Tuesday, January 19, 2016

పెళ్ళికూతురమ్మ చెరువు తిరునాళ్ళు

పెళ్ళికూతురమ్మ చెరువు పేరుతో ఒక చెరువు అక్కడొక ఆలయం, ఆలయంలో పెళికొడుకు పెళ్ళికూతురు ఇదీ ఇక్కడ ప్రత్యేకత . ఇది పశ్చిమగోదావరి జిల్లా దేవ గ్రామానికి సమీపంలో ఆచంట, పెనుగొండ మండలాల మద్య కల ఒక చెరువు. 

దీని అసలు పేరు పద్మనాభుని చెరువు. ఇక్కడ గ్రామం కాని ఇళ్ళు కాని లేవు. ఇదొక చేల మద్య ఉన్న పెద్ద దిబ్బ వంటి పెద్ద విశాల కాళీ ప్రాంతం ప్రక్కన ఒక పెద్ద చెరువు ఒక చిన్న చెరువులు మాత్రమే ఉన్నయి. ఈ దిబ్బను వ్యవసాయదారులు కళ్ళాలు వేసుకోవడానికి, పంట నూర్పులకు, ఇతర అవసరాలకు వాడుకొంటారు. 

అలాంటి ఈ దిబ్బ మద్య ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఆలయంలో దేవతలెవ్వరో అని చూస్తే నుదుట బాసికాలు, బుగ్గన చుక్క తదితర అలంకారాలతో ఇద్దరు వధూవరులు కూర్చొని దర్శనమిస్తారు. విచిత్రంగా ఉన్న ఈ అలయ చరిత్రలోకెళితే పెనుగొండ నుండి ఆచంట వెళ్ళే మట్టిరోడ్డు ఈ చెరువుల గుండా వెళుతుంది. 

అప్పట్లో కలిగిన వాళ్ళు పల్లకీల్లో వెళ్ళడం జరిగేది. అలా పెనుగొండలో కల వైశ్యుల ఆడపడుచు వివాహం జరిగిన పిదప ఆచంటకు పయనమై ఈ మార్గం గుండా వెళుతున్నపుడు వరుడు మూత్ర విసర్జన కొరకు దిగి పని పూర్తిఅయిన పిదప కాళ్ళు కడుక్కోడానికి చెరువులో దిగబోయినపుడు  పాము కాటు వేయడం జరిగింది.
 దాంతో అతడు చెరువులో పడి మృతి చెందటం గమనించి అందరూ పరుగెత్తి అత్డి వద్దకు వెళ్ళి పరీక్షించి మరణించినట్టుగా నిర్ధారించారు. అది విని పల్లకిలో ఉన్న పెళ్ళీకూతురు ఒకప్రక్కగా వెళ్ళి అదే చెరువులో దూకి అమెకూడా మృతి చెందినది. అలా ఆమె ప్రతివ్రతాధర్మ ఇష్టపూర్వక మరణానికి వారినిద్దరినీ అక్కడే సమాది చేసారు.


మునుపు సరిగా పంటలు పండక ఇబ్బందులు పడే వారైన రైతులకు అలా జరిగిన తరువాత సుభిక్షంగా పంటలు పండటం, సరియైన సమయానికి వర్షాలు కురవడం, చుట్టుప్రక్కల అందరికీ అనుకూలమైన పనులు జరుగుతూ వారు ఏ కార్యం తలపెట్టినా అవి నిర్విగ్నంగా జరగటం వంటివి జరిగేవట. ఇవన్నీ అక్కడ సమాధి చేయబడ్డ వధూవరుల వలనే అనే నమ్మకం బలపడి అక్కడ వారి మూర్తులను కొలువుతీర్చి పూజలు చేయడం జరుతూండేది.  అదే కాక ఏఇంట్లో వివాహం జరిగినా వివాహానంతరం వధూవరులను ఈ దేవాలయానికి తీసుకురావడం జరుతూంతుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా ఇక్కడ మొక్కుకొని చేయడం కూడా చేస్తుంటారు.
ఈ అలయానికి అటు ఆచంట నుండి ఉత్సవాలను నిర్వహించేందుకు వైశ్యప్రముఖులు వస్తారు. ఇటు పెనుగొండ నుండీ ఆలయ నిర్వహణ జరుగుతున్నది. వేరెక్కడో ఊరిలో ఉన్న ఈ ఆలయానికి  రెండు పట్టణాల నుండీ ఆలయానికి ధర్మకర్తలుగా, నిర్వహణ జరగటం విచిత్రం.


మునుపు చిన్న ఆలయం ఉందేది దానిని 1982 లో పెద్ద ఆలయంగా మార్చారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మొదలు మూడురోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ అవే చేల గట్ల మీద, చెరువు ప్రక్క దిబ్బలమీద తిరునాళ్ళు జరుగుతాయి. ఒకప్పుడు అక్కడికి చేరుకోవడానికి మట్టి రోడ్లే ఉండేవి. ఇపుడు దగ్గరవరకూ కంకర రోడ్లు ఉన్నాయి, ఆచంట, మార్టేరులను కలిపేలా చెరువుకు కొద్ది దూరంగా తారురోడ్డు నిర్మించారు. సంక్రాంతికి పల్లెల మద్య జరిగే ఈ తీర్ధం, కోడి పందాలు, గుండాటలు, చూడటానికి వేల మంది వస్తుంటారు

No comments: