Friday, January 23, 2009

మావుళ్ళమ్మ



భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత.
పోయిన సారి పండుగకు ఇంటికి వెల్లినపుడూ భీమవరం వెళ్ళా ఆ విశేషాలు వికీలో రాస్తూ బ్లాగులో కూడా ఇస్తే భావుంటుందని రాస్తున్నా....
దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి
స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.



చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్దుడు " విగ్రహాలను చెక్కారు.

మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నది. సారి ఉత్సవాలకు వేసిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక ఒక్కొక్కరోజు నాలుగు ప్రసిద్ద కళాకారుల ప్రోగ్రాములు ఇక్కడ మామూలు. వాటిలో సురభి నాటకాలు కనీసం పది ఉంటాయిట( రోజూ ప్రోగ్రాముల లిస్టు పేపరుకు అదేలెండి జిల్లా ఎడిసిం లో వస్తుందట)

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేధికగా వెలుగొందుతున్నది. ఇక్కడ సనామనం పొందిన కొందరు కళాకారులు.

Friday, December 26, 2008

పెస్టివల్ పుస్తకాలు




అదేంటో గాని హైదరాబాదు ఏరకంగా సూసినా నాకు చెత్త సిటీలాగే కనిపిత్తాది. ఏదో కొన్ని ఇసయాల్లో తప్ప అలాంటిదే ఒకిసియం 'పుస్తకాల దుకాణాలు' మంచియ్యన్నీ ఇక్కడుంటం. మద్య అబిట్స్ విశాలాంద్ర సూత్తే భలే ముచ్చటేసింది. సూపరు సూపరు బుక్సు అన్నీ ఉన్నాయి. ఆత్రం కొద్దీ చేలా కొనేసాను. అంతే కాక సంవత్సరానికి సభ్యత్వం కూడా తీసుకొన్నా అప్పటికంటే కూడా మొన్నామధ్య జరిగిన బుక్కు పెస్టివల్కెళ్ళినపుడు ఇంకా చాలా మంచి పుస్తకాలు కొనేసే చాన్సు వచ్చింది. ఎలాగా మందగ్గర కార్డుందికద అందరికీ 10 పెర్సెంట్ అయితే మనకి 20 పెర్సెంట్ వచ్చుద్ది.
అయితే మేము అలాగెల్లినందుకు చాలామందికి మంచి జరిగిందండోయ్ అదేంటంటారా.
పెద్దపెద్ద పుస్తకాలు, ఎక్కువ రేట్లున్న పుస్తకాలు కొనాలనుకుని ఎనకాడేవోళ్లకు నా కార్డు బాగా ఉపయోగపడింది. నేను పెస్టివల్కి రెండుసార్లెల్లేను. మొదటి సారెల్లినపుడు మన గుంపోళ్ళ మీటింగ్ జరిగింది. అప్పుడన్నమాట. ఆ రోజున నింపాదిగా చూడాలనుకొనే పెద్దయ్యలు కొంతమంది తగిలి పెద్దపుస్తకాల కోసం మోజుపడితే కొనిపించీసేం. మల్రోజు క్రిస్మస్ కెళ్ళాం అప్పుడూ బాగా జనాలున్నారు. మొదట్రోజు తెలీటం చేత ఈ సారి చాలా మంది పుస్తక ప్రియులికి 20 పర్సెంట్ తగ్గీపిత్తాం కొనుక్కుంటారా అనడిగితే ఓయస్ అనీసేరు. దాంతో ఆళ్ళకి ఆళ్ళ ప్రెండ్స్ ఆళ్ళకి ప్రెండ్స్ అలా చాలామందిచేత పెద్దపెద్ద పుస్తకాలు,రేటెక్కువ పుస్తకాలు కొనిపించీసేం. ఆళ్ళూ ఆళ్ళ స్నేహితులూ, ఆళ్ళతో పాటు మేమూ చేలా ఆనందపడిపోయేం. ఇయ్యన్నె కాక మేంగూడా చాలా పుస్తకాలు కొనీసేం. మొదట్రోజు విజేత పబ్లికేషన్స్ వాళ్ళ సాపుకెళ్ళినపుడు పెద్దబాలశిక్ష ఎంతాని అడిగేం ' నూటతొంభై అసల్రేటు నూటిరవైకిచ్చేత్తాం తీసుకొండన్నారు. సరే మొత్తమంతా చూసేసాక మల్లొచ్చి తీసుకుందాం అనుకుని అన్నీ అయ్యేకా వచ్చి అడిగితే నూటిరవైయ్యన్నారు.అదేంటండే ఇందాకొచ్చి అడిగితే నూటిరవయ్యేనన్నారు ఇప్పుడు ఇరవై పెంచేసేరు అనగానే కొద్దిగా ఆగండి అని మా ముందున్న బేరం అదే పెద్దబాలశిక్షకు నూటయాబై ఇచ్చి వెళ్ళిపోగానే మాకు మరోటి నూట ఇరవై ఇమ్మని ఇచ్చేసేరు. ఇచ్చేత్తా అన్నారు మీరు ముందు అడిగారు కనుక ఆరేటు ఇప్పుడు కాదండి అని,
పోన్లే మనకైతే తక్కువకే వచ్చిందికద అనుకుని బయల్దేరేసాం.




