Saturday, September 29, 2007

నగర రహదారులకు మేమేల తీసిపోవలె

పల్లె రహదారులంటే బురదతో మట్టితో ఉంటాయని చాలమంది అనుకొంటుంటారు {ఒకప్పుడు చాలా ఉండేవనుకోండి}.ఇప్పుడు వాటికి విరుద్దంగా ఉంటాయని--ఉంటున్నాయని--నిరూపించేయాలనే చిన్ని ప్రయత్నం.
ఈ చిత్రాలు చూసి ప్రయత్న ఫలితం మీరే చెప్పడి.
నగర రహదారులకు మేమేల తీసిపోవలె
ట్రాఫిక్ జాములు రెడ్ సిగ్నల్స్ లేవోచ్

కాలుష్యం అంటే మాకేల తెలియును

ధుర్గంధం బురదలు కానవచ్చుటలేదేం

క్లీన్ & గ్రీన్ {మాదగ్గర చెప్పల్సిన అవసరముందా}

ప్రశాంతత జీవన వికాసాలు. కాలుష్యం కానరాని పల్లె అందాలు.
{కావని చెప్పలేరని పందెం}





Tuesday, September 18, 2007

మాఊరంటే నాకిష్టం

వేమూరి వేంకటేశ్వరరావు, మాఊరంటే నాకిష్టం : {తుని వ్యాసభాగము నుండి}
రైల్ మీల్భోజనం-విషయంలో కూడ తుని పర్యాటకులని బాగానే ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాలు ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మెడ్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడ చెప్పేవారు. భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని ఊరు మట్టిలో ఏమి ఉందో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి ఇంతా అంతా కాదు. దేశం అంతా ప్రసిద్ధి. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉండేవి. తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోయేవి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే పాత రోజులలో ఒక లగ్జరీ. తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని మా ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అనేవారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవాలలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం మా ఊరి వర్తకులకి ఉందనిన్నీ అప్పుడు తెలిసింది. స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబులో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లవుడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. తునిలో ఉన్న సామాన్య జనసందోహానికి అదొక్కటే రేడియో. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది! అరిగిపోయిన ఆ చదరంగం బల్ల మీద గళ్ళు కనిపించేవే కావు.పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యెష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యెష్టమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు,” అని తీర్పు చెప్పేరుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు...
నాకు ఈ వ్యాసభాగం చాలా నచ్చింది.కాని తెలుగు వికీలో ఈ వ్యాసాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ భాగాలనుండి చాలావరకూ కత్తిరించి తీసేయాల్సి రావడం బాగా అనిపించలేదు. కత్తిరించే భాగాలను ఒక టపాగా ఇస్తే... అనే ఆలోచన రావడంతో ఇది ఇలా మీ ముందుకొచ్చింది.

Tuesday, September 11, 2007

అమ్మాయి ఎందుకేడుస్తుంది.

ఈ మద్య మా ఫ్రెండ్స్ నన్ను బాగా మోసేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళకో కారణం దొరికేసింది. ఆమద్య మంచి మూడ్లో ఉన్నపుడు ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని భీభత్సంగా గీకేసాం... అయితే మనమెంత భీభత్సంగా గీకామో ఆ బొమ్మ అంత సున్నితంగా వచ్హేసింది. సరే బావుంది కదాని రూముకు తీసుకుపోయి చిన్నగా ఫ్రేం కట్టి గోడకు తగిలించా. అదిగో అదే పెద్ద తప్పయి పోయింది.... ఇంతకూ నే వేసిన లేదా గీసిన చిత్రం ఏమిటంటే విచారగా ఏడుస్తున్న ఒక అమ్మాయి. ఇక అప్పటినుండి దాన్నెవడు చూస్తే వాడు నన్ను మోసేయటం మొదలెట్టారు. ఒరే ఎందుకురా ఆ అమ్మయిని అలా ఏడిపిస్తావ్ అంటాడొకడు. ఏరా ఏంచేసావురా ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది అంటాడింకొకడు. ఎందుకురా అ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తుంటుంది అంటాడు మరొకడు. రోజూ ఎందుకురా అలా ఏడిపిస్తావ్ అడిగిందేదో ఇవ్వచ్హుగా ఎవరూ లేరనుకున్నవా తాట వలుస్తా అంటాడొకడు. ఈ రోజు కూడానా! రోజూ ఏడిపిస్తానే ఉంటవేంట్రా మరో డైలాగ్.. నాన్ స్టాప్ క్రైయింగ్లో గిన్నిస్ కెళ్ళాలనేంట్రా.... ఇలా నా మెదడు 'తడిగిణతోం తడిగిణతోం' అని వాయించేసుకుంటున్నారు. ప్రతిరోజూ.... ఇక వాళ్ళ బాధ పడలేక అక్కడినుంచి పీకేసి స్కాన్ చేసేసాను. ఇక చించి కుప్పతొట్లో ఆ బొమ్మను...అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది...

ఇది నే గీసిన అసలు బొమ్మ
"బొమ్మను క్లిక్ చేసి చూస్తేనే అమ్మాయి ఏడుస్తుందా లేదా అనేది తెలుస్తుంది"

రంగుల్లో అయితే ఎలాగుంటుందబ్బా అని.

Wednesday, August 22, 2007

పాపికొండల్లో రెండవ పోష్ట్.

ఇంతకు ముందు పోష్టులో కొంతవరకూ రాసాను ఇది కొనసాగింపు. మా ప్రయాణ ప్రయాణ విశేషాలలో రాజమండ్రి నుండి ఆ సాయంత్రం టికెట్స్ తీసుకొని వెనక్కొచ్హిన మేము శనివారం రాత్రి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. ఆదివారం ఉదయం 5 గంటలకు రేవులో ఉండాలని చెప్పారు. ఉదయం 5 గంటలంటే ఎవడులేస్తాడు. అందుకనే ముందురోజన్నమాట. అనుకున్నట్లుగా శనివారం సాయంత్రం మూటా ముల్లే సర్దుకొని అందరం బయలుదేరాం. మెయిన్ రోడ్డుకు వచ్హి ఎంతసేపు ఎదురు చూసినా రాజమండ్రి బస్సు మాత్రం రాలేదు. 'చత్ మంచి టైంలో బయలుదేరలేదురా మనం' మావాళ్ళకామెంట్స్ మొదలైనయ్. మరి బస్సే కావాలంటె ఇలాగే ఉంటుంది.ఏదో ఓదాంట్లో పోయేదానికి మరికొందరు నసుగుతుండటంతో అప్పుడే వచ్హిన రాజమండ్రి క్వారీ లారీ ఆపి దబదబా పైకెక్కేసారంతా..రావులపాలెం కడియం మీదుగా వేమగిరి రూట్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరగా వదిలేసిపోయాడు లారీవాడు. రోడ్డు మీద అంగుళానికో గొయ్యిఉండటం వలన లారీవాడు వచ్హిన స్పీడుకి మేము వెనుక ఎక్కడానికి సరిపోవడంతో ఎవడూ కొట్టకుండానే తన్నులు తిన్నవాళ్ళలా అయిపోయింది మా పరిస్థితి.అక్కడి నుండి పడుతూలేస్తూ ఆటోలకోసం వెతకటం మొదలెట్టారు. కాళీగా ఉన్న ఒక ఆటో వచ్హింది. అది అలా ఆగటం ఆలస్యం నేనంటే నేనని టపటపా ఎక్కేసారు. ఆరుగురెక్కవలసిన ఆటోలో పదిమంది ఎక్కేయడంతో ఆటోవాడు బిత్తరపోయి పోలీసులు పట్టుకుంటారు సార్ ఇంతమందెక్కేస్తే ఆన్నాడు. ఒరేయ్ నువ్వు దిగరా! అంటే కాదు నువ్వు దిగరా! అనుకొంటూ మొత్తానికి నలుగురు బయట పడ్డారు. వెంటనే ఇంకో రెండు ఆటోలు రావడంతో అందరం చకచకా ఎక్కేసాం. తిన్నగా మార్కండేయస్వామి గుడి దగ్గర దిగి అటుప్రక్కగా ఉన్న ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాం. ఒక రూము తీసుకొని బ్యాగులన్నీ ఒక మూల పడేసి స్నానాలు వగైరా పూర్తి చేసుకొని రోడ్లమీద పడ్డాం. కాసేపు అలాలా తిరిగి ముందే వివరాలు తెలియడంవలన మరుసటి రోజుకు ఏమేమికావాలో తీసేసుకోవాలనుకొన్నాం. బిస్చెట్ పాకెట్స్ , హౌసీగేం పాకెట్ మరియు పుస్తకం, చిప్స్ పాకెట్స్ , యాపిల్స్ , ఒక ప్లాస్టిచ్ చాప ఇలా చాలా ఐటెంలు తీసుకొన్నారు. అన్నీ కొనడం అయిపోయాక అక్కడ మంచి భోజనహొటల్ గురించి కొంత సమాచారం సేకరించి ఒక హొటెల్ కెళ్ళి భోజనం కానిచ్హి మెల్లగా తిరిగి రూముకు బయలుదేరాం. గదిలో ఒకేచాప ఉంది మేము ఒకటి కొని తెచ్హాం రెండిటితో ఇంతమంది ఎడ్జస్ట్ అవడం కష్టం కాబట్టి సత్రం వాళ్ళను బ్రతిమాలో మరెలాగో మరో రెండు చాపలు సంపాదించారు. తీసుకొచ్హిన చాపలు వేయటమే ఆలస్యం అన్నట్టుగా ఒరేయ్ నేనిక్కడరా,కొంచెం పక్కకి జరగరా, ఒరేయ్ నువ్విక్కడనుంచి పోరా,ఒరేయ్ నాక్కొంచెం చోటివ్వండిరా,నేనిక్కడ పడుకోనెహె పందిగాడు మీదకాళ్ళేస్తున్నాడు,ఏయ్ పక్కకు జరుగెహె,ఇలా అరుచుకొంటూ అడ్డదిడ్డంగా వాలిపోయారు ఉదయం 4 గంటలకు లేచి చకచకా కాలకౄత్యాలు ముగించి ఎవడి బ్యాగ్ వాడు భుజాన తగిలించి అందరూ తయారయిపోయారు. తయారవడం అయ్యారుగాని ఎవడూ కడలడం లేదు. పరిస్థితి ఏమిటంటే ! టీ గాని కాఫీ గాని పడితేతప్ప కదలనని మొరాయించే సాల్తీలు చాలాఉన్నాయి మా గ్రూపులో. బయటి పరిస్థితి చూస్తే చీకటి,చలి, ఇప్పుడెడు షాపులు తెరుచుకూర్చుంటాడు. సరే చూద్దాం లెమ్మని కొంతదూరం చూస్తూ పోయాం. టీ బడ్డీలైతే బొచ్హెడున్నాయిగానీ అన్నీ షర్టర్లు దించేసో బరకాల్తో మూసేసో ఉన్నాయ్ . మావాళ్ళు టీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక గోనెలబరకం లోపల నిద్రపోతున్న టీబడ్డీ ఆసామిని బ్రతిమాలోబామాలో మొత్తమ్మీద లేపారు. పాపం అతను వీళ్ళ గోల పడలేక స్టవ్ వెలిగించి టీ కాచి ఇచ్హేంతవరకూ వదల్లేదు. తేనీటి సేవనం అయ్యాక సంత్రుప్తి పడి మావాళ్ళంతా హుషారుగా రేవు వైపుగా నడక సాగించారు. ఉదయం మేము వెళ్ళేసరికే రేవులో విపరీతంగా జనం వచ్హిఉన్నారు. అప్పటికే రెండు వెళ్ళి పోగా ఇంకా వరుసలో నాలుగున్నాయి. మేము టికెట్స్ ఇచ్హే దగ్గరకు వెళ్ళి మా టికెట్స్ చూపించి ఎందులో కూర్చోవాలో అడిగాము. మీఇష్టం నాలుగిట్లో ఎందులోనైనా ఎక్కచ్హు. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయలుదేరేవే. అన్నాడు.ముందుగా ఉన్నది అప్పటికే సగంపైగా నిండిపోవడం వలన కాళీగా ఉన్న రెండవదాంట్లోకెళ్ళాం. అన్నిటికీ పైన కార్పెట్స్ వేసిఉన్నాయి కూర్చొనేందుకు వీలుగా. వెళ్ళిన మమ్మల్ని డైవర్ అడిగాడు. పైకెళతారా! లోనికెళతారా! అని. ముందుగా తెలిసిఉండటంవలన పైనే కూర్చుంటాం అని చెప్పాం. అప్పటికి టెంట్ వేయలేదు. కొంచెం ఎండ వచ్హాక వేస్తానన్నాడు.సరేనని చెప్పులు ప్రక్కన విడిచి కూర్చున్నాం అందరం.

అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా వెలుగు వస్తూ ఉంది బాగా చలిగాకూడాఉంది. మరికొద్ది సమయంలొనే నావ పూర్తిగా నిండిపోయింది. రెండు పార్టులుగా ఉండే నావక్రింది బాగంలో ఒకవైపు మాత్రమే జనాన్ని ఎక్కించారు. రెండవవైపు రెండు పెద్దసైజు గ్యాస్ స్టవ్వులూ, ఒక గ్యాస్ బండ, మరికొన్ని పెద్దా చిన్నా పాత్రలు, భోజనం వండేందుకు కావలసిన కూరగాయలు బియ్యం లాంటి సంబారాలు మూటలుగా ప్రక్కగా ఉన్నాయి. అప్పటికే ఒక ఆడమనిషి మరొక కుర్రవాడు ఉల్లిపాయలను పెద్దపేద్ద అల్యూమినియం ప్లేట్లలోకి చకచకా కోసేస్తున్నారు. నావపై ఎక్కేందుకు వేసిన పెద్దబల్లలను తీసేసారు ఇంజన్ స్టార్టయ్యింది. నావ గుండ్రంగా వెనుక నుండి ముందుకు తిరిగి మెల్లగా బయలుదేరింది. వడ్డున ఇంకా ఉన్న జనం, ఎక్కించేందుకు వచ్హిన బంధువులు చేతులూపిస్తుంటే మేమూ వాళ్ళకు టాటా చెప్పాం చేతులూపుతూ. ఒక్కొక్క రేవునూదాటుకొంటూ నావ పాత బ్రిడ్జి క్రిందుగా ముందుకు సాగిపోయింది. ఆరోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది సూర్యోదయాన్ని చూసేందుకు లేకుండా పొగమంచుమాదిరిగా విస్తరించి ఉంది. గొప్పరోజు పెట్టార్రా బాబూ ఇంకే రోజూ దొరకనట్టుగా ఇప్పుడుగాని వర్షం కొట్టిందంటే చచ్హామన్నమాటే. నవ్వుతూ మావాళ్ళ కామెంట్స్. అయితే కాసేపట్లోనే ఉదయపు కిరణాల ధాటికి మంచూ మబ్బులూ ఎగిరిపోయాయ్. రాజమహేంద్రి వెనుకగా దినకరుడు మెల్లగా పైపైకి తొంగిచూస్తున్నాడు.


వాతావరణం ఆహ్లాదంగా ఉండి మావాళ్ళు ఉత్సాహాంగా మాటల్లో పడ్డారు. రాజమండ్రి వైపు ఒడ్డును అనుసరించి కొతదూరంవరకూ వెళ్ళి ఆపై గోదారి నడి మధ్యకు తిరిగింది. అంత ప్రొద్దున్నే కూడా అక్కడక్కడా పైపైకి తొంగి చూస్తున్న ఇసుక దిబ్బల మధ్య చిన్నచిన్న పడవల్లో వలలతో చేపలు పట్టుకొంటూ చాలా మంది కనిపిస్తున్నారు.

OUR GROUP





బహుశా ఉదయపు మార్కెట్టుకు వేయడానికనుకుంటా. వాళ్ళందరినీ దాటుకుంటూ కొవ్వూరు మీదుగా పట్టిసీమ వైపుగా సాగిపోయింది. నీళ్ళమధ్య ఉండుట వలననుకుంటా ఒకవైపునుండి మాదిరిగా ఎండ వస్తున్నా చలిగాలి వీస్తుంది. ఏడున్నర ఎనిమిది మధ్యలో అందరికీ పేపర్ ప్లేట్లలో టిఫిన్ ఇవ్వడం మొదలెట్టారు. అందరూ ఎగబడి తీసుకోడం మెదలెట్టారు. అవును పాపం అప్పటికే అందరికీ కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్. ప్లేట్ లో మూడు మైసూర్ బోండా రెండుగరిటెల ఉప్మా తీసుకొచ్హి ఇచ్హాడొకతను అందులో కొబ్బరి చట్నీ లాంటిదేదో కూడా ఉంది. తినడం పూర్తయినతరువాత టీ తీసుకొచ్హారు వేగంగా వెళ్ళే నావ చుట్టూనీళ్ళు చల్లటి వాతావరణంలో అలా టీ తీసుకొనే మజానే మజా.


అల్పాహారం అయింతరువాత మరికొంత సేపట్లో మీడియం బ్రిడ్జి లాటి కొవ్వూరు గ్యాస్ పైప్ లైన్ కనిపించింది. సింగిల్ లైన్ వారది కట్టారు పెద్ద సైజ్ పైపులను గోదావరిమీదుగా కలుపుతూ వెళ్ళేందుకు.







దూరంగా మసకమసకగా పట్టీసీమ దేవాలయం కనుపిస్తున్నది. దగ్గరకు వెళ్ళే కొద్దీ మరింత అందంగా నీళ్ళలో ప్రతిఫలిస్తూ గోదావరి మధ్యలో చిన్న దీవి

దాన్ని చూస్తుంటే నా ఊహ తెలిసిన తరువాత వచ్హిన ప్రయాణం గుర్తొచ్హింది. అప్పటికి పట్టిసీమ బాగా అభివౄద్ది చెందలేదు. నిడదవోలు మీదుగా బస్సుపై వచ్హి ఇవతలి గట్టునుండి పడవలపై అటు వడ్డుకు వెళ్ళే వాళ్ళం లాంచీలు ఉండేవికావు. రోజుకు వచ్హే నలుగురైదుగురి కోసం లాంచి ఎవడు పెడాతాడు. పడవ దిగి వడ్డునుంచి దిబ్బ దగ్గరకు నదుచుకు వెళ్ళాక గుట్టపైకెళ్ళేందుకు మెట్లలాంటివేం ఉండేటివికావు రోజూ వచ్హే కొద్దిమందీ నడవగా ఏర్పడిన మట్టిదారిలోనే జాగ్రత్తగా ఎక్కవలసివచ్హేది. పైన చూస్తే కేవలం సున్నపురాయి ఇటుకలు కొండరాళ్ళతో కట్టబడిన దేవాలయాలు. సున్నపుకోటింగులు ఎక్కువై పెచ్హులుపెచ్హులుగా ఊడిపోతూనూ, కొన్నిచోట్ల ఇటుకలతో సహా సిమెంటు పెచ్హులుగా లేచిపోయిన గోడలు, దేవాలయాల లోపల కరెంటు లేక నల్లగా పొగచూరినట్టుగా ఉండేది. ఆదాయం లేని దేవాలయాల పరిస్థితి అలాగే ఉంటుందేమో. దేవాలయాల లోపలి పరిస్థితి బాగుండకపోయినా అక్కడి వాతావరణం చుట్టూ ప్రకౄతితో ప్రశాంతంగా భక్తి భావం పెంపొందించేలాఉండేది. వెనుక ఉన్న మండపంలో వంటరిగా కాసేపు కూర్చుంటే నిశ్శబ్దంగా ఉన్నపరిశరాలతో మనసుకు కొంచెందిగులుగా మరికొంచెం వైరాగ్యంగా అదోలా ఉంటుంది.


.అసలలాంటి ఫీలింగ్ రాని దేవాలయం దేవాలయంలానే అనిపించదు. క్యూలలో గుద్దుకొంటూ తోసుకొంటూ కేకలు గొడవ మధ్య ప్రశాంతంగా దేవుని ముందు నిల్చుని ఒక్క క్షణమైనా ధ్యానించగలమా. అటువంటి చోట్లకు వెళ్ళి ప్రయోజనమే లేదు ఏదో మనమూ వెళ్ళాం అనుకోవడంతప్ప. "

Wednesday, August 15, 2007

నేనూ అందచేస్తున్నానోచ్.....లూ

ఇక్కడ కూడా క్లిక్ చేస్తే




Thursday, August 9, 2007

TOUR OF PAAPI KONDALU.

