకరించేవారు.

గ్రంథాలయ నిర్మాణం
గ్రంథాలయ నిర్మాణానికి ముఖ్యులు అని కొందరు ఉంటారు కాని గ్రంథాలయమే బ్రతుకుగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారని శ్రీ భూపతిరాజు తిరుపతి రాజు గారు ఈ గ్రంథాలయం ద్వారా నిరూపించారు.

ప్రారంభించిన కొద్ది రోజులలో గ్రామానికి చెందిన రైతు కుటుంభానికి చెందిన యువకుడు వీరేశలింగ గ్రంథాలయానికి చదువుకొనేటందుకు వస్తూ దానికి పెద్ద అభిమానిగా మారిపోయాడు. క్రమ క్రమంగా గ్రంథాలయ సేవకే అంకితమైపోయారు. గ్రంథాలయ అభివృద్దికొరకు నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. ఆయనే తిరుపతిరాజు. అప్పటి గ్రంథాలయం ఉచితంగా ఉన్న వసతిలో ఉంది. దానికి శాశ్వతమైన వసతి కొరకు కృషి మొదలెట్టారు. గ్రామ మద్యగా సెంటు స్థలాన్ని గవర్నమెంటు నుండి సంపాదించారు. తన సహచరుడు అయిన కాళ్ళకూరి నరసింహం గారి సలహా మేరకు ప్రజా కార్యక్రమాల పట్ల ఆశక్తి కలిగిన వితరణ శీలి పోలవరం జమిందారు (వీరిది వీరవాసరం స్వగ్రామం) అయినటువంటి కొచ్చెర్ల కోట రామచంద్ర వెంకట కృష్ణరావు గారిని సంప్రదించి వారి ద్వారా గ్రంథాలయం కొరకు 400 విరాళంగా పొందారు. ఆ నిధితో తాటాకుల ఇంటిని నిర్మించి దానిలోకి గ్రంథాలయాన్ని మార్చారు.
పాఠకుల ఆశక్తి కొత్తగా కట్టిన ఇంటిలోకి మారిన గ్రంథాలయానికి పాఠకుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఉన్న వాటితో పాటు మరికొన్ని పత్రికలను కూడా తీసుకోసాగారు అప్పట్లో వచ్చే పత్రికలు
  • బ్రహ్మ ప్రకాశిని (1886) రఘుపతి వెంకట రత్నం నాయుడు
  • కృష్ణాపత్రిక (1902) ముట్నూరి కృష్ణారావు
  • ఆముద్రిత గ్రంథ చింతామణి (1895)
  • జనానా (1904) రాయసం వెంకట శివుడు
  • ఆంధ్రపత్రిక (1905) కాశీనాధుని నాగెశ్వరరావు పంతులు
విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ప్రచురణలు అన్నిటినీ గ్రంథాలయానికి సేకరించేవారు. మచిలీపట్నం ఆంధ్ర బాషావర్ధనీ సమాజ ప్రచురణలు, కందుకూరి వారి అన్ని రచనలూ ఇక్కడ భద్రపరచేవారు. కందుకూరి వారి శిష్యుడైన తిరుపతి రాజు గారు కేవలం గ్రంథాలయాన్ని పుస్తకాల కొరకే కాక ఒక ప్రజా హిత కార్యక్రమ శాలగా మార్చివేసారు. దీని ద్వారా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించేవారు.