ఆ మద్య విజయవాడ ఎళ్ళినపుడు ఎమొస్కో వాళ్ళను శ్రీపాద గారివి వడ్లగింజలు,క్షీరసాగరమధనం లాంటి నవల్లేమమయినా ఉన్నాయా ఆని అడిగితే ఈ మద్య అటువంటి నవల్లు ప్రింటింగ్ జరగటం లేదు, మాదగ్గరకూడా లేవు అన్నారు. అయ్యో అనుకొన్నా. బుక్ పెస్టివల్లో నాకా పుస్తకాలు దొరికేసినయ్యి. శ్రీపాదకధలు అనీ ఒకటి, పుల్లంపేట జరీచీర అనీ ఒకటి. ముందు చూళ్ళేదుకాని పుల్లపేట జరీచీర బుక్కులోనే ఇయ్యన్నీ ఉన్నాయ్. కాపోతే కధలు తగ్గించేసి చిన్నగా మార్చేసేరు. సరే ఏదైనా నాక్కావలసిన పుస్తకాలు దొరికినియ్యి అదే ఆనందం.

నేను తీసుకున్న పుస్తకాలు ఇయ్యి
1. ఒకయోగి ఆత్మకధ
2. అత్తగారి కధలు (భానుమతి)
3. అంపశయ్య (నవీన్)
4. రంగులరాట్నం (ముళ్ళపూడీ వెంకట రమణ)
5. బుడుబు ( శీ రమణ )
6. శ్రీపాద కధలు (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి)
7. పుల్లపేట జరీచీర (శ్రీపాద)
8. పెద్దబాలశిక్ష
9. ఆనాటి వాన చినుకులు (వంశీ)
10. మా పసలపూడి కధలు (వంశీ)
11. బాపు బొమ్మల రామాయణం (రమణ)
12. స్తోత్ర రత్నాలు (శ్రీనివాస్)

ఇంకా కూని మల్లది నవల్లూ, యందమూరి నవల్లూ కూడా

Thursday, August 28, 2008

మా ఊరి కృష్ణ మందిరం



మా ఊళ్ళో ఇంత వరకూ క్రిష్నాష్టమికి ఉట్టి కొట్టాలంటే వీదిలో టెంపరరీగా ఆరోజు మందం ఏదో వీలయినట్టు చిన్న పందిరి వేసి అక్కడొక క్రిష్నుడి పటం పెట్టి పండగ అయిందనిపించేవారు.
కొద్దిగా గట్టిగా అయిఒతే మాత్రం బాల సంఘం గాంధీ బొమ్మల దగ్గర మెయిను గుమ్మంపైన ఎప్పుడో రాజుల కుర్రోళ్ళు కట్టించిన మాదిరి బొమ్మ దగ్గర మాత్రం ఇప్పటి కుర్రోళ్ళకు ఉత్సాహం పోయినా అప్పటి కుర్రోళ్ళు ముసలోళ్ళయిపోయినా వాల్లే చిన్న బుడ్డోళ్ళను కూడా వేసుకొని తిరిగుతూ బాల సంఘపు పెద్ద గుమ్మం పైన కట్టిన మండపంలో ఉన్న చిన్న క్రిష్ణుడి బొమ్మ దగ్గరా, ఆచుట్టు పక్కలా చేతనైన అలంకారం చేసి క్రిష్ణాష్టమి కొద్దిగా ఘనంగానే చేసాం అనిపిస్తారు.

దాంతరువాత దానికంతే కొద్దిగా తక్కువగానే అయినా మేమూ బానే చేత్తాం అనిపించుకొనే మరో కుర్రోళ్ళ టీం బస్టాండ్ సెంటర్లో ఉంది. బస్టాండును ఆనుకొని కూలిపోడానికి సిద్దంగా ఉన్న సాయిబుల సీను సైకిలు షాపు పక్కన మొన్నామద్య కుర్రోళ్ళు చందాలేసుకొనీ, సెంటర్లోని కొట్లలో వసూలు చేసిన మొత్తం కలిపి అక్కడొక దిమ్మ కట్టి దానిపై చిన్న విగ్రహం పెట్టారు. అలా నిలబెట్టిన చిన్ని క్రిష్ణుడి విగ్రహం దగ్గర మాత్రం మొదటి దానికి విరుద్దంగా పిల్లగాళ్ళు దార్లో దొరికిన వాడ్ని దొరికినట్టుగా అడ్డంపడి అటకాయించి కొందరితో తిట్లు తిని మరీ వసూలు చేసిన కొద్దిపాటి పైకంతో బానే చేసేం అనిపించేవారు.



మొన్నా మద్య వరకూ సాయిబాబా గుడి లేకపోవడంతో అంతా పక్క టౌనుకు వెళుతుండేవారు. ఇప్పుడు అదీ కట్టేసారు. ఇది లేదూ అనుకోడానికి వీల్లేకుందా అన్ని దేవాలయాలూ విశాలంగా కట్టేసారు ఊళ్ళో. ఇక లేనిదల్లా ఒక్క క్రిష్ణుడి గుడి మత్రమే అనుకుంటూ ఉండే వాళ్ళం.