మా పాపికొండలప్రయాణం

గోదావరి మీద పోలవరం వద్ద బ్రిడ్జి కడుతున్నారని పేపర్లలో వార్తలు చదువుతుంటే బాధగా అనిపించింది. ఈదెబ్బతో పాపికొండలు మటాష్ అయిపోతాయి, వాటర్ ప్లోటింగ్ లేక గోదావరి కూడా ఇప్పుడు విజయవాడ తరువాత పిల్లకాలువలా పారే కౄష్ణా నదిలా తెల్ల మొహంతో ఇసుక మేటలను మాత్రమే చూపిస్తుందనుకుంటా, గోదావరిలో స్నానం చేయాలనుకొనే రాజమండ్రి వాసులంతా పాపం మైలు దూరం లోనికి నడువాల్సొస్తుందేమో రేవులనుండి. ఇలా ఆలోచించిన నాకు ఒక్క సారి పాపికొండలు టూర్ వెళితే బావుండు అనిపించింది. ఈసారి ఊరెళితే తప్పక ప్రయత్నించాలి లేకుంటే మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. మొన్న సంక్రాంతికి ఊరెళ్ళానుగాని చాలారోజులు పనుల వత్తిడిలో బయలుదేరుటకు కాదుకదా కనీసం అలోచించేందుకు కూడా వీలవలేదు. కాని విచిత్రంగా ఇదేవిషయమ్మీద మా స్నేహితులే చర్చ లేవదీసారు. అదెలానంటే మేము సాధారణంగా సాయంత్రాలు మిలీనియం పార్కు అనబడే చెరువు గట్టున సమావేశం అవుతుంటాము.మా ఫ్రెండ్స్ లో ఎవరిని ఎప్పుడు కలవాలన్నా అక్కడే దొరకుతారు. {మిలీనియం పార్క్ అనబడే దీని కధ నా పాత పోష్టులో చూడచ్హు } పోలవరం బ్రిడ్జ్ గురించి వాళ్ళూ కూడా నాలాగే అనుకోవడం జరిగిందని టూర్ ప్లాన్ చేయలనుకుంటున్నారని వాళ్ళ మాటాలద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వున్నావు గనుక నువ్వేళ్ళేలోగా ఏదో ఒకరోజు డిసైడ్ చేద్దాం అన్నారు. నాకింకేం కావాలి కాగలకార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అయింది. తరువాత మాటల్లో ఎంతమంది వస్తారు? ఎలా వెళ్ళాలి? టికెట్లు బుక్ చేయడం ఎలా? లాటి డిస్కషన్ తో కొంత సమయం గడిచాక ముందుగా సమాచారం కోసం నెట్ లో వెతికేందుకు వెళ్ళాం.ఎన్ని రకాలుగా సెర్చ్లు చూసినా ఎలా టైప్ చేసినా మాక్కావలసిన సమాచారం మాత్రం సరిగా దొరకలేదు.ఇలా కాదుగాని అసలు ఎందరొస్తారో తెలుసుకోండి డైరెక్టుగా రాజమండ్రి పోయి వివరాలు టికెట్లు రెడూ తేవచ్హు.అన్నారు. సరి. ఉన్న జనం పన్నెండు. అనుమానంగా లేదా ఊగీసలాడేవారు ఏడు. మొత్తం పందొమ్మిది. సాయంత్రానికి కంఫం చేసి చెప్పమన్నాం ఎంతమంది ఖచ్హితంగా వచ్హేదీ... ఆరోజు సాయంత్రానికి పదహారు మందితో లిస్ట్ మాకప్పచెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను మరో ఇద్దరు కలసి రాజమండ్రి బయలుదేరాం.

రాజమండ్రి మాకు రెండు వైపులనుండి వెళ్ళచ్హు. ఇటునుండి కొవ్వూరు మీదుగానూ, అటునుండి రావులపాలెం మీదుగానూ. చిత్రంగా ఎటెళ్ళినా రెండుసార్లు గోదారి క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇటు నిడదవోలు దాటాక విజ్జేశ్వరం చిన్నపాయనూ, తరువాత కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగానూ. ఆవైపుగా మొదట సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా, తరువాత రావులపాలెం - గోపాలపురం బ్రిడ్జి మీదుగానూ.

మేము రాజమండ్రి కోటిపల్లి బస్టాప్ నుండి తిన్నగా దానవాయి పేటలోని మా ఒకానొక పాతఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్హిన పని చెప్పాం. తనకు తెలిసిన వివరాలు కొన్ని చెప్పాడు కాసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం వెళదాం అన్నాడు. సాయంత్రం డెల్టా పేపర్ మిల్లు వైపుగా కొత్తగా కట్టిన సింహాద్రి అప్పన్న గుడిగా పిలువబడే నరసింహ స్వామి వారి దేవస్థానికి వెళ్ళి ధర్శనం చేసుకొని ,గోదావరి స్టేషన్ రోడ్డుకొచ్హాం.అక్కడి నుంచి గోదావరి ప్రక్కగా ఒక్కొక్క స్నాన ఘట్టాన్నీ చూసుకుంటూ తాపీగా నడుచుకుంటూ కనిపించిన ప్రతి ట్రావెల్ అఫీసులోనూ ఎంక్వైరీ చేసుకొంటూ మార్కండేయస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న లాంచీల రేవుకొచ్హాం.

