Tuesday, September 8, 2015

సద్గురు మళయాళ స్వామి

                అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మళయాళ స్వామి, స్ర్తీలు కూడా దీక్షలు తీసుకోవచని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని.
               మలయాళ స్వామి తలిదండ్రులు కరియప్ప, నొత్తియమ్మ దంపతులు. కేరళలోని తిరువాయుర్ సమీపంలో 29-3-1885 వ తేదీన జన్మించారు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాదువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు.
చిన్నతనం నుండి అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం. జాలి దయ ఎక్కువగా ఉంటం. ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం. ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడు ధ్యానంలో ఉండటం చేసేవాడు చిన్నప్పటి నుండి ఆంగ్లం చదవటం ఇష్టం ఉండేది కాదు. దానికి బదులు సంస్కృతం నేర్వటానికి వెళ్లిపోయేవాడు

సన్యాస జీవితం ప్రారంభం

          తిరువంత పురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. ఆయన సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్ధులకు విద్యాబోధన చేసేవాడు.
వేళప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలపై సాదన చేసాడు. నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు ద్వారా పొంది. తురుగు పయనమైనాడు. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తల్లికి సేవలు చేసి నయం చేశాడు. వివాహం కొరకు అడిగితే తాను దేశాటన చేయాలని తిరస్కరించాడు .
వేళప్ప కాళి నడకతో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు. అలా తిరుతున్నపుడు అనారోగ్యంతో ఒక వార్ం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు స్వప్నంలో ఎవరో నోట్లో మత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం మరి దరిచేరలేదు.

తిరుమల సందర్శన

                  అనేక పుణ్య్క్షేత్రాలను దర్శించిన అనంతరం చివరగా ఆయన తిరుమలలోని గోగర్భం చేరారు. ఆ ప్రదేశం ఆయనకు నచ్చడం, అది తప్పసుకు అనుకూలంగా ఉందని భావించి కొంత కాల్ం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన నాటికి తండ్రి కాలషర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరారు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు. ఆయన బాష, వేషం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని అందరూ పిలిచే వారు. అదే తరువాత స్థిర నామంగా మారింది.
               మైసూరు తిరువెంకటాచార్యుడు అనే అతడు వెంకటేశ్వర పూజ చేసి రోజూ ప్రసాదం ఇచ్చి వెళ్ళేవాడు. తరువాత కొందరు భక్తులు రోజూ ఆయనకు ప్రసాదం అందిచేవారు.

ఆయన ద్వారా జరిగినట్టుగా చెప్పే కొన్ని లీలా విశేషాలు

  • తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు.
  • ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి ఒక వేటకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు.
  • తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకసనంద తీర్ధం నుండి, తుంబురు తీర్దానికి వెళ్లారు. భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు. ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఆహారం అందించాడు.
  • ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు.
  • వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం ఇచ్చే ఏర్పాటు చేశారు.
  • కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు.
  • తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు

వ్యాసాశ్రమం

              తిరుమల విడిచి ఏర్పేడు దగ్గర  కాశీ బుగ్గ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. కాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు. వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి, పంటలు పండించారు. జంతుబలి మాన్పించారు. ’’యదార్ధ భారతి ‘’ అనే పత్రికనుస్థాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు. అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది. కేరళలో నారాయణగురు గారు ఏమి బోధించారో, వ్యాసాశ్రమంలో అవన్నీ అమలు పర్ఛడానికి ప్రయత్నించారు.

సేవా కార్యక్రమాలు

  • బందరులో పట్టాభి సీతారామయ్య గారింట్లో గాంధీజీని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు. దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .
  • 1937లో ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలకూ, ఇతర కులాల వారికి భోదలు చేసారు.
  • 1943లో శివగిరిలో జ్ఞానయజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధలు చేసారు
  • 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు.
  • 1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసినపుడు వేలాది మంది పంచములు పాల్గొన్నారు.
  • వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించారు
12-7-1962 లో మళయాళ స్వామి కైవల్యం పొందారు. వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి. విద్యాప్రకాశానంద స్వామివారు ఈ ఆశ్రమాదిపతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరైనారు. వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అనిపిస్తుంది. ఇప్పుడు విద్యానందగిరి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు మళయాళ స్వామి

Thursday, September 3, 2015

గ్రంథాలయ సంఘం స్థాపన, అభివృద్ధి పరిణామం

తొలి గ్రంథాలయం

ఆంధ్రదేశంలో తొలి పౌర గ్రంథాలయాన్ని శ్రీ మంతిన ఆదినారాయణమూర్తి అనే ప్రాధమికోపాధ్యాయుడు 1886 వ సంuలో విశాఖపట్టణంలో నెలకొల్పినట్లు తెలుస్తుంది. ప్రారంభంలో ఒకరి ప్రోత్సాహంతోకాక ఎవరికివారు సంకల్పించుకొని, ఎక్కడికక్కడ కొన్ని గ్రంథాలయాలను నెలకొల్పారు. ఇలా 1905 నాటికి తెలుగునాట 20 గ్రంథాలయాలు లెక్కకు వచ్చాయి. అప్పట్లో వీరేశలింగం పంతులుగారి సంఘసంస్కరణోద్యమం, ఆంధ్రదేశంలో గొప్ప సంచలనాన్ని కలిగించిన వందేమాతరోద్యమం మనవారికి మాతృభాషపై అభిమానాన్ని పురికొల్పింది. తత్ఫలితం - పుస్తకాలు, పత్రికలు విరివిగా వెలువడ్డాయి. ఇవి కూడా గ్రంథాలయాల స్థాపనకు దోహదం చేశాయి. క్రమంగా గ్రంథాలయాల సంఖ్య పెరిగింది.

మొదటి గ్రంథాలయ మహాసభ సంఘస్థాపన

1914 లో బెజవాడలోని రామమోహన ధర్మ పుస్తక భాండాగార కార్యకర్తలకు దేశంలోని గ్రంథాలయ నిర్వాహకులందరిని సమావేశ పరచాలనే చక్కని ఆలోచన కలిగింది. ఏప్రియల్ 10 వతేదీన బెజవాడలో ప్రధమ ఆంధ్రదేశ గ్రంథభాండాగారుల మహాసభను చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
మహా సభ నిర్వహణతోనే ఆంధ్ర గ్రంథాలయోద్యమం - ఆంధ్ర గ్రంథాలయ సంఘం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ చరిత్రే ఆంధ్ర గ్రంథాలయోద్యమం. ఉద్యమ ప్రచారానికి ప్రజలను ఉత్తేజ పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మహనీయులతో మహా సభలు జరిగాయి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహా సభలు 40 జరిగాయి. ఇవి కాక మరెన్నో జిల్లా, తాలూకా మండలస్థాయి సభలు నిర్వహించారు. ప్రత్యేక సందర్భాల అవసరాన్ని బట్టి మరికొన్ని జరిపారు.
ఈ మహాసభకు గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ గుంటూరు, నెలూరు, కడప, కర్నూలు, బళ్ళారిజిల్లా, హైదరాబాదు సంస్థానంలోని సుమారు 60 గ్రంథాలయాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

కార్యవర్గం, సహాయకులు

శ్రీఅయ్యంకి వెంకట రమణయ్య, సూరి వెంకట నరసింహశాస్త్రి గార్లు మొదటగా ఆంధ్రప్రదేశ గ్రంథభాండాగార సంఘమును స్థాపించారు. తరువాత ఇది ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మారింది. ఈ సభలో సంఘ తొలి అధ్యక్షులుగా శ్రీమోచర్ల రామచంద్రరావు పంతులుగారిని , శ్రీయుతులు అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావుగారలను ప్రథమ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

పత్రిక ఏర్పాటు

గ్రంథాలయోద్యమాభివృద్ధి కోసం గ్రంథాలయ సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో పత్రికాప్రచురణ ఒకటి. సంఘ కార్యకర్తలు దేశంలోని వివిధ పత్రికలలో ప్రచురిస్తున్న వ్యాసాలతో తృప్తి చెందక ఉద్యమవ్యాప్తికి ప్రత్యేక పత్రికను నడుపుటకు నిశ్చయించి గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 వ సం.లో త్రైమాసిక పత్రికగా ప్రారంభించారు. రెండు సంవత్సరముల తరువాత ద్వైమాస పత్రికగా మార్చారు. 1921 సం. లో దీని ప్రచురణ నిలిచిపోయింది.
తొలి సంపుటాలలో గ్రంథాలయాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలతో పాటు బాలభటోద్యమ విషయాలు, సాహిత్య చర్చలు, ఆధునిక కవుల పద్యములు, గేయములు, మరెన్నో వైజ్ఞానిక రచనలు, అన్ని విషయములకు సంబంధించి వెలువడేవి. 1928 వ సం పునరుద్ధరించబడి, 1980-83 మధ్య కాలంలో 4 సంవత్సరములు ఆగిపోయి, తిరిగి 1934 లో ప్రారంభమై మొత్తం మిద 11 సంపుటములను పూర్తి చేసుకొంది. ఈ సంపుటములలో గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన అంశములతోపాటు గ్రంథ సమిక్షలను కూడా చేర్చారు.

1938 లో సంఘ నిర్వహణ బాధ్యత నుండి అయ్యంకి తప్పకున్న తరువాత 1939 సెప్టెంబరు 1941 అక్టోబరుల మధ్య కాలంలో సంవు పత్రిక ఆంధ్రగ్రంథాలయం" పేరుతో ఆంధ్రాంగ్ల భాషలలో త్రైమాసికగా నిర్వహించారు. ఆంగ్లంలో కూడా ఉండటం వలన దీని ప్రచారం బయట రాష్ట్రాలకు, ఖండాంతరాలకు కూడా ప్రాకినది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కాగితం కరువు ఏర్పడడంతో, కేంద్ర ప్రభుత్వం నెలకు పైబడిన వాయిదాలతో ప్రచురించు పత్రికలను నిలిపి వేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులతో 'ఆంధ్రగ్రంథాలయం ప్రచురణ నిలిచి పోయింది. దీనితో తెనాలి తాలూకా పెదపాలెం, అనంతపురం జిల్లా హిందూపురంలో వరుసగా జరిగిన 23, 24 ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభల సంచికలను పత్రికకు బదులుగా ప్రచురించారు. పరిస్థితులు అనుకూలించిన అనంతరం సంఘ స్థాపకులు అయ్యంకి వారి అభీష్టానుసారం గ్రంథాలయ సర్వస్వమును అదే పేరుతో 1948 జనవరిలో పునరుద్ధరించి 12వ సంపుటంగా ప్రారంభించారు. అప్పటి నుండి ఇది క్రమంగా నడుస్తుంది. ప్రస్తుతం 74వ సంపుటం వెలువడుతోంది.

ప్రచురణలు

  • ఉద్యమ ప్రారంభ దినాలలో గ్రంథాలయ సంఘ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించిన శ్రీ సూరి వెంకట నరసింహశాస్త్రిగారు గ్రంథాలయోద్యమాన్ని గురించి వివిధ పత్రికలలో ప్రచురించిన ఆంగ్ల వ్యాసముల సంపుటి "Library Movement in India" ను, తెలుగు పత్రికలలో వెలువడిన శ్రీ యాతగిరి లక్ష్మీ వెంకటరమణగారి వ్యాసాలను "గ్రంథాలయోద్యమము" శీర్షికతోను గ్రంథాలయ సంఘం ప్రచురించింది.
  • 1915, 1916 సం.లలో అప్పటికి దేశంలో పనిచేస్తున్న గ్రంథాలయాల చరిత్రను వెలువరించారు. కొన్ని సంవత్సరాల పాటు సంఘ వార్షిక నివేదికలు, గ్రంథాలయ మహాసభల సంచికలు, ఉద్యమ వ్యాప్తికి దోహదపడే పలు గ్రంథాలు, గ్రంథాలయ నిర్వహణకవసరమైన వివిధ పట్టికలను ప్రచురించారు. సంఘ స్థాపకులు అయ్యంకివారి షష్టిపూర్తిని పురస్కరించుకొని ఐదు చిరుపాత్తములు, సంఘాధ్యక్షులు గాడిచెర్ల వారి షష్టిపూర్తి సమయంలో ఆరు గ్రంథములు, స్వర్ణోత్సవాల సందర్భంలో గ్రంథాలయ ప్రగతి-3 భాగములు సంఘం ప్రచురించింది.
  • గ్రంథాలయములు, వయోజన విద్యకు సంబంధించిన పుస్తకములతోపాటు డా. కట్టమంచి రామలింగారెడ్డిగారి "ముసలమ్మ మరణం", శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి "తెలుగు నుడి దండలు", ఆంధ్రగ్రంథములు మొదటి జాబితా, ఆంధ్రవాజ్మయ సంగ్రహ సూచిక, శ్రీ సర్వోత్తమ జీవితము వంటి పుస్తకాలెన్నింటినో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురించింది.

మహాసభలు

గ్రంథాలయ సంఘం ద్వారా పలు సభలు సమావేశాలు నడిచాయి. 1919లో అయ్యంకి ప్రభృతులు ప్రథమ అఖిల భారత మహా సభను నిర్వహించారు. భారత వైజ్ఞానిక మంత్రిత్వశాఖ లాహోర్లో నిర్వహించిన పౌర గ్రంథాలయ సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అర్హులంటూ హాజరు కావాలకున్న మన ప్రతినిధులను నిరాకరించింది. దానితో ప్రజల ప్రాతినిధ్యం లేని సదస్సులు నిష్ఫలమని భావించి 1919 నవంబరు 1 న మద్రాసు గోఖలే హాలులో తొలి జాతీయ గ్రంథాలయ సదస్సును అపూర్వంగా నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుండి గ్రంథాలయ రంగప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులోనే అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘం ఏర్పడింది.
అనంతరం 1968 లో భారత గ్రంథాలయ సంఘం అభ్యర్థన మేరకు పైన మహాసభ జరిగిన రోజు నవంబరు 14 నుండి వారం రోజులపాటు గ్రంథాలయ వారోత్సవాలుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. 1996 లో భారతీయ గ్రంథాలయ సంఘ 41 వ జాతీయ సదస్సును మూడు రోజుల పాటు విజయవాడలో నిర్వహించారు.

గ్రంథాలయ శిక్షణ

గ్రంథాలయ కార్యక్రమం సవ్యంగా సాగడానికి గ్రంథాలయ శిక్షణ అవసరమని గుర్తించిన సంఘం 1920 వ సం. వేసవిలో మొట్టమొదట 20 మంది గ్రంథాలయ సేవకులకు బెజవాడలో ఒక నెల రోజులపాటు శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో గ్రంథాలయ నిర్వహణ పాఠాలతోపాటు రాజకీయము, అర్థశాస్త్రము, సాంఘిక సేవ మొదలగు విషయాలను బోధించేవారు.
రెండవసారి 1984 జూన్లో 80 మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చారు. ఈ బ్యాచ్‌లో గ్రంథాలయ శాస్త్ర పితామహ రంగనాధ్‌గారి శిష్యులు పుణ్యమూర్తుల రాజశేఖరం, కొఠారి రామారావుగారు బోధించారు. 30 మంది విద్యార్ధులలో వావిలాల'గోపాల కృష్ణయ్య, పాతూరి నాగభూషణం, కలిదిండి నరసింహరాజ వంటి ఉద్దండులు శిక్షణ పొందారు. తదుపరి ఈ బాధ్యతను తన భుజస్కందాలపైకెత్తుకున్నారు పాతూరి నాగభూషణం. 1941 మే నెలలో బెజవాడలోని పటమట అచ్చయ్య ధర్మ గ్రంథాలయంలో గాడిచర్లవారి సారధ్యంలో నిర్వహించారు శిక్షణ, మిగిలిన విషయాలతోపాటు తెలుగు, హిందీ, సంస్కృతవాఙ్మయముల చరిత్రలతోపాటు హిందీ భాషను కూడా నేర్పారు. తదుపరి వివిధ ప్రాంతాలలో ఈ శిక్షణ నిర్వహించారు. ఇలా శిక్షణ పొందినవారు తమతమ ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం, ఉన్నవాటిని పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు-తెలంగాణా, రాయలసీమల నుండేకాక జెంషెడ్పూరు నుండి కూడా వచ్చి శిక్షణ పొందారు.
తదుపరి 1966 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపుతో గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును (CLISC) నిర్వహిస్తున్నారు. దానికి అర్హత 10 వ తరగతి ఉతీర్ణులై ఉండటం. 4 మాసములు శిక్షణ, అనంతరం విద్యార్థుల అర్హతను ఇంటర్మీడియట్‌ వరకూ పెంచి శిక్షణా కాలాన్ని 5 నెలలుగా మార్చారు. ఆదిలో తెలుగు మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు నిర్వహింపబడేది. 1989 నుండి ఆంగ్ల మాధ్యమంలో కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం.

ఏడాదికి రెండుసార్లు - జూన్లో ఒకటి, డిశంబరు నెలలలో మరొకజట్టు నిర్వహిస్తున్నారు. శిక్షణానంతరం ప్రభుత్వ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కమీషనర్ వారు పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ఈ శిక్షణాలయ స్థాపకులు శ్రీ పాతూరి నాగభూషణంగారి మరణానంతరం వాబ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు.
విద్యార్థులకు గ్రంథాలయంలో సాంకేతిక శిక్షణలో భాగంగా గ్రంథాలయంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా M.S. Office, Newgen Libed లలో ప్రవేశం కల్పిస్తున్నారు.