అయితే కోరికా తీరిపోయింది. నాకు మొన్న ఊరెళితే అది కూడా కనిపించి భలే హాచ్చర్యమేసింది. గుడి కట్టిన తీరు మరీ భలేగనిపించింది. చుట్టూ కాళీగా, ముందు రెండు వాటర్ పౌంటెన్లు, మద్యగా పాలరాతి క్రిష్నుడు. అబ్బా భలే అందంగా ఉంది. అరె చాలా ఎక్కువ చెపుతున్నాడు పిల్లోడు అనుకోవద్దు. పల్లెటూళ్ళో మాత్రం ఉంటే గొప్పగానే ఉంటదని మీకూ తెలుసు. (సాక్షానికి బొమ్మలు కూడా ఇచ్చానండోయ్)



ఇక మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటయా అంటే ఇక నుండి అక్కడ కూడా ఉట్టి కొట్టే ఉత్సవం భలే చేస్తారని....

Tuesday, July 15, 2008

రహదారిమిత్రులు


సాధారణంగా ఎవరి ఊరిని గురించిన సంగతులు వారు గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటే. అలానే గమనిస్తే మన ఊళ్లలో కొన్ని ప్రత్యేక మైన కేరక్టర్స్ కనిపిస్తుంటాయి. వాళ్లు అందరికీ గురుతుంటూ చాలా కాలం తరువాత అయినా మనం అక్కడికి వెళ్ళినపుడల్లా వాళ్లను గురించి ప్రత్యేకంగా అడుగుతుంటాం. అలాంటి ఒకరిద్దరు మా ఊళ్ళో కూడా ఉన్నారు.
మా ఊరు నరసాపురం, నిదదవోలుల మద్య మెయిన్ రోడ్డు నుండి రెండు, రెండున్నర కిలో మీటర్లు లోపలికుంటుంది. అందువలన రాత్రి పది దాటాక "రాత్రి" సినిమా మొదటిపార్టులా ఉంటుంది అక్కడి వాతావరణం. మనిషన్న వాడు కనిపించడు, లోపలికెళ్ళేందుకు ఏ విధమైన వాహనాలు ఉండవు. పదకొండు అయితే ఇక మరీ భయంకరం. దారంతా కొన్ని చోట్ల తప్ప పూర్తిగా కరెంటు దీపాలు కూడా ఉండవు. ఆ సమయంలో ఏ ముఖ్యమైన పని మీద అయినా ఆలస్యం అయిన వాళ్లకు చచ్చే చావే.
అనవసరంగా వచ్చాం రా' బాబూ అనుకొంటూ నడుస్తున్న వాళ్ళకు వెనుకగా దీపాల వెలుగుతోపాటు మోటార్ సైకిల్ సౌండ్ వినిపిస్తుంది. వెనుక సీటుపై పెద్ద అల్యూమినియం పాలకేను, దానికి రెండుప్రక్కలా మరో రెండు పాలకేనులు, ముందువైపు రెండు ఇత్తడి బిందెలు, ఇంకా డ్రైవింగ్ సీటుపై ఒక భారీ ఆకారం కనిపిస్తుంది. అది పాల వ్యాపారం చేసే గుబ్బల శ్రీనివాస్ అనే శాల్తీది. దారిలో నడిచెళ్లేది ఒకరే అయితే సీటులోనే ఏదో విదంగా ఇరికించి వాళ్ళనువాళ్ళకు కావలసిన ఇంటి దగ్గర్లోని దారిలో దించేస్తాడు. ఇద్దరుంటే వెనక సీటుపై కల పాలకేనుపై కూర్చోబెట్టి పడిపోకుండా ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చి భయ్యమని పోనిస్తాడు. ఆ సమయంలో ఎవరున్నా అక్కడ జరిగేదదే. మీ కేం భయ్యం లేదు నేను తీస్కేల్తా కదా జాగర్తగా అని భరోసాతో సైతం తీసుకెళ్లడం రోజూ పాల వ్యాపారం చేసి పొద్దుపోయిన తరువాత వచ్చే అతని అలవాటు. అసలే పాలకేను దానిపై మరో మనిషి కూర్చుంటే ఎలా ఉంటుంది. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టుగా అనిపిస్తుటుంది అలా ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొస్తున్నపుడు చూస్తే
ఇక రెండవ వ్యక్తి - పేపరు విలేకరిగా పనిచేస్తూ పదకొండు గంటలకు వచ్చే మారుతి. అతని సైకిల్ ప్రయాణంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఊరి వరకూ రావడం కూడా మామూలుగా కనిపించే దృశ్యమే. కొత్తవాళ్ళు మొహమాట పడుతారేమోనని అడిగి మరీ తీసుకెళ్ళడం ఇతడి ప్రత్యేకత.
అలసట పని ఒత్తిడి లాంటివి వారికి ఉండవా అనుకొంటాం మేము. పని చేసి చేసి అలసిపోయి కూడా రాత్రి సమయంలోలో అలా ఒకరికి హెల్ప్ చేయాలని అనుకోవడం అదీ తెలియని వారికి సైతం.
కనిపించకుందా సేవ చేసే ఇలాంటి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు
అవునా? కాదా?