ఏతా వాతా చెత్తంతా ఏరేయగా మిగిలిన సమాచారం ఇది. రాజమండ్రి నుండి మొదలయ్యే ఈటూర్ పట్టిసీమ,గండి పోశమ్మ దేవాలయాలమీదుగా పేరంటాలపల్లితో అంతమయిపోతుంది. ట్రావెల్ లేదా టూరిజం వారిద్వారా వెళ్ళే 50 మంది కెపాసిటీ కలిగిన మీడియం యాచెట్ అనబడే బోట్లో పెద్దలకు- 500లు, పిల్లలకు- 300ల రూపాయలు. ఇంక్లూడ్ ఉదయాల్పాహారం. మధ్యాన భోజనం నాన్ వెజ్ లేకుండా. సాయంత్రం తేనీరు. ఇలా ఉంది మెనూ. బోటు అప్పర్ డెక్ పై రెండు వరుసల కుర్చీలు ఒక వైపు టీ వి, డీవీడీ మరొకవైపు చిన్న స్టేజ్ లాటి ఏర్పాటు. డేన్సులు వగైరాలకు. ఇది నీళ్ళెక్కువ ఉంటే రాజమండ్రి తక్కవుంటే పట్టిసీమల నుండి బయలుదేరునని తెలియచేసారు.ఇక లాంచీలనావల వర్తక్ సంఘం వారి ద్వారా లాంచీ ఒక్కింటికి నలభై మంది.పెద్దలకు 300లు. పిల్లలకు 200లు పైన చెప్పిన విధంగా బ్రేక్పాస్ట్,లంచ్,ఈవెనింగ్ టీలతో కలిపి. నో టివి నో సాంగ్స్. లాంచీ పైన టెంట్ వేస్తారు పైన క్రింద ఎక్కడైనా కూర్చోవచ్హు. ఇవి రెండున్నూ ఆదివారం ఉదయం బయలుదేరుతాయి.ఒక్క కార్తీక మాసంలో మాత్రం ప్రతీ రోజూ నడుస్తాయి. ఇలానేకాక ఒకే ఫ్యామిలీ విడిగా వెళ్ళాలనుకుంటే లాంచీ మొత్తంగా మాట్లాడుకోవచ్హు. ఈ మాదిరిగా ఉన్న టికెట్ రేట్లు విన్న మావాళ్ళు లోకల్ ఫ్రెండును అడిగారు ఏంచేద్దామని. వాడు అంతకు ముందు వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత సమాచారం సేకరించాడు. ఫైనల్ గా వాడు చెప్పినదేమిటంటే పెద్ద బోట్ అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకూ కుర్చీలలో కూర్చొని కూర్చొని నడుములు పట్టేసి సగం ప్రాణం ఎగిరిపోతుంది. అదే లాంచ్ అయితే పైన ఎలానూ పరుపు వేస్తాడు మరియు టెంట్ ఉండనే ఉంటుంది కాబట్టి కావలసినంతసమయం మనిష్టంగా దొర్లవచ్హు ఎలానూ ఉన్నదంతా కుర్రాళ్ళే కనుక అసలు సమస్యే ఉండదు. అదీ వాడు వాళ్ళ మాటగా చెప్పింది. సరేపదమని మార్కండేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న లాంచ్ రేవుకు వెళ్ళాం. అక్కడ మెట్లపై ఒక చిన్న టెంట్ దానిక్రింద టేబిల్ ,నాలుగు కుర్చీలు. ఈ సెటప్ లో ఇద్దరు ముసలోళ్ళు టేబిల్ పై రెండు రిసీట్ పుస్తకాలతో కూర్చొని ఉన్నారు. మా పదహారు మందికి టికెట్స్ తీసుకోవడంతో పనిపూర్తయిపోయిది. చల్లని సాయంత్రం గోదారి వడ్డున నడుచుకొంటూ అటుదగ్గరలో కొత్తగా కట్టిన ఇస్కాన్ శ్రీ కౄష్ణ దేవాలయం చూసేందుకు వెళ్ళాం ఇదే రోడ్డులో స్వామి అయ్యప్ప దేవాలయం భారీ ఎత్తున నిర్మాణదశలో ఉంది.ఆ చుట్టుపట్ల పెద్దపెద్ద పాలరాతి దిమ్మలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. వాటిని దాటి కొంత దూరం పెళ్ళాక గోదావరి వడ్డున విశాలమైన కాళీ స్థలంలో ప్రశాంత వాతావరణంలో కట్టిన కౄష్ణ దేవాలయానికి చేరుకున్నాం. దాన్ని చూస్తేనే అర్ధమవుతుంది రాజమండ్రి లో ఇప్పుడు చూడ దగిన కట్టడాల్లో ముఖ్యమయినవాటిలో ఒకటిగా మారిపోతుందని. దేవాలయం లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంది. అన్నిరకాల భక్తి సాహిత్యం పూజా సామగ్రి ప్రసాదాలు చేతి తయారీ వస్తువులు అమ్ముతున్నారక్కడ కాకుంటే రేట్లు చాలా హెచ్హుగా ఉన్నయి. జనవరిలో నేను తిరుమల వెళ్ళినపుడు కొత్తగా ఓపెన్ చేయబడిన ఇస్కాన్ దేవాలయనికి వెళ్ళాను.అక్కడ కూడా ఇలానే ఇన్నీ అమ్ముతున్నారు.ఎందువలనో తెలియదు గాని ప్రతీ వాటిపై 50 శాతం తగ్గింపుతో అందచేస్తున్నారు.వెంటనే నేను తెలుగు వచన రామాయణం , భాగవతం , భగవద్గీత మూడిటినీ తీసుకొన్నాను. అంతకు ముందు నే చూసిన ఈపుస్తకాల్లో లేని ఒక ప్రత్యేకత దాదాపు ఇరవై పేజీలవరకూ మధ్య మధ్యన ఆయిల్ ప్రింట్ ఫోటోలు ఉండటం. నా వద్ద ఆ సమయంలో ఎక్కువ డబ్బు లేకపోయింది లేదంటే ఇంకా తీసుకొనేవాడినే....................
మేటర్ ఎక్కువగా ఉండుటవలన మిగిలిన దాన్ని మరొక పోష్టుగా అందిస్తాను.{సశేషమన్నమాట}

Thursday, August 2, 2007

పసిడి పలుకులు.

పసిడి పలుకులు.


