Wednesday, August 22, 2007

పాపికొండల్లో రెండవ పోష్ట్.

ఇంతకు ముందు పోష్టులో కొంతవరకూ రాసాను ఇది కొనసాగింపు. మా ప్రయాణ ప్రయాణ విశేషాలలో రాజమండ్రి నుండి ఆ సాయంత్రం టికెట్స్ తీసుకొని వెనక్కొచ్హిన మేము శనివారం రాత్రి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. ఆదివారం ఉదయం 5 గంటలకు రేవులో ఉండాలని చెప్పారు. ఉదయం 5 గంటలంటే ఎవడులేస్తాడు. అందుకనే ముందురోజన్నమాట. అనుకున్నట్లుగా శనివారం సాయంత్రం మూటా ముల్లే సర్దుకొని అందరం బయలుదేరాం. మెయిన్ రోడ్డుకు వచ్హి ఎంతసేపు ఎదురు చూసినా రాజమండ్రి బస్సు మాత్రం రాలేదు. 'చత్ మంచి టైంలో బయలుదేరలేదురా మనం' మావాళ్ళకామెంట్స్ మొదలైనయ్. మరి బస్సే కావాలంటె ఇలాగే ఉంటుంది.ఏదో ఓదాంట్లో పోయేదానికి మరికొందరు నసుగుతుండటంతో అప్పుడే వచ్హిన రాజమండ్రి క్వారీ లారీ ఆపి దబదబా పైకెక్కేసారంతా..రావులపాలెం కడియం మీదుగా వేమగిరి రూట్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరగా వదిలేసిపోయాడు లారీవాడు. రోడ్డు మీద అంగుళానికో గొయ్యిఉండటం వలన లారీవాడు వచ్హిన స్పీడుకి మేము వెనుక ఎక్కడానికి సరిపోవడంతో ఎవడూ కొట్టకుండానే తన్నులు తిన్నవాళ్ళలా అయిపోయింది మా పరిస్థితి.అక్కడి నుండి పడుతూలేస్తూ ఆటోలకోసం వెతకటం మొదలెట్టారు. కాళీగా ఉన్న ఒక ఆటో వచ్హింది. అది అలా ఆగటం ఆలస్యం నేనంటే నేనని టపటపా ఎక్కేసారు. ఆరుగురెక్కవలసిన ఆటోలో పదిమంది ఎక్కేయడంతో ఆటోవాడు బిత్తరపోయి పోలీసులు పట్టుకుంటారు సార్ ఇంతమందెక్కేస్తే ఆన్నాడు. ఒరేయ్ నువ్వు దిగరా! అంటే కాదు నువ్వు దిగరా! అనుకొంటూ మొత్తానికి నలుగురు బయట పడ్డారు. వెంటనే ఇంకో రెండు ఆటోలు రావడంతో అందరం చకచకా ఎక్కేసాం. తిన్నగా మార్కండేయస్వామి గుడి దగ్గర దిగి అటుప్రక్కగా ఉన్న ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాం. ఒక రూము తీసుకొని బ్యాగులన్నీ ఒక మూల పడేసి స్నానాలు వగైరా పూర్తి చేసుకొని రోడ్లమీద పడ్డాం. కాసేపు అలాలా తిరిగి ముందే వివరాలు తెలియడంవలన మరుసటి రోజుకు ఏమేమికావాలో తీసేసుకోవాలనుకొన్నాం. బిస్చెట్ పాకెట్స్ , హౌసీగేం పాకెట్ మరియు పుస్తకం, చిప్స్ పాకెట్స్ , యాపిల్స్ , ఒక ప్లాస్టిచ్ చాప ఇలా చాలా ఐటెంలు తీసుకొన్నారు. అన్నీ కొనడం అయిపోయాక అక్కడ మంచి భోజనహొటల్ గురించి కొంత