గ్రంథాలయ అభివృద్ది ఇలా పలు కార్యక్రమాలు జరుగుతూ గ్రంథాలయం అనది మన్ననలతో పాటుగా పుస్తకాల సంఖ్య, పాఠకుల సంఖ్య కూడా పెరగటం, కొత్తగా పుస్తకాలకు బీరువాలు ఏర్పాటు చేయడం వలన స్థలాభావం కలగటం గమనింఛి మంచి గ్రంథాలయం నిర్మించవలసిన వసరం ఉన్నదని గ్రహించి ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం ప్రక్కగా మరొక సెంటు భూమి ఇవ్వవలసిందిగా కోరారు. అలా వచ్చిన భూమిలో నిర్మాణం కొరకు తిరుపతి రాజు గారు అనేక మందిని విరాళాలకోసం కలిసారు అలా విరాలం ఇచ్చిన ధాతలు
  • పిఠాపురం మహారాజావారు
  • పోలవరం జమిందారు
  • కోడూరుపాడుకు చెందిన నడింపల్లి నారాయణరాజు
  • భూపతి రాజు సుబ్బరాజు
  • భూపతిరాజు సోమరాజు
  • సాగి వెంకట నరసింహరాజు
  • పెన్మత్స వెంకట్రామరాజు (గోటేరు)
  • భూపతిరాజు కృష్ణం రాజు గారి సతీమణి సీతయ్యమ్మ గార్ల ద్వారా సుమారు 620 రూపాయలు సేకరించి పెంకుటిల్లు నిర్మించారు.
ఈ పెంకుటింటికి కృష్ణారావు మందిరం అని పిలిచేవారు. తరువాత గ్రంథాలయ నిర్వహణ, అభివృద్ది కొరకు మరిన్ని నిధులు కావాలని భావించి 1916 నాటికి సుమారు మూడువేల స్థిర, చరాస్తులను గ్రంథాలయానికి సమకూర్చారు. 1932 నాటికి గ్రంథాలయంలో 16 వందల గ్రంంథాలు చేరాయి. ఈ గ్రంథాలయానికి జిల్లాలోనే గొప్ప గ్రంథాలయంగా పేరు ప్రఖ్యాతులు కలిగాయి. 
 
సరికొత్త భవన నిర్మాణం
దాదాపు 75 సంవత్సరలు సేవలందించిన గ్రంథాలయ పెంకుటిల్లు బలహీనమైపోవడంతోనూ, పుస్తకాల సంఖ్య పెరగతం వలన, చదువుకొనే స్తహలం తగ్గుతూ ఉండటం వలన మరొక విశాలమైన భవన నిర్మాణానికి పూనుకొన్నారు. 1985 మార్చి 1 వతేదీన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూపతిరాజు రామచంద్రరాజు, వారి సతీమణి సూర్యావతి గార్లచే శంకుస్థాపన చేయించారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖులు లార్స్‌విన్ గ్రూప్ కంపెనీకి చెందిన ఎస్.కృష్ణంరాజు గారు, రాసి గ్రూప్ సంస్థల అధిపతి బి.వి రాజు గారు, డెల్టా పేపర్ మిల్స్ అధిపతులు అయిన భూపతిరాజు సూర్యనారాయణ రాజు గార్ల ప్రధాన విరాళాల సహాయంతో సుమారు నాలుగు లక్షలతో నూతన భవనం ఏర్పాటుచేసారు.  దీనిని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి నుండీ అనేక రకాలుగ ఈ గ్రంథాలయం సేవలు కొనసాగిస్తుంది.  

Tuesday, April 21, 2015

పరిపక్వత లక్షణాలు

కొందరికి కొన్ని విషయాలలో అవగాహనా రాహిత్యం ఉంటుంది, వారు ఎన్నో రంగాలలో కృషిచేసినా, ఎన్ని అనుభవాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అలా ఎదుర్కోడానికి ఏదో విషయములో పరిజ్ఞానం లేకపోవడమే కారణం

కాని అలా అన్ని విషయాలలో సొంత పరిజ్ఞానం కాక ఎదుటి వారి అనుభవాల నుండి మనం ఎన్ని త్వరగా నేర్వగలిగితే అంత త్వరగా కొన్ని ఆటుపోట్ల నుండి, కష్టాల నుండి, అవమానాల నుండి బయటపడవచ్చునని ఒక పెద్దాయన చెప్పారు.


ఈటీవలి నేను కలసిన పెద్దలు, సాహితీకారుల మాటలలో ఎన్నో ఇలాటి అనుభవాలను ఏరుకొని జాగ్రత్త చేసుకొనే అవకాశం కలుగుతున్నది.
నవరసాల సాంగత్యం - నిజమే కొందరు చాదస్తంగా చెపుతారు, కొందరు అద్భుతంగా చెపుతారు, మరికొందరు నిర్లజ్జగా చెపుతారు, కొందరు నిర్భయంగా, కొందరు భయం భయంగా....కొందరు క్రూరంగా... (నిజంగానే వీళ్ళు చెపుతున్నపుడు కొడతారేమో అని భయపడేట్టూగా వాళ్ళు హవభావాలు ఉంటాయి).. చెపుతారు

ఇలా మనుష్యుల ప్రవర్తన అందులోనూ సాహితీ రంగంలో ఉన్నంత మజా మరెందులోనూ లేదు సుమా..!