Monday, July 23, 2007

మిలీనియం పార్క్ { కొన్ని మార్పులతో }

మా ఊరిలో ఉన్న పెద్ద చెరువులు రెండిట్లో మొదటిది రామచంద్ర గ్రంధాలయం వీధిలో బాలసంగం ప్రక్కనుండగా రెండవది బస్టాండ్ ప్రక్కనుంది. బస్టాండ్ వైపుకాక రెండవవైపును పార్కుగా మార్చాలని పంచాయితీవారు అనుకొన్నారు. మా పంచాయితీవారికి ఈ కధా కాలంలో ఏమయిందో తెలియదుగాని పూనకం వచ్హినట్లుగా కొన్ని మంచి పనులు ఎడా పెడా చేసేయడం మొదలు పెట్టారు. అప్పటి మంచి పనులల్లో ఒకటి ఇంటింటికీ నాలుగునాలుగు మొక్కలు పంచడం మరియు రోడ్లప్రక్క పాతేందుకు. అవికూడా చందనం, జామాయిలు, కొబ్బరి, రేగు, పనస లాటి మంచివి. ఈమొక్కలను నర్సరీలనుంచి దిగుమతి చేసుకోకుండా నర్సరీలనుండి అనుభవమున్న పనివాళ్ళను తీసుకొచ్హి దాదాపు ఆరేడునెలలు అదే చెరువు గట్టున పంచాయతీవారే పెంచడంచేసారు. పంచడం అయిపోయాక మిగిలిన మొక్కలు ఏంచేయాలనే అలోచనలోనుంచి పార్కుగా మార్చాలనుకొన్నారేమో. మరి కొద్ది రోజులకు చిన్న పెద్దా మెక్కలతో మధ్యమధ్య సిమెంట్ బెంచీలతో అందమైన పార్క్ ముస్తాబయ్యింది. 2000 ముందు పూర్తవడంతో ఒకటవ తేదీన ప్రారంభోత్సవం చేయించారు. అందరూ మిలీనియం పార్కుగా పిలుస్తూండంతో పంచాయితీ వారే ఆపేరుతో ఒక బోర్డు తగిలించేసారు అలా అదేపేరు స్థిరపడిపోయింది. పగలు పంచాయితీ నౌకర్ ఒకతడు చూసుకొంటూ ఉండేవాడు. రోజూ జనం వచ్హి కాసేపు కూర్చొని వాళ్ళ చుట్టూ గడ్డీ గాదం పీకేసి వెళ్ళిపోయేవారు.అక్కడి వరకూ బాగానేఉన్నా సమస్య మొదలైంది రాత్రి సమయాల్లోనే. బస్టాండ్ దగ్గరగా ఉండటమూ ఆటోవాళ్ళ, టాక్సీ వాళ్ళ 'వాహనములు నిలుపు స్థలమూ దాని ప్రక్కనే అవుటచే రాత్రి సమయములలో వారి స్వేచ్హా ప్రపంచమునకు అడ్డాగా' పార్కు మారునను విషయము వేరు చెప్పనక్కరలేదనుకొనుచున్నాను. అక్కడ ఆనిశీధిలో ఆ నిశాచరులు జరుపు అకౄత్యములు వర్నింపతగనివై ఉండుటచే మరువాటి ఉదయమునకు ఆ ఉధ్యానవనము ఉక్కిరిబిక్కియై మహాసంగ్రామంలో వరిగి పడిఉన్న పీనుగులవలె నేలకూలిన వౄక్షాలతో తెగిపడిన తలల్లా దొరలుతున్న విస్కీ రమ్ము బ్రాందీ మొదలగు ప్రఖ్యాతబ్రాండు మధుపాత్రలతోనూ, ఆరగించలేక వదిలివేయబడిన అర బిరియానీ పొట్లాలతోనూ, బక్షించిన బిరియానీ అప్పటికే తిష్ట వేయబడిన మధువుతో ఇమడక తగవులాడి బయటకురికిన కారణమున ఏర్పడిన పోగులతోనూ, మరునాటిఉదయమునకు సర్వాంగ సుందరముగా దర్శనమిచ్హుచుండేది. వీరికి మేము మాత్రము ఎందుకు తీసిపోవలెననో లేక మా వంతు సహాయము మేమున్నూ చేసెదము అనో అటు చుట్టు ప్రక్కల నివసించెడి పురజనులునూ... తెల్లగా వెన్నెల విరజిమ్మే చంద్రుని గాని మేమున్నాంసుమా అనే కరెంట్ దీపాలను గాని లెక్క చేయక వారివారల పిలగాండ్ర సౌకర్యార్దం చెంబులునూ డొక్కులునూ నీటితో గొనిపోయి పిడకలు చేయించెడివారని ఉదయ సమయమున ముక్కును వేళ్ళతో భందించి ఆరహదారిన వేంచేసెడి పురజనుల కధనం. ఇది నిజము కాదని నొక్కి వక్కాణిస్తూ అడిగిన వారిని కరిచేలా ఉరికేవారక్కడి వారు.................ఇట్లు ప్రజోపయోగార్ధం ఏర్పాటు చేయబడిన ఈ ఉద్యానవనం ఇట్టి అకౄత్య కార్యక్రమములకు వేదికగా శోభించుట ఎంతమాత్రమూ సరిగాదని తక్షణం ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఒంటి మానవుని ఎంక్వయిరీకమీషన్ అను ఒకటి గుబ్బల ఎర్రియ్య అనే గ్రామ పంచాయితీ నౌకరుతో ఏర్పాటు చేయబడినది.తన ఎంక్వయిరీలో భాగంగా పరిశోధనాకార్యక్రమములునెరుపుటకై ఆ రాత్రి వెళ్ళిన ఎర్రియ్య మరునాటి ఉదయం ఆరెంపీ డాట్టర్ మసేనురావు గారి మకాంలో తెల్లని బాండేజీలతో తేలాడని తెలియ వచ్హింది. కారణాల కోసం మిలీనియం పార్క్ పరిసరప్రాంతములయందు వెదుకడానికి ప్రయత్నించగా దొరకినవేమిటనగా......గొల్లిగాడు. మా పిల్లల్నే చింతబరికెతో కొడతాడా, ఆడి చేతులిరిగిపోను. ఆడోళ్ళని కూడా చూడకుండా అంతలేసిమాటలంటాడా ఈడి జిమ్మడిపోను....ఇక వినలేక ఈ కారణాలు సరిపోతాయని పారిపోయిన సంగతి ప్రక్కనపెడదాం.---లోపాయికారీగా తెలిసిన విషయమేమంటే కుమ్మింది ఆడోళ్ళుకాదు ఆటో డ్రైవర్స్ అని కాని వాళ్ళను రెచ్హగొట్టింది మాత్రం వీళ్ళేనట.------ఇక ఎర్రియ్యను ఆ పరిస్థితిలో చూసిన పంచాయితీ పెద్దలు బెద్ద మీటింగ్ బెట్టి కుస్తీలు మల్లగుల్లాలు మరమరాలు తినేయడం పూర్తయ్యేకా తీసుకున్న నిర్ణయం, మరో ఎల్లయ్యనో,పుల్లయ్యనో ఒంటిమనిషి కమీషనర్ గా పెట్టేందుకు సాహసించలేక మిలీనియం పార్కును మిలీనియంలోనే అంతం చేసేయాలని తొక్కి చంపేయగా మిగిలిన మొక్కలనుకూడా పీకించెయ్యాలని నిర్ణయించేసారు... ....బల్లలను మాత్రం వదిలేసారు పిల్లలు బచ్హాలాడుకొనేందుకుఅలా మాఊరి మిలీనియం పార్క్ మట్టికలిసిపోయింది.శిదిలాలు మాత్రం మిగిలేఉన్నాయ్. పార్కు స్థిరమని తలచి ఫొటో తీయనందుకు మదీయకర్మంబిట్లే తగలడినదని మిక్కిలి చింతించుచూ...........శెలవ్."

Wednesday, July 18, 2007

ఫేవరెట్ ప్లేసులెవరికుండవ్?

నాకిష్టమైన ప్రదేశం.






Tuesday, July 17, 2007

ఒక జ్ఞాపకం

ఊరికి తూర్పుగా ఏరోటున్నాది.
చల్లగా మెల్లగా రా...రారా....... అంటున్నాది.
ఆటలు....సరదా సరదా ఈతలు ఎన్నోఉన్నాయన్నాది.
అటు ఏరూ...... ఇటు ఊరూ..... మధ్యలో మంగమ్మగారూ.
మధ్యలో మంగమ్మగారూ........?
వారెవరూ......? మధ్యలో ఎలా వచ్హారూ ....?
మంగమ్మగారూ..... మా స్నేహితుని మామ్మగారూ....
నా మనవడిని చెడగొట్టేవాడివి నువ్వే అంటారూ...
దొరికితే నామెదడు భోంచేసేస్తారూ....
తీసుకెళ్ళేది లేదిని గదమాయిస్తారూ...
గడప దాటితే మనవడి కాళ్ళిరగ్గొడతానంటారూ...
దొడ్డి గుమ్మం గుండా పారిపోయే మా ఇద్దరినీ చూసి నవ్వుకుంటారూ...
వెదవలు మాటవింటేనా...... అనుకుంటారు."