Tuesday, April 8, 2008

హైదరా'బాధ 'లో

బ్లాగు మిత్రులందరకూ వందనాలు. మరి కొందరి బ్లాగు మిత్రులతో నేనుకూడా చేరేందుకు గ్రేటర్ అని గుర్తించిన అత్యంత చెత్త, కాలుష్య నగరమైన భాగ్యనగరమునకు జీవనోపాధికొరకై ఉధ్యోగము వెతుకుతూ వచ్చేసాను.కొంత వరకూ బాగుగనే ఉన్నా- ఎక్కువ కష్టకార్యమనబడినది మటుకు గధి వెతుకులాట అని తెలియబడినది. అందులోనూ పెండ్లి అయిన వారికి కొన్ని మినహాయింపులు కలవులెండి. కేవలం బ్రహ్మచారులమైన మమ్మే నిజముగా చారులలన్నట్లుగా ట్రీట్ చేస్తూ షాదీ అయిందా అని అడిగి లేదనంగానే 'చల్ చల్ రూమ్ గీమ్ నయ్' అని తరిమేస్తున్నారు.కావున బాధలకు పేరు పడిన హైదరా'బాధ 'లో ఎంతో ఓపికతో నివసిస్తూన్న యావన్మంది బ్రహ్మచారి బ్లాగ్మిత్రులకూ మనవి చేయునది ఏమనగా నాకు అత్యవసరముగా కూకట్పల్లి,హౌసింగ్ బోర్డ్, నిజాం పేట్ ఏరియాలలో ఏదో ఒక చోట ఒక గది కావలెను. మీకు లేదా మీ మిత్రులకు తెలిసిన' గది' విశేషాలు ఉంటే నాకు తెలియ చేయగలరని మనవి.

kiran kumar chava గారు చెప్పినందున బడ్జెట్ విషేషాలు కూడా చేర్చుతున్నాను. అద్దె - రెండు నుండి మూడు వేల వరకూ భరించగలను.వంట - వండుకొనుట 'సేప్ఫ్' అని తేలిన మిదట అలా డిసైడ్ అయిపోయాను.

పోస్టు ఇచ్చిన తరువాత
కొందరు ఇచ్చిన జవాబులు బావున్నా అవేవీ నాకు ఉపయోగ పడువిధంగా లేవు. దయచేసి నాకు ఉపయోగంగా జవాబులు ఉంటే మరింత సంతోషపడి ఉండేవాడిని


సదా కృతజ్ఞతలతో మీ.... విశ్వనాధ్

Sunday, March 2, 2008

పట్టి

పట్టి అంటే మళయాళ బాషలో కుక్క. మళయాళీలు పోడా పట్టి అంటూ ఉంటారు. మనది ఆ పట్టి కాదు. కాలవలను, బోదెలను దాటేందుకు ఒక దుంగను అడ్డుగా వేస్తుంటారు. గోదావరి జిల్లాలలో అలా కాలవలపై ఉండే దుంగలను పట్టి అని వ్యవహరిస్తుంటారు. తాటి, కొబ్బరి చెట్లను ఇలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న కాలవలకు చెట్ల కొమ్మలను వాడుతుంటారు. తమ పంట చేలకు నీళ్ళు పెట్టేందుకు ఈ పట్టి అనేదాన్ని ఆధారం చేసుకొని తాటాకులతో, కొబ్బరి ఆకులతో ఒక దడిలా కడతారు. దాంతో నీరు కొంతవరకూ ఆగి వాళ్ళ చేలలోకి వెళుతుంటుంది. పట్టి అనే వీటిపై నడి చేందుకు కొంత ప్రావీణ్యం అవసరం. అదే వర్షాకాలమైతే మరీ అద్భుతమైన ప్రావీణ్య అవసరం. కొత్త వారైతే నేర్వకుండానే డాన్సు చేయచ్చు తడిచిన వీటిపై. అయిటే అలాంటి సంధర్భాలలో కూడా పొలాల్లో పని చేసే కూలీలు పెద్ద మోపులను తలపై పెట్టుకొని సునాయాసంగా చక చకా నడిచి వెళ్ళిపోతుంటారు దీనిపై.
మా ఇంటికి దగ్గరలో చిన్న కాలువలు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుండీ పొలాలలో తిరగటం అలవాటైన నాకు అలాంటి పట్లపై నడవటం అలవాటే. అందుకే ఇలా.


కాకుంటే మా స్నేహితుల పరిస్థితేమిటో మీరూ చూడండి."