సమాచారం సేకరించి ఒక హొటెల్ కెళ్ళి భోజనం కానిచ్హి మెల్లగా తిరిగి రూముకు బయలుదేరాం. గదిలో ఒకేచాప ఉంది మేము ఒకటి కొని తెచ్హాం రెండిటితో ఇంతమంది ఎడ్జస్ట్ అవడం కష్టం కాబట్టి సత్రం వాళ్ళను బ్రతిమాలో మరెలాగో మరో రెండు చాపలు సంపాదించారు. తీసుకొచ్హిన చాపలు వేయటమే ఆలస్యం అన్నట్టుగా ఒరేయ్ నేనిక్కడరా,కొంచెం పక్కకి జరగరా, ఒరేయ్ నువ్విక్కడనుంచి పోరా,ఒరేయ్ నాక్కొంచెం చోటివ్వండిరా,నేనిక్కడ పడుకోనెహె పందిగాడు మీదకాళ్ళేస్తున్నాడు,ఏయ్ పక్కకు జరుగెహె,ఇలా అరుచుకొంటూ అడ్డదిడ్డంగా వాలిపోయారు ఉదయం 4 గంటలకు లేచి చకచకా కాలకౄత్యాలు ముగించి ఎవడి బ్యాగ్ వాడు భుజాన తగిలించి అందరూ తయారయిపోయారు. తయారవడం అయ్యారుగాని ఎవడూ కడలడం లేదు. పరిస్థితి ఏమిటంటే ! టీ గాని కాఫీ గాని పడితేతప్ప కదలనని మొరాయించే సాల్తీలు చాలాఉన్నాయి మా గ్రూపులో. బయటి పరిస్థితి చూస్తే చీకటి,చలి, ఇప్పుడెడు షాపులు తెరుచుకూర్చుంటాడు. సరే చూద్దాం లెమ్మని కొంతదూరం చూస్తూ పోయాం. టీ బడ్డీలైతే బొచ్హెడున్నాయిగానీ అన్నీ షర్టర్లు దించేసో బరకాల్తో మూసేసో ఉన్నాయ్ . మావాళ్ళు టీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక గోనెలబరకం లోపల నిద్రపోతున్న టీబడ్డీ ఆసామిని బ్రతిమాలోబామాలో మొత్తమ్మీద లేపారు. పాపం అతను వీళ్ళ గోల పడలేక స్టవ్ వెలిగించి టీ కాచి ఇచ్హేంతవరకూ వదల్లేదు. తేనీటి సేవనం అయ్యాక సంత్రుప్తి పడి మావాళ్ళంతా హుషారుగా రేవు వైపుగా నడక సాగించారు. ఉదయం మేము వెళ్ళేసరికే రేవులో విపరీతంగా జనం వచ్హిఉన్నారు. అప్పటికే రెండు వెళ్ళి పోగా ఇంకా వరుసలో నాలుగున్నాయి. మేము టికెట్స్ ఇచ్హే దగ్గరకు వెళ్ళి మా టికెట్స్ చూపించి ఎందులో కూర్చోవాలో అడిగాము. మీఇష్టం నాలుగిట్లో ఎందులోనైనా ఎక్కచ్హు. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయలుదేరేవే. అన్నాడు.ముందుగా ఉన్నది అప్పటికే సగంపైగా నిండిపోవడం వలన కాళీగా ఉన్న రెండవదాంట్లోకెళ్ళాం. అన్నిటికీ పైన కార్పెట్స్ వేసిఉన్నాయి కూర్చొనేందుకు వీలుగా. వెళ్ళిన మమ్మల్ని డైవర్ అడిగాడు. పైకెళతారా! లోనికెళతారా! అని. ముందుగా తెలిసిఉండటంవలన పైనే కూర్చుంటాం అని చెప్పాం. అప్పటికి టెంట్ వేయలేదు. కొంచెం ఎండ వచ్హాక వేస్తానన్నాడు.సరేనని చెప్పులు ప్రక్కన విడిచి కూర్చున్నాం అందరం.

అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా వెలుగు వస్తూ ఉంది బాగా చలిగాకూడాఉంది. మరికొద్ది సమయంలొనే నావ పూర్తిగా నిండిపోయింది. రెండు పార్టులుగా ఉండే నావక్రింది బాగంలో ఒకవైపు మాత్రమే జనాన్ని ఎక్కించారు. రెండవవైపు రెండు పెద్దసైజు గ్యాస్ స్టవ్వులూ, ఒక గ్యాస్ బండ, మరికొన్ని పెద్దా చిన్నా పాత్రలు, భోజనం వండేందుకు కావలసిన కూరగాయలు బియ్యం లాంటి సంబారాలు మూటలుగా ప్రక్కగా ఉన్నాయి. అప్పటికే ఒక ఆడమనిషి మరొక కుర్రవాడు ఉల్లిపాయలను పెద్దపేద్ద అల్యూమినియం ప్లేట్లలోకి చకచకా కోసేస్తున్నారు. నావపై ఎక్కేందుకు వేసిన పెద్దబల్లలను తీసేసారు ఇంజన్ స్టార్టయ్యింది. నావ గుండ్రంగా వెనుక నుండి ముందుకు తిరిగి మెల్లగా బయలుదేరింది. వడ్డున ఇంకా ఉన్న జనం, ఎక్కించేందుకు వచ్హిన బంధువులు చేతులూపిస్తుంటే మేమూ వాళ్ళకు టాటా చెప్పాం చేతులూపుతూ. ఒక్కొక్క రేవునూదాటుకొంటూ నావ పాత బ్రిడ్జి క్రిందుగా ముందుకు సాగిపోయింది. ఆరోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది సూర్యోదయాన్ని చూసేందుకు లేకుండా పొగమంచుమాదిరిగా విస్తరించి ఉంది. గొప్పరోజు పెట్టార్రా బాబూ ఇంకే రోజూ దొరకనట్టుగా ఇప్పుడుగాని వర్షం కొట్టిందంటే చచ్హామన్నమాటే. నవ్వుతూ మావాళ్ళ కామెంట్స్. అయితే కాసేపట్లోనే ఉదయపు కిరణాల ధాటికి మంచూ మబ్బులూ ఎగిరిపోయాయ్. రాజమహేంద్రి వెనుకగా దినకరుడు మెల్లగా పైపైకి తొంగిచూస్తున్నాడు.


వాతావరణం ఆహ్లాదంగా ఉండి మావాళ్ళు ఉత్సాహాంగా మాటల్లో పడ్డారు. రాజమండ్రి వైపు ఒడ్డును అనుసరించి కొతదూరంవరకూ వెళ్ళి ఆపై గోదారి నడి మధ్యకు తిరిగింది. అంత ప్రొద్దున్నే కూడా అక్కడక్కడా పైపైకి తొంగి చూస్తున్న ఇసుక దిబ్బల మధ్య చిన్నచిన్న పడవల్లో వలలతో చేపలు పట్టుకొంటూ చాలా మంది కనిపిస్తున్నారు.

OUR GROUP





బహుశా ఉదయపు మార్కెట్టుకు వేయడానికనుకుంటా. వాళ్ళందరినీ దాటుకుంటూ కొవ్వూరు మీదుగా పట్టిసీమ వైపుగా సాగిపోయింది. నీళ్ళమధ్య ఉండుట వలననుకుంటా ఒకవైపునుండి మాదిరిగా ఎండ వస్తున్నా చలిగాలి వీస్తుంది. ఏడున్నర ఎనిమిది మధ్యలో అందరికీ పేపర్ ప్లేట్లలో టిఫిన్ ఇవ్వడం మొదలెట్టారు. అందరూ ఎగబడి తీసుకోడం మెదలెట్టారు. అవును పాపం అప్పటికే అందరికీ కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్. ప్లేట్ లో మూడు మైసూర్ బోండా రెండుగరిటెల ఉప్మా తీసుకొచ్హి ఇచ్హాడొకతను అందులో కొబ్బరి చట్నీ లాంటిదేదో కూడా ఉంది. తినడం పూర్తయినతరువాత టీ తీసుకొచ్హారు వేగంగా వెళ్ళే నావ చుట్టూనీళ్ళు చల్లటి వాతావరణంలో అలా టీ తీసుకొనే మజానే మజా.


అల్పాహారం అయింతరువాత మరికొంత సేపట్లో మీడియం బ్రిడ్జి లాటి కొవ్వూరు గ్యాస్ పైప్ లైన్ కనిపించింది. సింగిల్ లైన్ వారది కట్టారు పెద్ద సైజ్ పైపులను గోదావరిమీదుగా కలుపుతూ వెళ్ళేందుకు.







దూరంగా మసకమసకగా పట్టీసీమ దేవాలయం కనుపిస్తున్నది. దగ్గరకు వెళ్ళే కొద్దీ మరింత అందంగా నీళ్ళలో ప్రతిఫలిస్తూ గోదావరి మధ్యలో చిన్న దీవి

దాన్ని చూస్తుంటే నా ఊహ తెలిసిన తరువాత వచ్హిన ప్రయాణం గుర్తొచ్హింది. అప్పటికి పట్టిసీమ బాగా అభివౄద్ది చెందలేదు. నిడదవోలు మీదుగా బస్సుపై వచ్హి ఇవతలి గట్టునుండి పడవలపై అటు వడ్డుకు వెళ్ళే వాళ్ళం లాంచీలు ఉండేవికావు. రోజుకు వచ్హే నలుగురైదుగురి కోసం లాంచి ఎవడు పెడాతాడు. పడవ దిగి వడ్డునుంచి దిబ్బ దగ్గరకు నదుచుకు వెళ్ళాక గుట్టపైకెళ్ళేందుకు మెట్లలాంటివేం ఉండేటివికావు రోజూ వచ్హే కొద్దిమందీ నడవగా ఏర్పడిన మట్టిదారిలోనే జాగ్రత్తగా ఎక్కవలసివచ్హేది. పైన చూస్తే కేవలం సున్నపురాయి ఇటుకలు కొండరాళ్ళతో కట్టబడిన దేవాలయాలు. సున్నపుకోటింగులు ఎక్కువై పెచ్హులుపెచ్హులుగా ఊడిపోతూనూ, కొన్నిచోట్ల ఇటుకలతో సహా సిమెంటు పెచ్హులుగా లేచిపోయిన గోడలు, దేవాలయాల లోపల కరెంటు లేక నల్లగా పొగచూరినట్టుగా ఉండేది. ఆదాయం లేని దేవాలయాల పరిస్థితి అలాగే ఉంటుందేమో. దేవాలయాల లోపలి పరిస్థితి బాగుండకపోయినా అక్కడి వాతావరణం చుట్టూ ప్రకౄతితో ప్రశాంతంగా భక్తి భావం పెంపొందించేలాఉండేది. వెనుక ఉన్న మండపంలో వంటరిగా కాసేపు కూర్చుంటే నిశ్శబ్దంగా ఉన్నపరిశరాలతో మనసుకు కొంచెందిగులుగా మరికొంచెం వైరాగ్యంగా అదోలా ఉంటుంది.


.అసలలాంటి ఫీలింగ్ రాని దేవాలయం దేవాలయంలానే అనిపించదు. క్యూలలో గుద్దుకొంటూ తోసుకొంటూ కేకలు గొడవ మధ్య ప్రశాంతంగా దేవుని ముందు నిల్చుని ఒక్క క్షణమైనా ధ్యానించగలమా. అటువంటి చోట్లకు వెళ్ళి ప్రయోజనమే లేదు ఏదో మనమూ వెళ్ళాం అనుకోవడంతప్ప. "

Wednesday, August 15, 2007

నేనూ అందచేస్తున్నానోచ్.....లూ

ఇక్కడ కూడా క్లిక్ చేస్తే




Thursday, August 9, 2007

TOUR OF PAAPI KONDALU.

మా పాపికొండలప్రయాణం

గోదావరి మీద పోలవరం వద్ద బ్రిడ్జి కడుతున్నారని పేపర్లలో వార్తలు చదువుతుంటే బాధగా అనిపించింది. ఈదెబ్బతో పాపికొండలు మటాష్ అయిపోతాయి, వాటర్ ప్లోటింగ్ లేక గోదావరి కూడా ఇప్పుడు విజయవాడ తరువాత పిల్లకాలువలా పారే కౄష్ణా నదిలా తెల్ల మొహంతో ఇసుక మేటలను మాత్రమే చూపిస్తుందనుకుంటా, గోదావరిలో స్నానం చేయాలనుకొనే రాజమండ్రి వాసులంతా పాపం మైలు దూరం లోనికి నడువాల్సొస్తుందేమో రేవులనుండి. ఇలా ఆలోచించిన నాకు ఒక్క సారి పాపికొండలు టూర్ వెళితే బావుండు అనిపించింది. ఈసారి ఊరెళితే తప్పక ప్రయత్నించాలి లేకుంటే మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. మొన్న సంక్రాంతికి ఊరెళ్ళానుగాని చాలారోజులు పనుల వత్తిడిలో బయలుదేరుటకు కాదుకదా కనీసం అలోచించేందుకు కూడా వీలవలేదు. కాని విచిత్రంగా ఇదేవిషయమ్మీద మా స్నేహితులే చర్చ లేవదీసారు. అదెలానంటే మేము సాధారణంగా సాయంత్రాలు మిలీనియం పార్కు అనబడే చెరువు గట్టున సమావేశం అవుతుంటాము.మా ఫ్రెండ్స్ లో ఎవరిని ఎప్పుడు కలవాలన్నా అక్కడే దొరకుతారు. {మిలీనియం పార్క్ అనబడే దీని కధ నా పాత పోష్టులో చూడచ్హు } పోలవరం బ్రిడ్జ్ గురించి వాళ్ళూ కూడా నాలాగే అనుకోవడం జరిగిందని టూర్ ప్లాన్ చేయలనుకుంటున్నారని వాళ్ళ మాటాలద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వున్నావు గనుక నువ్వేళ్ళేలోగా ఏదో ఒకరోజు డిసైడ్ చేద్దాం అన్నారు. నాకింకేం కావాలి కాగలకార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అయింది. తరువాత మాటల్లో ఎంతమంది వస్తారు? ఎలా వెళ్ళాలి? టికెట్లు బుక్ చేయడం ఎలా? లాటి డిస్కషన్ తో కొంత సమయం గడిచాక ముందుగా సమాచారం కోసం నెట్ లో వెతికేందుకు వెళ్ళాం.ఎన్ని రకాలుగా సెర్చ్లు చూసినా ఎలా టైప్ చేసినా మాక్కావలసిన సమాచారం మాత్రం సరిగా దొరకలేదు.ఇలా కాదుగాని అసలు ఎందరొస్తారో తెలుసుకోండి డైరెక్టుగా రాజమండ్రి పోయి వివరాలు టికెట్లు రెడూ తేవచ్హు.అన్నారు. సరి. ఉన్న జనం పన్నెండు. అనుమానంగా లేదా ఊగీసలాడేవారు ఏడు. మొత్తం పందొమ్మిది. సాయంత్రానికి కంఫం చేసి చెప్పమన్నాం ఎంతమంది ఖచ్హితంగా వచ్హేదీ... ఆరోజు సాయంత్రానికి పదహారు మందితో లిస్ట్ మాకప్పచెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను మరో ఇద్దరు కలసి రాజమండ్రి బయలుదేరాం.

రాజమండ్రి మాకు రెండు వైపులనుండి వెళ్ళచ్హు. ఇటునుండి కొవ్వూరు మీదుగానూ, అటునుండి రావులపాలెం మీదుగానూ. చిత్రంగా ఎటెళ్ళినా రెండుసార్లు గోదారి క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇటు నిడదవోలు దాటాక విజ్జేశ్వరం చిన్నపాయనూ, తరువాత కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగానూ. ఆవైపుగా మొదట సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా, తరువాత రావులపాలెం - గోపాలపురం బ్రిడ్జి మీదుగానూ.

మేము రాజమండ్రి కోటిపల్లి బస్టాప్ నుండి తిన్నగా దానవాయి పేటలోని మా ఒకానొక పాతఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్హిన పని చెప్పాం. తనకు తెలిసిన వివరాలు కొన్ని చెప్పాడు కాసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం వెళదాం అన్నాడు. సాయంత్రం డెల్టా పేపర్ మిల్లు వైపుగా కొత్తగా కట్టిన సింహాద్రి అప్పన్న గుడిగా పిలువబడే నరసింహ స్వామి వారి దేవస్థానికి వెళ్ళి ధర్శనం చేసుకొని ,గోదావరి స్టేషన్ రోడ్డుకొచ్హాం.అక్కడి నుంచి గోదావరి ప్రక్కగా ఒక్కొక్క స్నాన ఘట్టాన్నీ చూసుకుంటూ తాపీగా నడుచుకుంటూ కనిపించిన ప్రతి ట్రావెల్ అఫీసులోనూ ఎంక్వైరీ చేసుకొంటూ మార్కండేయస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న లాంచీల రేవుకొచ్హాం.