Sunday, July 15, 2007

రావి మొక్క

ఈ రావి మొక్కను బాగా చిన్నగా ఉన్నపుడు తీసుకొచ్హాను. అది పెరుగుతూ ఉంటే రెండుసార్లు కుండీలను మార్చాను. మరో రెండుసార్లు పైభాగమంతా కత్తిరించేసాను. అదిమాత్రం వామనుడిలా విపరీతంగా పెరిగిపోతూనేఉంది. ఇక కుండీ పగలగొట్టి నేలపై నాలుగయిదు ఇటికలను లేపేసి కొంత మట్టి తవ్వి దీన్ని పాతేసాను. ఇక ఇపుడు ఇది నాతో పాటే పెరుగుతుంది పెద్దవుతుంది. ఇంకా మాపిల్లలతోపాటుగా పెరుగుతూ ఇంకా ఇంకా పేద్దదయిపోతుంది. దాంతో కోతికొమ్మచ్హి అడుకోవచ్హు, ఊయల కట్టి ఊగచ్హు, దాని క్రిందో మంచమేసి హాయిగా అడ్డంగా పడుకోవచ్హు, అపై పిట్టలు రెట్టలు వెయ్యచ్హు "



నాకు ఈపోష్టుకు వచ్హిన కామెంట్స్ దౄష్టిలో పెట్టుకొని మరొక్కసారి మోడరేట్ చేయాలనిపించింది. మారుటేరు అనే ఊరినుంచి గోదావరిని ఆనుకొని ఉన్న కోడేరు అనే ఊరివరకూ 50 అడుగుల వెడల్పు గల రోడ్డు 7 కిలో మీటర్లవరకూఉంటుంది. ఈరోడ్ లో విపరీతమైన ఎండ వేడి కాల్చేస్తున్నపుడు కూడా స్థానికులు సైకిళ్ళపై తిరుగుతునే ఉంటారు.కాని ఎవరి వంటిమీదకూడా ఒక్క ఎండ పొడ కూడా పడేదికాదు . కారణం ఆరోడ్డుకు రెండు వైపులా మర్రి, రావి, గుగ్గిళం, మరియు చింత లాంటి చెట్లు వరుసగా ప్రక్కప్రక్కగా ఈ 7 కిలోమీటర్లూ పరచుకునుంటాయి. నిజాయితీ కలిగిన అధికార్లు ఎవరో అప్పుడెప్పుడో పుణ్యం కట్టుకొని పనులు ఖచ్హితంగా చేయించి ఉంటారు. ప్రతి సంవత్సరం రోడ్డు మీదకొచ్హే కొమ్మలను కొట్టేస్తుంటారు అవి మళ్ళీ పెరుగుతూ పోతుంటాయి. రోడ్డు పొడుగూతా ఎంతదూరంచూసినా రెండువైపులా గోడలా అద్భుతంగా కనిపించేది.

ఇదంతా ఒకప్పటి మాట ---మరి ఇప్పుడు..? వరదల కారణంగా కొన్నిపోతే, బాగాపెరిగిన చెట్ల తొర్రలలో రాత్రి వేళల పెట్రొల్ పోసి మంట పెట్టి దుర్మార్గంగా చెట్లను చంపేసే వారి వలన మరికొన్ని. దాదాపు 90 శాతం వరకూ పోయాయి. బోడి రోడ్డు మాత్రం మిగిలిందిప్పుడు. అటు వెళ్ళినపుడల్లా నాకనిపించేది మళ్ళీ పూర్వపు మాదిరి ఎవరు నాటుతారు నాటినా ఎప్పటికి పెద్దవయ్యేను అని. దీంద్వారా నాకు తెలిసిందేమిటయ్యా అంటే పూల పండ్ల మొక్కలు వేస్తే వాటి ఆలనా పాలనా ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. లేదా అవి చచ్హూరుకుంటాయి. కాని పైన చెప్పబడిన మొక్కలను ఎక్కడైనా వేసి మరచిపోయినా అవి పెరుగుతూ పోతాయ్. లేదా కొంత శ్రద్ధ చేసి వదిలేస్తే ఇంకా బాగా పెరుగుతాయ్. వీటి గురించి లాబాలు చెప్పక్కరలేదు మీకూ తెలుసు. నాకు అలాటి అవకాశం ఏది దొరికినా వదలను. ముందోసారి పంచాయతీలో ఇంటింటికీ రెండు మొక్కలు పంచుతుంటే వద్దనుకున్న వాళ్ళను బ్రతిమలాడి వాళ్ళను తీసుకెళ్ళి మరీ వాళ్ళమొక్కలను కూడా నేను తీసుకు తెచ్హుకున్నాను . తెచ్హినవన్నీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి.మా పెద్దమ్మగారింటికెళ్ళినపుడు రెండు మూడు బాదంకాయలను ఒకప్రక్కగా పాతి వచ్హేసాను ఆ సంగతి మరచిపోయాను కూడా. కొంతకాలానికి నేవెళ్ళెసరికి అక్కడొక మీడియం బాదం చెట్టుంది నాకు మహానందం కలిగింది. ఇవన్నీ నాకే ఉపయోగపడతాయనీ కాదు. నాకే ఉపయోగపడాలనీకాదు. నే చేస్తూ పోతానంతే అతరువాతంతా సర్వ ప్రయోజనం........

Tuesday, July 10, 2007

తోటపని.

జీవితంలో వేగం పెరిగి కొన్ని చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకొంటున్నాం. కొంచెం సమయం చిక్కించుకొని తోటపని లాంటివి చేసుకొంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మెదడు ఫ్రెష్ అవుతుంది.కాదా? ఉదయాన్నే లేచి నిన్న పాతిన మొలకలు ఎంత పెరిగాయో, ఏ మొగ్గలు పువ్వులుగా మారాయో, ఏ పూత పిందెలుగా మారాయో, చూసుకొంటూ, వాటిని శుభ్రం చేయడం నీళ్ళు పోయడం పెద్ద పనేంకాదుకధ.
అరె భయ్ ! గీడ కాలు పెట్టనీకి జాగ లేదు. గీ అపార్ట్ మెంట్లల మొక్కల్ గిక్కల్ అంటవ్. ఏడనుంచ్హొచ్హినవ్ దిమాఖ్ గిట్ట ఖరాభయిందర.
అరే ఏందే అన్న గట్లంటవ్. మొక్కలు పెంచనీకి జగా కావల్నా ఏంది. ప్లాంట్లున్నయ్ గాదె ఈడ కిడికిల ఒగటి, ఆడ టివి పక్కనొకటి, గాడ బెడ్రూంల జాగా ఉండెగాదె ఆడొకటి, ఇటు చూడన్నా గిసంటి ప్లేస్ల గులాప్పూల మొక్కెడితే రూంకేం అందమొత్తదన్నా........
ఇలా చెయ్యచ్హు అని నే చెపాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు కాకుంటే కొంచెం బద్దకం. ప్రొద్ధుటే లేచేందుకే ఎంతో కష్టపడాలి, ఇక ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలంటే మరెంత కష్టపడాలో .
తెల్లవారుజామున తీసిన రెండు ఫొటోలను ఇక్కడిచ్హాను. చూసి మీరానందిస్తే నాకూ ఆనందమే.







అందులో ఒక ఫొటో నే తయారు చేసిన మడి. చూసారుగా ఇది చాలా చిన్నపని కొంత నేల గడ్డపారతో తవ్వి మట్టి గడ్డలను చిన్నగా చిదిపి ఒక బకెట్ నీళ్ళు పోసి మెత్తగా ఉన్న మట్టిలో మెంతులుఒకప్రక్క, ధనియాలు ఒకప్రక్క, గోంగూర విత్తనాలు ఒక ప్రక్క, ఇలా ఎన్నైనా వేయచ్హు. మా అమ్మగారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్హుకుంటారు. వాళ్ళకూ వీళ్ళకూ కూడా ఇస్తుంటారు. చూసారా చిన్నపని వలన తాజా సరుకు దాంతో ఆరోగ్యం దాంతరువాత ఆనందం.

Sunday, July 8, 2007

నా ఒకానొక ఫ్రెండ్

నా స్నేహితుల లిస్టు కొంచెం పెద్దదే, అందులో నోరున్నవారూ,నోరులేనివారూ ఉన్నారు. నే సరదాగా అడుకొనే అలాంటి వాళ్ళలో ఒక ఫ్రెండును పరిచయం చేస్తున్నాను. భాగుంది కదూ?

Thursday, July 5, 2007

చందమామ కధల్లో పల్లె.

నేను చందమామ కధలు చదివేటపుడు కధల్లో చేప్పే ఒక ఊరు ఊరిప్రక్కన ఏరు దూరంగా కొండపై దేవాలయంవీటన్నిటినీ దానిలోని బొమ్మల సహాయంతో పూర్తిగా ఊహించేందుకు ప్రయత్నించేవాడిని. కాని వీలయ్యేది కాదు.చందమామలో శంకర్ గారి బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. చిన్న బొమ్మతో పెద్ద ప్రపంచాన్ని చూపే ప్రయత్నం చేసేవారాయన. నేనూ అలానే ఊరంటే ఇలా ఉండాలీ అనుకొంటూ ఒక బొమ్మగీసే ప్రయత్నం చేసా.....

Tuesday, July 3, 2007

సొంతడబ్బా.


---సొంత డబ్బాలో ఒకానొక పోష్ట్ ,,,సొంతడబ్బా అని ఎందుకంటే సహాధ్యాయుల బ్లాగులను సందర్శించినపుడు అనేకానేక రంగుల విశేషాలు"విషయమున్న విశేషాలే సుమండీ" కనిపించి కొంచెం కంగారు పుడుతుంది. అరెరే వీళ్ళంతా భలే రాసిపడేస్తున్నారు. మనం మన డబ్బా తప్ప వేరేం రాయలేకున్నాం ఎందుకని? ఎందుకనబ్బాఅనుకుంటూ ఉంటే నాలోవాడు చెప్తాడు. నీ బ్లాగు నీ ఇష్టం నీ సుత్తితో నువ్వు కొట్టు దెబ్బలు తినేవాడి గురించి నీకెందుకు. అందుకనే ధైర్యంగా ఇంకో "'డబ్బా'' వదిలెయ్ అన్నాడు. మరి కాచుకోండి.


నాకు వర్షం అంటే చాలాఇష్టం సాధారణంగా వర్షమొచ్హినపుడు అందరూ ఇంట్లో కూర్చుంటారు. నేనైతే వర్షంలోతడుస్తూ సైకిల్ పై రోడ్లవెంట తిరుగుతాను. అదేంసరదా అంటే నాక్కూడా తెలియదు. కాని వర్షం నన్ను వెనుకకుతోస్తూ ఉంటే ముందుకు పోవడం చాలా బాగుంటుంది. చిన్నగా కురుస్తూ ఉంటే మాత్రం చెరువు గట్టుకు వెళ్ళి ఇటు నుంచి అటు-అటు నుంచి ఇటు, తిరుగుతుంటా.. ఒరేయ్ అదేం పనిరా వానలో తడిస్తే రొంపడతాది రా పైకిరా పై నుంచి మా అమ్మ-అరుపులు వినిపిస్తుంటాయి. మనం వినిపించుకుంటేకద. చెరువు గట్టువెంట తిరిగే అలవాటు ఇప్పటిదికాదు. చిన్నపుడు ఏదైనా తప్పు చేసినపుడు మా అమ్మ చీపురులోంచి రెండుమూడు ఈనెలు తీసి వెంట పడితే దొరక్కుండా చెరువు చుట్టూ తిరిగేవాడిని. చెరువుకు కొంచెం దూరంగా ఒక చింతచెట్టుండేది దానిమానులో పుచ్హుపట్టి ఒకవైపు వరిగి పోయింది. వరిగి మళ్ళీ పెరగడంతో అది చూడ్డానికి విష్ణుమూర్తి శేషపానుపులా ఉంటుంది. అలిగినపుడు మనకదే ఆశ్రయం. చాలా సమయం వరకూ ఇంటికి వచ్హే వాడిని కాను. మా చిన్నక్క వచ్హి కొంతసేపు బ్రతిమలాడేది నేను నాకోపమంతా తనమీదచూపిస్తూ నేరాను పో! అనేవాడ్ని. బలవంతంగా లాక్కెళుతుంటే వదలమని కొడుతుండేవాడిని. భరించి మరీ తీసుకెళ్ళేది. అసలు నేను దెబ్బలు తినేదెక్కడ ఎప్పుడు మా అమ్మ చెయ్యెత్తినా తనే అడ్డంగా వచ్హేసేది దాంతో తనకీ పడిపోయేవి. చెరువుకు ఆవైపుగా పెద్ద కాళీ స్థలం ఉండేది. అక్కడ మరో ఎనిమిది చెట్లు అటు నాలుగు ఇటు నాలుగుగా వరుసగాఉండేవి. అటు చుట్టు ప్రక్కలవాళ్ళకదే' పేద్ద' ఆట స్థలం. కోతికొమ్మచ్హి ఆడినా కొండ కొమ్మచ్హి ఆడినా గూటీ బిళ్ళ, వేటికయినా మాకదే అడ్డాగా ఉండేది. చాలాకాలం తరువాత వాటిలో ఏడు చెట్లను కొట్టేయడం జరిగింది.

ఎనిమిది చెట్ల వల్లనే మాఏరియాను చింతల తోట అంటారట.ఏడు చెట్లు కొట్టేయగా మిగిలిన ఒకేఒక చెట్టు అదే ఇది.






Thursday, June 28, 2007

Wednesday, June 27, 2007

Wednesday, June 20, 2007

పరిచయం.


Tuesday, June 19, 2007

చేంతాడు