Saturday, September 29, 2007

నగర రహదారులకు మేమేల తీసిపోవలె

పల్లె రహదారులంటే బురదతో మట్టితో ఉంటాయని చాలమంది అనుకొంటుంటారు {ఒకప్పుడు చాలా ఉండేవనుకోండి}.ఇప్పుడు వాటికి విరుద్దంగా ఉంటాయని--ఉంటున్నాయని--నిరూపించేయాలనే చిన్ని ప్రయత్నం.
ఈ చిత్రాలు చూసి ప్రయత్న ఫలితం మీరే చెప్పడి.
నగర రహదారులకు మేమేల తీసిపోవలె
ట్రాఫిక్ జాములు రెడ్ సిగ్నల్స్ లేవోచ్

కాలుష్యం అంటే మాకేల తెలియును

ధుర్గంధం బురదలు కానవచ్చుటలేదేం

క్లీన్ & గ్రీన్ {మాదగ్గర చెప్పల్సిన అవసరముందా}

ప్రశాంతత జీవన వికాసాలు. కాలుష్యం కానరాని పల్లె అందాలు.
{కావని చెప్పలేరని పందెం}





Tuesday, September 18, 2007

మాఊరంటే నాకిష్టం

వేమూరి వేంకటేశ్వరరావు, మాఊరంటే నాకిష్టం : {తుని వ్యాసభాగము నుండి}
రైల్ మీల్భోజనం-విషయంలో కూడ తుని పర్యాటకులని బాగానే ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాలు ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మెడ్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడ చెప్పేవారు. భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని ఊరు మట్టిలో ఏమి ఉందో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి ఇంతా అంతా కాదు. దేశం అంతా ప్రసిద్ధి. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉండేవి. తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోయేవి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే పాత రోజులలో ఒక లగ్జరీ. తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని మా ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అనేవారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవాలలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం మా ఊరి వర్తకులకి ఉందనిన్నీ అప్పుడు తెలిసింది. స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబులో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లవుడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. తునిలో ఉన్న సామాన్య జనసందోహానికి అదొక్కటే రేడియో. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది! అరిగిపోయిన ఆ చదరంగం బల్ల మీద గళ్ళు కనిపించేవే కావు.పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యెష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యెష్టమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు,” అని తీర్పు చెప్పేరుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు...
నాకు ఈ వ్యాసభాగం చాలా నచ్చింది.కాని తెలుగు వికీలో ఈ వ్యాసాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ భాగాలనుండి చాలావరకూ కత్తిరించి తీసేయాల్సి రావడం బాగా అనిపించలేదు. కత్తిరించే భాగాలను ఒక టపాగా ఇస్తే... అనే ఆలోచన రావడంతో ఇది ఇలా మీ ముందుకొచ్చింది.

Tuesday, September 11, 2007

అమ్మాయి ఎందుకేడుస్తుంది.

ఈ మద్య మా ఫ్రెండ్స్ నన్ను బాగా మోసేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళకో కారణం దొరికేసింది. ఆమద్య మంచి మూడ్లో ఉన్నపుడు ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని భీభత్సంగా గీకేసాం... అయితే మనమెంత భీభత్సంగా గీకామో ఆ బొమ్మ అంత సున్నితంగా వచ్హేసింది. సరే బావుంది కదాని రూముకు తీసుకుపోయి చిన్నగా ఫ్రేం కట్టి గోడకు తగిలించా. అదిగో అదే పెద్ద తప్పయి పోయింది.... ఇంతకూ నే వేసిన లేదా గీసిన చిత్రం ఏమిటంటే విచారగా ఏడుస్తున్న ఒక అమ్మాయి. ఇక అప్పటినుండి దాన్నెవడు చూస్తే వాడు నన్ను మోసేయటం మొదలెట్టారు. ఒరే ఎందుకురా ఆ అమ్మయిని అలా ఏడిపిస్తావ్ అంటాడొకడు. ఏరా ఏంచేసావురా ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది అంటాడింకొకడు. ఎందుకురా అ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తుంటుంది అంటాడు మరొకడు. రోజూ ఎందుకురా అలా ఏడిపిస్తావ్ అడిగిందేదో ఇవ్వచ్హుగా ఎవరూ లేరనుకున్నవా తాట వలుస్తా అంటాడొకడు. ఈ రోజు కూడానా! రోజూ ఏడిపిస్తానే ఉంటవేంట్రా మరో డైలాగ్.. నాన్ స్టాప్ క్రైయింగ్లో గిన్నిస్ కెళ్ళాలనేంట్రా.... ఇలా నా మెదడు 'తడిగిణతోం తడిగిణతోం' అని వాయించేసుకుంటున్నారు. ప్రతిరోజూ.... ఇక వాళ్ళ బాధ పడలేక అక్కడినుంచి పీకేసి స్కాన్ చేసేసాను. ఇక చించి కుప్పతొట్లో ఆ బొమ్మను...అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది...

ఇది నే గీసిన అసలు బొమ్మ
"బొమ్మను క్లిక్ చేసి చూస్తేనే అమ్మాయి ఏడుస్తుందా లేదా అనేది తెలుస్తుంది"

రంగుల్లో అయితే ఎలాగుంటుందబ్బా అని.

Wednesday, August 22, 2007

పాపికొండల్లో రెండవ పోష్ట్.

ఇంతకు ముందు పోష్టులో కొంతవరకూ రాసాను ఇది కొనసాగింపు. మా ప్రయాణ ప్రయాణ విశేషాలలో రాజమండ్రి నుండి ఆ సాయంత్రం టికెట్స్ తీసుకొని వెనక్కొచ్హిన మేము శనివారం రాత్రి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. ఆదివారం ఉదయం 5 గంటలకు రేవులో ఉండాలని చెప్పారు. ఉదయం 5 గంటలంటే ఎవడులేస్తాడు. అందుకనే ముందురోజన్నమాట. అనుకున్నట్లుగా శనివారం సాయంత్రం మూటా ముల్లే సర్దుకొని అందరం బయలుదేరాం. మెయిన్ రోడ్డుకు వచ్హి ఎంతసేపు ఎదురు చూసినా రాజమండ్రి బస్సు మాత్రం రాలేదు. 'చత్ మంచి టైంలో బయలుదేరలేదురా మనం' మావాళ్ళకామెంట్స్ మొదలైనయ్. మరి బస్సే కావాలంటె ఇలాగే ఉంటుంది.ఏదో ఓదాంట్లో పోయేదానికి మరికొందరు నసుగుతుండటంతో అప్పుడే వచ్హిన రాజమండ్రి క్వారీ లారీ ఆపి దబదబా పైకెక్కేసారంతా..రావులపాలెం కడియం మీదుగా వేమగిరి రూట్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరగా వదిలేసిపోయాడు లారీవాడు. రోడ్డు మీద అంగుళానికో గొయ్యిఉండటం వలన లారీవాడు వచ్హిన స్పీడుకి మేము వెనుక ఎక్కడానికి సరిపోవడంతో ఎవడూ కొట్టకుండానే తన్నులు తిన్నవాళ్ళలా అయిపోయింది మా పరిస్థితి.అక్కడి నుండి పడుతూలేస్తూ ఆటోలకోసం వెతకటం మొదలెట్టారు. కాళీగా ఉన్న ఒక ఆటో వచ్హింది. అది అలా ఆగటం ఆలస్యం నేనంటే నేనని టపటపా ఎక్కేసారు. ఆరుగురెక్కవలసిన ఆటోలో పదిమంది ఎక్కేయడంతో ఆటోవాడు బిత్తరపోయి పోలీసులు పట్టుకుంటారు సార్ ఇంతమందెక్కేస్తే ఆన్నాడు. ఒరేయ్ నువ్వు దిగరా! అంటే కాదు నువ్వు దిగరా! అనుకొంటూ మొత్తానికి నలుగురు బయట పడ్డారు. వెంటనే ఇంకో రెండు ఆటోలు రావడంతో అందరం చకచకా ఎక్కేసాం. తిన్నగా మార్కండేయస్వామి గుడి దగ్గర దిగి అటుప్రక్కగా ఉన్న ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాం. ఒక రూము తీసుకొని బ్యాగులన్నీ ఒక మూల పడేసి స్నానాలు వగైరా పూర్తి చేసుకొని రోడ్లమీద పడ్డాం. కాసేపు అలాలా తిరిగి ముందే వివరాలు తెలియడంవలన మరుసటి రోజుకు ఏమేమికావాలో తీసేసుకోవాలనుకొన్నాం. బిస్చెట్ పాకెట్స్ , హౌసీగేం పాకెట్ మరియు పుస్తకం, చిప్స్ పాకెట్స్ , యాపిల్స్ , ఒక ప్లాస్టిచ్ చాప ఇలా చాలా ఐటెంలు తీసుకొన్నారు. అన్నీ కొనడం అయిపోయాక అక్కడ మంచి భోజనహొటల్ గురించి కొంత సమాచారం సేకరించి ఒక హొటెల్ కెళ్ళి భోజనం కానిచ్హి మెల్లగా తిరిగి రూముకు బయలుదేరాం. గదిలో ఒకేచాప ఉంది మేము ఒకటి కొని తెచ్హాం రెండిటితో ఇంతమంది ఎడ్జస్ట్ అవడం కష్టం కాబట్టి సత్రం వాళ్ళను బ్రతిమాలో మరెలాగో మరో రెండు చాపలు సంపాదించారు. తీసుకొచ్హిన చాపలు వేయటమే ఆలస్యం అన్నట్టుగా ఒరేయ్ నేనిక్కడరా,కొంచెం పక్కకి జరగరా, ఒరేయ్ నువ్విక్కడనుంచి పోరా,ఒరేయ్ నాక్కొంచెం చోటివ్వండిరా,నేనిక్కడ పడుకోనెహె పందిగాడు మీదకాళ్ళేస్తున్నాడు,ఏయ్ పక్కకు జరుగెహె,ఇలా అరుచుకొంటూ అడ్డదిడ్డంగా వాలిపోయారు ఉదయం 4 గంటలకు లేచి చకచకా కాలకౄత్యాలు ముగించి ఎవడి బ్యాగ్ వాడు భుజాన తగిలించి అందరూ తయారయిపోయారు. తయారవడం అయ్యారుగాని ఎవడూ కడలడం లేదు. పరిస్థితి ఏమిటంటే ! టీ గాని కాఫీ గాని పడితేతప్ప కదలనని మొరాయించే సాల్తీలు చాలాఉన్నాయి మా గ్రూపులో. బయటి పరిస్థితి చూస్తే చీకటి,చలి, ఇప్పుడెడు షాపులు తెరుచుకూర్చుంటాడు. సరే చూద్దాం లెమ్మని కొంతదూరం చూస్తూ పోయాం. టీ బడ్డీలైతే బొచ్హెడున్నాయిగానీ అన్నీ షర్టర్లు దించేసో బరకాల్తో మూసేసో ఉన్నాయ్ . మావాళ్ళు టీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక గోనెలబరకం లోపల నిద్రపోతున్న టీబడ్డీ ఆసామిని బ్రతిమాలోబామాలో మొత్తమ్మీద లేపారు. పాపం అతను వీళ్ళ గోల పడలేక స్టవ్ వెలిగించి టీ కాచి ఇచ్హేంతవరకూ వదల్లేదు. తేనీటి సేవనం అయ్యాక సంత్రుప్తి పడి మావాళ్ళంతా హుషారుగా రేవు వైపుగా నడక సాగించారు. ఉదయం మేము వెళ్ళేసరికే రేవులో విపరీతంగా జనం వచ్హిఉన్నారు. అప్పటికే రెండు వెళ్ళి పోగా ఇంకా వరుసలో నాలుగున్నాయి. మేము టికెట్స్ ఇచ్హే దగ్గరకు వెళ్ళి మా టికెట్స్ చూపించి ఎందులో కూర్చోవాలో అడిగాము. మీఇష్టం నాలుగిట్లో ఎందులోనైనా ఎక్కచ్హు. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయలుదేరేవే. అన్నాడు.ముందుగా ఉన్నది అప్పటికే సగంపైగా నిండిపోవడం వలన కాళీగా ఉన్న రెండవదాంట్లోకెళ్ళాం. అన్నిటికీ పైన కార్పెట్స్ వేసిఉన్నాయి కూర్చొనేందుకు వీలుగా. వెళ్ళిన మమ్మల్ని డైవర్ అడిగాడు. పైకెళతారా! లోనికెళతారా! అని. ముందుగా తెలిసిఉండటంవలన పైనే కూర్చుంటాం అని చెప్పాం. అప్పటికి టెంట్ వేయలేదు. కొంచెం ఎండ వచ్హాక వేస్తానన్నాడు.సరేనని చెప్పులు ప్రక్కన విడిచి కూర్చున్నాం అందరం.

అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా వెలుగు వస్తూ ఉంది బాగా చలిగాకూడాఉంది. మరికొద్ది సమయంలొనే నావ పూర్తిగా నిండిపోయింది. రెండు పార్టులుగా ఉండే నావక్రింది బాగంలో ఒకవైపు మాత్రమే జనాన్ని ఎక్కించారు. రెండవవైపు రెండు పెద్దసైజు గ్యాస్ స్టవ్వులూ, ఒక గ్యాస్ బండ, మరికొన్ని పెద్దా చిన్నా పాత్రలు, భోజనం వండేందుకు కావలసిన కూరగాయలు బియ్యం లాంటి సంబారాలు మూటలుగా ప్రక్కగా ఉన్నాయి. అప్పటికే ఒక ఆడమనిషి మరొక కుర్రవాడు ఉల్లిపాయలను పెద్దపేద్ద అల్యూమినియం ప్లేట్లలోకి చకచకా కోసేస్తున్నారు. నావపై ఎక్కేందుకు వేసిన పెద్దబల్లలను తీసేసారు ఇంజన్ స్టార్టయ్యింది. నావ గుండ్రంగా వెనుక నుండి ముందుకు తిరిగి మెల్లగా బయలుదేరింది. వడ్డున ఇంకా ఉన్న జనం, ఎక్కించేందుకు వచ్హిన బంధువులు చేతులూపిస్తుంటే మేమూ వాళ్ళకు టాటా చెప్పాం చేతులూపుతూ. ఒక్కొక్క రేవునూదాటుకొంటూ నావ పాత బ్రిడ్జి క్రిందుగా ముందుకు సాగిపోయింది. ఆరోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది సూర్యోదయాన్ని చూసేందుకు లేకుండా పొగమంచుమాదిరిగా విస్తరించి ఉంది. గొప్పరోజు పెట్టార్రా బాబూ ఇంకే రోజూ దొరకనట్టుగా ఇప్పుడుగాని వర్షం కొట్టిందంటే చచ్హామన్నమాటే. నవ్వుతూ మావాళ్ళ కామెంట్స్. అయితే కాసేపట్లోనే ఉదయపు కిరణాల ధాటికి మంచూ మబ్బులూ ఎగిరిపోయాయ్. రాజమహేంద్రి వెనుకగా దినకరుడు మెల్లగా పైపైకి తొంగిచూస్తున్నాడు.


వాతావరణం ఆహ్లాదంగా ఉండి మావాళ్ళు ఉత్సాహాంగా మాటల్లో పడ్డారు. రాజమండ్రి వైపు ఒడ్డును అనుసరించి కొతదూరంవరకూ వెళ్ళి ఆపై గోదారి నడి మధ్యకు తిరిగింది. అంత ప్రొద్దున్నే కూడా అక్కడక్కడా పైపైకి తొంగి చూస్తున్న ఇసుక దిబ్బల మధ్య చిన్నచిన్న పడవల్లో వలలతో చేపలు పట్టుకొంటూ చాలా మంది కనిపిస్తున్నారు.

OUR GROUP





బహుశా ఉదయపు మార్కెట్టుకు వేయడానికనుకుంటా. వాళ్ళందరినీ దాటుకుంటూ కొవ్వూరు మీదుగా పట్టిసీమ వైపుగా సాగిపోయింది. నీళ్ళమధ్య ఉండుట వలననుకుంటా ఒకవైపునుండి మాదిరిగా ఎండ వస్తున్నా చలిగాలి వీస్తుంది. ఏడున్నర ఎనిమిది మధ్యలో అందరికీ పేపర్ ప్లేట్లలో టిఫిన్ ఇవ్వడం మొదలెట్టారు. అందరూ ఎగబడి తీసుకోడం మెదలెట్టారు. అవును పాపం అప్పటికే అందరికీ కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్. ప్లేట్ లో మూడు మైసూర్ బోండా రెండుగరిటెల ఉప్మా తీసుకొచ్హి ఇచ్హాడొకతను అందులో కొబ్బరి చట్నీ లాంటిదేదో కూడా ఉంది. తినడం పూర్తయినతరువాత టీ తీసుకొచ్హారు వేగంగా వెళ్ళే నావ చుట్టూనీళ్ళు చల్లటి వాతావరణంలో అలా టీ తీసుకొనే మజానే మజా.


అల్పాహారం అయింతరువాత మరికొంత సేపట్లో మీడియం బ్రిడ్జి లాటి కొవ్వూరు గ్యాస్ పైప్ లైన్ కనిపించింది. సింగిల్ లైన్ వారది కట్టారు పెద్ద సైజ్ పైపులను గోదావరిమీదుగా కలుపుతూ వెళ్ళేందుకు.







దూరంగా మసకమసకగా పట్టీసీమ దేవాలయం కనుపిస్తున్నది. దగ్గరకు వెళ్ళే కొద్దీ మరింత అందంగా నీళ్ళలో ప్రతిఫలిస్తూ గోదావరి మధ్యలో చిన్న దీవి

దాన్ని చూస్తుంటే నా ఊహ తెలిసిన తరువాత వచ్హిన ప్రయాణం గుర్తొచ్హింది. అప్పటికి పట్టిసీమ బాగా అభివౄద్ది చెందలేదు. నిడదవోలు మీదుగా బస్సుపై వచ్హి ఇవతలి గట్టునుండి పడవలపై అటు వడ్డుకు వెళ్ళే వాళ్ళం లాంచీలు ఉండేవికావు. రోజుకు వచ్హే నలుగురైదుగురి కోసం లాంచి ఎవడు పెడాతాడు. పడవ దిగి వడ్డునుంచి దిబ్బ దగ్గరకు నదుచుకు వెళ్ళాక గుట్టపైకెళ్ళేందుకు మెట్లలాంటివేం ఉండేటివికావు రోజూ వచ్హే కొద్దిమందీ నడవగా ఏర్పడిన మట్టిదారిలోనే జాగ్రత్తగా ఎక్కవలసివచ్హేది. పైన చూస్తే కేవలం సున్నపురాయి ఇటుకలు కొండరాళ్ళతో కట్టబడిన దేవాలయాలు. సున్నపుకోటింగులు ఎక్కువై పెచ్హులుపెచ్హులుగా ఊడిపోతూనూ, కొన్నిచోట్ల ఇటుకలతో సహా సిమెంటు పెచ్హులుగా లేచిపోయిన గోడలు, దేవాలయాల లోపల కరెంటు లేక నల్లగా పొగచూరినట్టుగా ఉండేది. ఆదాయం లేని దేవాలయాల పరిస్థితి అలాగే ఉంటుందేమో. దేవాలయాల లోపలి పరిస్థితి బాగుండకపోయినా అక్కడి వాతావరణం చుట్టూ ప్రకౄతితో ప్రశాంతంగా భక్తి భావం పెంపొందించేలాఉండేది. వెనుక ఉన్న మండపంలో వంటరిగా కాసేపు కూర్చుంటే నిశ్శబ్దంగా ఉన్నపరిశరాలతో మనసుకు కొంచెందిగులుగా మరికొంచెం వైరాగ్యంగా అదోలా ఉంటుంది.


.అసలలాంటి ఫీలింగ్ రాని దేవాలయం దేవాలయంలానే అనిపించదు. క్యూలలో గుద్దుకొంటూ తోసుకొంటూ కేకలు గొడవ మధ్య ప్రశాంతంగా దేవుని ముందు నిల్చుని ఒక్క క్షణమైనా ధ్యానించగలమా. అటువంటి చోట్లకు వెళ్ళి ప్రయోజనమే లేదు ఏదో మనమూ వెళ్ళాం అనుకోవడంతప్ప. "