ఒకాయన కొందరి గురించి ఇలా చెప్పారు...కొందరు ఇలా ఉంటారు వాళ్లలో నేనూ నువ్వూ ఉంటామనుకో అయితే మనం అలా అని ఒప్పుకోం మేం అలా ఉండం అంటాం
కాని అల్లానే ఉంటాం. ఆ కొందరే మనం అని...ఏమంటావ్ అని అడిగారు.....  :)  (ఏమంటాం? -  దేబే మొహం వేస్కుని చూడటం తప్ప)


పరిపక్వత లక్షణాలు వినే పద్దతిలో ఉంటాయని ఒకాయన చెప్పారు..... ఏలనయ్యా అని అడగ్గా -  చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు కదా లోకువ అనుకొని ఎక్కువ వాగితే - విన్నవాడు చెప్పినవాడిని గురించి జనాలో లోకువ చేస్తాడు. కనుక చెప్పినపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలని,  వినేవాడిని జాగ్రత్తగా పరిశీలిస్తూ చెప్పాలని... :)  (అంతే నేను ఇక బిగిసిపోయాను ఎలా మసిలితే ఎలా అనుకుంటాడో అని )

మరోకాయన చెప్పాడు -ఏమయ్యా  విశ్వనాధూ, నువ్వు ఇన్ని అడీగావు కదా నేనొకటి అడూగుతాను చెప్పు. నన్ను వెతుక్కుంటూ వచ్చావు, పరిచయం చేసుకున్నావు, నీ గురించి నీ పని గురించి చెప్పావు, ఇన్ని వివరించి చెపితే కాని మాట్లాడని నాతో ఎందుకయ్యా నీకు పని.. అని....  :)   (అన్నీ చెప్పేసి వెళ్ళిపొమ్మని కాబోలు - కాదని తరువాత తెలిసింది - వచ్చిన వాడు ఏపని మీద వచ్చాడో అది తెలుసుకొని దానికి తగిన జవాబిచ్చి పంపించాలి కాని ....వివరాల కోసం వాడిని హింసించడం ఏమిటయ్యా చాదస్తం కాకపోతేనూ అని సెలవిచ్చారు చివరలో -   మహానుభావుడు )

ఇంకోకాయన ఇలా చెప్పుకొచ్చాడు.. ఇలా ఎవరెవరో వస్తారు ఏదో చెపుతారు, రాసుకెళతారు... అందుకే ఒద్దయ్యా, నన్ను నా మానాన  ఒదిలేయండి.. ప్రశాంతగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టద్దు....అని  అంటూ ...ఇలా అన్నానని ఏమనుకోబ్బాయ్  అన్నారు..   :)

ఇలా బోలెడు అనుభవాలు...రాస్తూ పోతే... కొంత కాలానికి నేనూ అంటానేమో, ఏమయ్యా నీ ఇష్టమొచ్చినట్టు రాస్తానంటే నేనేమీ చెప్పను సుమీ...   :) :)

Sunday, April 12, 2015

పిఠాపురం వికీపీడియా అవగాహనా కార్యక్రమం

ఈరోజు పిఠాపురంలో జరిగిన వికీపీడియా అవగాహనా కార్యక్రమంలో నేను మిత్రుడు రాజాచంద్రతో కలసి పాల్గొన్నాము. పిఠాపురం యొక్క చారిత్రక విశేషాలు అనేకం. ఇక్కడ పుట్టి పెరిగిన గురుదత్తునిపైనే అనేక వ్యాసాలు రాయవచ్చు. అవేకాక పిఠాపుర సంస్థానం, కుక్కటేశ్వర ఆలయం, పాదగయ క్షేత్రం మొదలు అనేక చారిత్రక విశేషాలు ఉన్న పిఠాపురం గురించి అక్కడి ప్రజలే ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా వాసులకు పరిచయం కలిగించవలసిన అవసరం ఉంది. ఆయా విశేషాలను చేర్చడానికి ముందుకు వచ్చే తెలుగు అభిమానులందరకూ అభివందనం

Friday, April 3, 2015

సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి


సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి ప్రముఖ స్వాతంత్ర సమరయోదురాలు మరియు సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి.
ఈమె కృష్ణాజిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో 18 మే 1914లో వాసిరెడ్డి సీతారామయ్య, సుబ్బమ్మ దంపతులకు కడసారి బిడ్డగా జన్మించారు. ఆమె గురువు జంగా హనుమయ్య చౌదరి. ఆయన కవి, పండితుడు కావడం వల్ల ఆమెకు ఉత్తమ కావ్యాలను బోధించి మంచి విద్వత్తు కలిగించారు.

సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడు లో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, తాపీధర్మారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.

1920లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు.  1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమె ప్రయత్నిం చారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. 1932లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి చేబ్రోలు వచ్చారు.

రాట్నంపెై నూలు వడకటం, హిందీ నేర్చుకోవటం, ఖాదీధారణ అక్కడ పరిపాటి. ఉద్యమం ప్రచారం చేస్తూ రాజ్యలక్ష్మీదేవి దగ్గర బంధువెైన అన్నపూర్ణమ్మతో శాసనోల్లంఘన చేయతల పెట్టారు. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసిపో యింది. వారిని చూడాలని వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసి పోయాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ శాసనధిక్కార నినాదాలు చేస్తూ అందరూ ఊరేగింపుగా బయలుదేరారు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

శిక్ష గురించి న్యామూర్తుల ఇళ్ళలో సైతం స్త్రీలు వీరికి అండగా నిలవడంతో ఆ శిక్ష రద్దు చేసి నామమాత్రపు శిక్ష ను ముగ్గురికీ విడివిడిగా విధించారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మీదేవిని రాయవేలూరు జెైలుకు తరలించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు పరిపాటి అయినాయి. గ్రంథాలయంలో హిందీ తరగతులు నిర్వహించేవారు. తనుకూడా  కష్టపడి చదివి రాష్ర్టభాష పరీక్ష లో ఉత్తీర్ణత సాధించారు.

అస్పృశ్యతా నివారణకై సూర్యదేవర రాజ్యలకీదేవి తన వంతు కృషి చేశారు. పేరంట సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. గుంటూరుజిల్లాలో ఆ సత్యా గ్రహం చేయడానికి అనుమతి లభించిన తొలిస్త్రీ రాజ్యలక్ష్మి అని చెప్పవచ్చు. 30 జనవరి 1941లో బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణకోడూరులో ఆమె సత్యాగ్రహం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు నెలల జెైలు శిక్ష, వందరూపాయల జరిమా నా కూడా విధించారు. ఆమె జెైలు నుండి విడుదలెైన పిదప మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు చేరుకున్నారు. ఆ తరువాత తెనాలి వెళ్ళి ట్యుటోరియల్‌ కాలేజిలో చేరి బెనారస్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చేబ్రోలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి దేశాభ్యుదయానికి పాటుపడ్డారు. ఇంతలో క్విట్‌ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో రాజ్యలక్ష్మీదేవిని శాసనధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించారు. ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరిగి ప్రజలచే శాసనధిక్కారం చేయించారు. పోలీసులు ఆమెను వెంటాడేవారు.

కానీ దేశభక్తులు ఆమెను కాపాడేవారు. రాజ్యలక్ష్మీదేవి 1941లో చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తరువాత 2 అక్టోబర్‌ 1945లో ఆంధ్రరాష్ర్ట మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు. భారతదేశానికి 1947 ఆగష్టూ 15వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే నెైజాము వాసులకు విముక్తి కలగలేదు. రాజ్యలక్ష్మీదేవి విరాళాలు, చందాలు పోగుచేసి నెైజాం వ్యతిరేక పోరాట నాయకులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. మాకు ధనసహాయం వద్దు అంగబలం కావాలి. మాతో నిలబడి ఉద్య మ ప్రచారానికి సహకరించండిఅని నాయకులు కోరారు. టంగుటూరి సూర్యకుమారి పాట కచ్చేరీ ద్వారా వసూలెైన మొత్తాన్ని ధన సహాయంగా ఇవ్వటమేకాక రాజ్యలకీదేవి వ్యక్తి గతంగా నెైజాం వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదు సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమ య్యే వరకు ఆమె అక్కడి వారితో కలసి పోరాటం సాగించారు.