ఏతా వాతా చెత్తంతా ఏరేయగా మిగిలిన సమాచారం ఇది. రాజమండ్రి నుండి మొదలయ్యే ఈటూర్ పట్టిసీమ,గండి పోశమ్మ దేవాలయాలమీదుగా పేరంటాలపల్లితో అంతమయిపోతుంది. ట్రావెల్ లేదా టూరిజం వారిద్వారా వెళ్ళే 50 మంది కెపాసిటీ కలిగిన మీడియం యాచెట్ అనబడే బోట్లో పెద్దలకు- 500లు, పిల్లలకు- 300ల రూపాయలు. ఇంక్లూడ్ ఉదయాల్పాహారం. మధ్యాన భోజనం నాన్ వెజ్ లేకుండా. సాయంత్రం తేనీరు. ఇలా ఉంది మెనూ. బోటు అప్పర్ డెక్ పై రెండు వరుసల కుర్చీలు ఒక వైపు టీ వి, డీవీడీ మరొకవైపు చిన్న స్టేజ్ లాటి ఏర్పాటు. డేన్సులు వగైరాలకు. ఇది నీళ్ళెక్కువ ఉంటే రాజమండ్రి తక్కవుంటే పట్టిసీమల నుండి బయలుదేరునని తెలియచేసారు.ఇక లాంచీలనావల వర్తక్ సంఘం వారి ద్వారా లాంచీ ఒక్కింటికి నలభై మంది.పెద్దలకు 300లు. పిల్లలకు 200లు పైన చెప్పిన విధంగా బ్రేక్పాస్ట్,లంచ్,ఈవెనింగ్ టీలతో కలిపి. నో టివి నో సాంగ్స్. లాంచీ పైన టెంట్ వేస్తారు పైన క్రింద ఎక్కడైనా కూర్చోవచ్హు. ఇవి రెండున్నూ ఆదివారం ఉదయం బయలుదేరుతాయి.ఒక్క కార్తీక మాసంలో మాత్రం ప్రతీ రోజూ నడుస్తాయి. ఇలానేకాక ఒకే ఫ్యామిలీ విడిగా వెళ్ళాలనుకుంటే లాంచీ మొత్తంగా మాట్లాడుకోవచ్హు. ఈ మాదిరిగా ఉన్న టికెట్ రేట్లు విన్న మావాళ్ళు లోకల్ ఫ్రెండును అడిగారు ఏంచేద్దామని. వాడు అంతకు ముందు వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత సమాచారం సేకరించాడు. ఫైనల్ గా వాడు చెప్పినదేమిటంటే పెద్ద బోట్ అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకూ కుర్చీలలో కూర్చొని కూర్చొని నడుములు పట్టేసి సగం ప్రాణం ఎగిరిపోతుంది. అదే లాంచ్ అయితే పైన ఎలానూ పరుపు వేస్తాడు మరియు టెంట్ ఉండనే ఉంటుంది కాబట్టి కావలసినంతసమయం మనిష్టంగా దొర్లవచ్హు ఎలానూ ఉన్నదంతా కుర్రాళ్ళే కనుక అసలు సమస్యే ఉండదు. అదీ వాడు వాళ్ళ మాటగా చెప్పింది. సరేపదమని మార్కండేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న లాంచ్ రేవుకు వెళ్ళాం. అక్కడ మెట్లపై ఒక చిన్న టెంట్ దానిక్రింద టేబిల్ ,నాలుగు కుర్చీలు. ఈ సెటప్ లో ఇద్దరు ముసలోళ్ళు టేబిల్ పై రెండు రిసీట్ పుస్తకాలతో కూర్చొని ఉన్నారు. మా పదహారు మందికి టికెట్స్ తీసుకోవడంతో పనిపూర్తయిపోయిది. చల్లని సాయంత్రం గోదారి వడ్డున నడుచుకొంటూ అటుదగ్గరలో కొత్తగా కట్టిన ఇస్కాన్ శ్రీ కౄష్ణ దేవాలయం చూసేందుకు వెళ్ళాం ఇదే రోడ్డులో స్వామి అయ్యప్ప దేవాలయం భారీ ఎత్తున నిర్మాణదశలో ఉంది.ఆ చుట్టుపట్ల పెద్దపెద్ద పాలరాతి దిమ్మలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. వాటిని దాటి కొంత దూరం పెళ్ళాక గోదావరి వడ్డున విశాలమైన కాళీ స్థలంలో ప్రశాంత వాతావరణంలో కట్టిన కౄష్ణ దేవాలయానికి చేరుకున్నాం. దాన్ని చూస్తేనే అర్ధమవుతుంది రాజమండ్రి లో ఇప్పుడు చూడ దగిన కట్టడాల్లో ముఖ్యమయినవాటిలో ఒకటిగా మారిపోతుందని. దేవాలయం లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంది. అన్నిరకాల భక్తి సాహిత్యం పూజా సామగ్రి ప్రసాదాలు చేతి తయారీ వస్తువులు అమ్ముతున్నారక్కడ కాకుంటే రేట్లు చాలా హెచ్హుగా ఉన్నయి. జనవరిలో నేను తిరుమల వెళ్ళినపుడు కొత్తగా ఓపెన్ చేయబడిన ఇస్కాన్ దేవాలయనికి వెళ్ళాను.అక్కడ కూడా ఇలానే ఇన్నీ అమ్ముతున్నారు.ఎందువలనో తెలియదు గాని ప్రతీ వాటిపై 50 శాతం తగ్గింపుతో అందచేస్తున్నారు.వెంటనే నేను తెలుగు వచన రామాయణం , భాగవతం , భగవద్గీత మూడిటినీ తీసుకొన్నాను. అంతకు ముందు నే చూసిన ఈపుస్తకాల్లో లేని ఒక ప్రత్యేకత దాదాపు ఇరవై పేజీలవరకూ మధ్య మధ్యన ఆయిల్ ప్రింట్ ఫోటోలు ఉండటం. నా వద్ద ఆ సమయంలో ఎక్కువ డబ్బు లేకపోయింది లేదంటే ఇంకా తీసుకొనేవాడినే....................
మేటర్ ఎక్కువగా ఉండుటవలన మిగిలిన దాన్ని మరొక పోష్టుగా అందిస్తాను.{సశేషమన్నమాట}

Thursday, August 2, 2007

పసిడి పలుకులు.

పసిడి పలుకులు.